Telugu Global
NEWS

బెజవాడలో బతకలేం..

రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రక్రియ ప్రారంభమే కాలేదు.. అప్పుడే కృష్ణాతీరంలోని విజయవాడ నగర పరిధిలో అద్దె ఇళ్ల రెంట్లు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు శాసనమండలిలో బెజవాడలో అద్దె ఇళ్ల గురించి ప్రస్తావించారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. విజయవాడలో అద్దె ఇళ్లు దొరికే పరిస్థితి కన్పించడంలేదు. అంతేనా అద్దె ఇళ్లల్లో ఉండే వారి వీపు విమానం మోత మోగేలా ఇళ్ల యజమానుదారులు అద్దె ధరలను పెంచేస్తూ ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు అద్దె ఇళ్లల్లో […]

బెజవాడలో బతకలేం..
X

రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రక్రియ ప్రారంభమే కాలేదు.. అప్పుడే కృష్ణాతీరంలోని విజయవాడ నగర పరిధిలో అద్దె ఇళ్ల రెంట్లు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు శాసనమండలిలో బెజవాడలో అద్దె ఇళ్ల గురించి ప్రస్తావించారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.

విజయవాడలో అద్దె ఇళ్లు దొరికే పరిస్థితి కన్పించడంలేదు. అంతేనా అద్దె ఇళ్లల్లో ఉండే వారి వీపు విమానం మోత మోగేలా ఇళ్ల యజమానుదారులు అద్దె ధరలను పెంచేస్తూ ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు అద్దె ఇళ్లల్లో ఉండే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నెల 27న అసెంబ్లీలో చంద్రబాబు బెజవాడలో అద్దె ఇళ్లు దొరికే పరిస్థితి లేదని, రెంట్లు చుక్కలన్నంటుతున్నాయని, అందరికీ ప్రయోజన కరమైన రాజధాని ఏర్పాడాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే.. చంద్రబాబు అలా ప్రస్తావించడం చూస్తే విజయవాడ నగరంలో అద్దెదారుల దుస్థితి, అద్దె ఇళ్లకు ఎలాంటి డిమాండ్ ఉందో చెప్పవచ్చు.

రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ నగరానికి రాష్ట్ర నలుమూలల నుంచి నివాసం కోసం వచ్చే వారు అధికమయ్యారు. ముఖ్యంగా చిరువ్యాపారులు, విద్యార్థులు, పలువురు ఉద్యోగులు విజయవాడవైపు మళ్లడంతో నగరంలో అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఉన్నత విద్యనభ్యసించాలనే దిశగా విద్యార్థులు విజయవాడకు తరలివస్తున్నారు. దీంతో కోచింగ్ ల కోసం, రెగ్యులర్ కోర్సుల్లో చేరే విద్యార్థులు రెట్టింపయ్యారు. దీంతో అద్దె గృహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నేడు నగరంలో 1.80 లక్షల గృహాలుండగా, దీనిలో సుమారు 10.5 లక్షలకుపైగా జనాభా నివసిస్తున్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. అద్దెలు అధికంగా వసూలు చేసుకోవచ్చనే ఆలోచనలతో కుటుంబాలకు గృహాలు అద్దెకివ్వడానికి గృహ యజమానులు ముందుకురావడంలేదు. విద్యార్థులు, బ్యాచిలర్స్ కు గృహాలు ఇవ్వడానికే యజమానులు ఆసక్తిచూపిస్తున్నారు. విద్యార్థులైతే నలుగురు లేక ఐదుగురు కలిసి ఉంటారని, దీంతో బాడుగ ఎక్కువ డిమాండ్ చేయవచ్చనే యోచన గృహ యజమానులు ఉన్నారు.

వేసవి రావడం, మరో రెండు నెలల్లో ఉద్యోగులు తప్పనిసరిగా విజయవాడకు రావాల్సి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఎక్కువగా మంది ఇప్పుడే ఆవాసాలను వెతుక్కుంటున్నారు. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడమేగాక అద్దెలు హద్దులూ దాటుతున్నాయి. దీనికితోడు నగరంలో సాధారణంగా పన్నుల భారాలు పెరుగుతుండడంతో యజమానులు అద్దెలు ఇష్టమొచ్చినట్లు పెంచేస్తున్నారు. గతేడాది కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమో, వ్యాపార అవకాశాల కోసమో లేదా పిల్లల చదువుల కోసమో వేలాది కుటుంబాలు విజయవాడ పరిసర ప్రాంతాలకు వలసొచ్చాయి. ఈ తరుణంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు దొరకడం గగనమైపోయాయి. దొరికినా ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, బడ్జెట్ కు తగ్గట్టుగా ఉండడంలేదు. డిమాండ్ ఉండడంతో అద్దె పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతమున్న వారినీ ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అవివాహితులు, విద్యార్థులకు మాత్రమే అద్దెకిస్తున్నారు. గతంలో ప్రధానంగా ఇది లబ్బీపేటకు మాత్రమే పరిమితమైతే ప్రస్తుతం నలుమూలలకూ విస్తరించింది.

త్వరలోనే ఉద్యోగులు రాజధాని ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి సరిపోయిన విధంగా ఇళ్లులేవు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరపగా, కృష్ణలంకలో ఎటువంటి అధునాతన సౌకర్యాలూ లేకపోయినా రెండు గదులున్న ఇంటికి నెలకు రూ.4 నుంచి రూ.4,500 వరకూ అద్దె డిమాండ్ చేస్తున్నారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడు ప్రాంతాల్లో మూడు గదులున్న ఇల్లు రూ.8 వేలు పలుకుతోంది. దీంతో దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ చిరువ్యాపారలు, ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రోజువారీ కూలీ చేసుకునే వారయితే నగరంలో నివసించే పరిస్థితి కనబడడం లేదు. పట్టణ శివారు ప్రాంతాలైన తాడేపల్లి, ఉండవల్లి, నున్న ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

అపార్టుమెంట్లలో.. అపార్టుమెంట్లో సింగిల్ బెడ్ రూమ్ రూ.7 వేలు, డబుల్ బెడ్ రూమ్ రూ.13 వేలు, త్రిబుల్ బెడ్ రూమ్ కు రూ.16 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. వన్ టౌన్, అయోధ్యనగర్, పటమట, కృష్ణలంక ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్వహణా చార్జీలు అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకూ ఉన్నాయి. కాగా, విజయవాడ నగరంలో ఇటీవల కాలంలో అనేక రకాల పన్నులు పెరిగాయి. ఇంటిపన్ను నుంచి మంచినీటి పన్ను, యూజర్ చార్జీలు అదనంగా ఉన్నాయి. త్వరలో మరోసారి పన్నులు పెంచేందుకు పాలకులు సిద్ధమయ్యారు. విద్యుత్ చార్జీలూ పెరుగుతున్నాయి.

ఏడాదిలో అద్దెల్లో తేడా..

గతేడాది.. ప్రస్తుతం రూపాయలలో..

ప్రాంతం ఒకగది రెండుగదులు ఒకగది రెండుగదులు
కృష్ణలంక 1,800 2,500 2,700 4,500
వన్ టౌన్ 2,200 3,500 3,000 4,500
భవానీపురం 2,500 4,000 3,500 5,000
దుర్గాపురం 3,500 4,500 5,000 5,800
సింగ్ నగర్ 2,000 3,000 3,500 4,500
పటమట 2,000 2,500 2,300 2,500

First Published:  9 April 2015 4:06 AM GMT
Next Story