Telugu Global
Others

భూములు ఇస్తారా.. చస్తారా...

భూ సమీకరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున మోహరించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి 9.3 పత్రాలు తీసుకున్న ప్రభుత్వం, అదే పద్థతిని పరిహారం పంపిణీ విషయంలోనూ అనుసరిస్తోంది. మే 1వ తేదీలోపు పరిహారం తీసుకోకపోతే భవిష్యత్ లో ఇవ్వబోమని బెదిరింపులకు దిగుతోంది. దీనికోసం ఈ నెల 14న జీవో జారీ చేసింది. వివిధ విభాగాలకు చెందిన సుమారు 600 మంది సిబ్బందిని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. మే చివరి నాటికి రాజధానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉండడం, నేటికీ రైతులు […]

భూములు ఇస్తారా.. చస్తారా...
X

భూ సమీకరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున మోహరించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి 9.3 పత్రాలు తీసుకున్న ప్రభుత్వం, అదే పద్థతిని పరిహారం పంపిణీ విషయంలోనూ అనుసరిస్తోంది. మే 1వ తేదీలోపు పరిహారం తీసుకోకపోతే భవిష్యత్ లో ఇవ్వబోమని బెదిరింపులకు దిగుతోంది. దీనికోసం ఈ నెల 14న జీవో జారీ చేసింది. వివిధ విభాగాలకు చెందిన సుమారు 600 మంది సిబ్బందిని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. మే చివరి నాటికి రాజధానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉండడం, నేటికీ రైతులు ఒప్పందం చేసుకోకపోవడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. 9.14 అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనలు కఠినంగా ఉండడంతో రైతులు క్రిడాతో ఒప్పందం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో రైతులపై ఒత్తిడి పెంచి పని పూర్తిచేసుకోవాలనే పద్ధతిలో డీడీలిచ్చేందుకూ అనుసరిస్తోంది. దీనికోసం వివిధ విభాగాల నుంచి అధికారులను డిప్యూటేషన్ పై నియమిస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి పరిహారం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో వేగవంతంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగా నారాయణ రోజూ అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తూ డీడీలు తీసుకోవాలని రైతులపై ఒత్తిడి తెచ్చేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

గుంటూరులో సమీక్షలు ఏర్పాటుచేసి తీసుకోవాల్సిన ఎత్తుగడలు, చర్యలపై సమీక్షిస్తున్నారు. దీన్ని అమలు చేసేందుకు ఇప్పటికే 26 యూనిట్లు పనిచేస్తున్నప్పటికీ పరిహారం విషయంలో అనుకున్నంత ఫలితాలు రాలేదు. దీంతో ప్రతి గ్రామంలోనూ ఆరు బృందాలు ఈ నెలాఖరు వరకూ పర్యటించి పరిహారం డీడీలు పంపిణీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇది గ్రామల్లో ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తోంది. పరిహారం తీసుకోకపోతే అన్ని విధాలా నష్టపోతారని అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి చెబుతున్నారు. పొలాలు దున్నేస్తున్నారని, భవిష్యత్ లో కొలతలు వేయించుకునేందుకూ సాధ్యంకాదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. 9.14పై అగ్రిమెంట్ చేసుకోకపోతే అటు పంటలు వేసుకోలేక, ఇటు పరిహారం పొందలేక నష్టపోతారని చెబుతున్నారు. ఇదే విషయంపై పంటలు వేయవద్దని, వెంటనే అగ్రిమెంట్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్ (9.14) నిబంధనలేవీ రైతులకు తెలియకుండా ఉండేందుకు వాటిని ఎత్తేశారు. కేవలం మూడు సంతకాలతో పనిముగించే విధంగా ప్రణాళిక వేశారు. దీనిపై టీడీపీకి చెందిన రైతుల్లో పెద్దఎత్తున అనుమానాలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయినా తాము రైతుల పక్షాన ఉన్నామని చెప్పుకునేందుకు చివరి నిమిషంలో పరిహారం జీవో విడుదల చేసింది. పూలింగ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ‘కార్పొరేట్’ ప్రయోగం మరోసారి బయటపడింది.

కాగా, రైతులు డీడీలు తీసుకోకపోవడం పెద్ద తలనొప్పిగా మారితే, మరోవైపు కోర్టు కేసులూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు వివిధ కారణాలతో సుమారు 600 మంది రైతులు పూలింగ్ ప్రక్రియపై హైకోర్టునాశ్రయించారు. మరో 300 మంది పిటీషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవి కాకుండా క్రిడా చట్టం చెల్లుబాటు కాదంటూ విశ్రాంత న్యాయమూర్తులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Also Read గారడి విద్యలో బాబు దిట్ట‌ !

First Published:  26 April 2015 6:58 AM GMT
Next Story