Telugu Global
NEWS

ఎర్రబెల్లికి, కడియంకు ఎందుకు పడటం లేదు?

వరంగల్ లో ఎర్రబెల్లి దయాకర్రావు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అస్సలు పొసగడం లేదు. ఇటీవల జరిగిన మిషన్ కాకతీయ వేదికపైనే ఇద్దరు నువ్వెంత.. అంటే నువ్వెంత.. అంటూ వాగ్వాదానికి దిగారు. ఇంతకీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో రాజకీయ విభేదాలు ఎందుకొచ్చాయో తెలుసా? తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిత్యం కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే ఎర్రబెల్లి సైతం టీఆర్ […]

ఎర్రబెల్లికి, కడియంకు ఎందుకు పడటం లేదు?
X

వరంగల్ లో ఎర్రబెల్లి దయాకర్రావు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అస్సలు పొసగడం లేదు. ఇటీవల జరిగిన మిషన్ కాకతీయ వేదికపైనే ఇద్దరు నువ్వెంత.. అంటే నువ్వెంత.. అంటూ వాగ్వాదానికి దిగారు. ఇంతకీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో రాజకీయ విభేదాలు ఎందుకొచ్చాయో తెలుసా? తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిత్యం కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే ఎర్రబెల్లి సైతం టీఆర్ ఎస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం సైతం మంత్రి పదవి ఇవ్వడానికి అంగీకరించారని ప్రచారం జరిగింది. ఆఖ‌రునిమిషంలో కడియం అభ్యంతరం చెప్పారు. ఎర్రబెల్లి పార్టీలోకి వస్తే తాను పార్టీలో ఉండ‌న‌ని అధినేత కేసీఆర్ కు స్పష్టం చేశారు. దీంతోపార్టీ పునరాలోచనలో పడింది.
ఒక‌ప్పుడు క‌డియం, ఎర్ర‌బెల్లి టీడీపీలో ప‌నిచేసిన వారే. క‌డియం శ్రీ‌హ‌రి మంత్రిగా వివిధ శాఖ‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించి స‌మ‌ర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. జ‌న‌బ‌లంతోపాటు, బుద్ధిబ‌లం, వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించగ‌ల‌ర‌ని మంచి పేరుంది. 2008లో టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లిన స‌మ‌యంలోనూ క‌డియం టీడీపీ త‌ర‌ఫున పోటీకి సిద్ధ‌మ‌య్యారు. చంద్ర‌బాబు కూడా ప్ర‌త్యేక తెలంగాణ‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట‌మి పాల‌య్యారు. 2013లో టీఆర్ ఎస్‌లో చేరి జిల్లాలో కీల‌క‌నేత‌గా ఎదిగారు. ఎర్ర‌బెల్లికి వాక్చాతుర్యం త‌క్కువ‌. రాజ‌కీయ చ‌తుర‌త అంత‌గా లేదు. అందుకే 5 సార్లు టీడీపీ టికెట్‌పై గెలిచినా నిన్న‌గాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఎదుగుతుంటే చూస్తూ కూర్చోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. దీంతో పార్టీ మారితే క‌నీసం మంత్రి ప‌ద‌వైనా వ‌స్తుంద‌నుకున్న ఎర్ర‌బెల్లికి క‌డియం మోకాల‌డ్డారు. ఇది ఆయ‌న‌కు మింగుడు ప‌డ‌లేదు. డిప్యూటీ సీఎం రాజ‌య్య‌కు పార్టీ ఉద్వాస‌న ప‌ల‌క‌డంతో అదే ప‌ద‌వి శ్రీ‌హ‌రిని వ‌రించింది. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌కుండా చేసిన వ్య‌క్తి ఉప‌ముఖ్య‌మంత్రిగా త‌న‌ముందే ఎద‌గ‌డాన్ని ఎర్ర‌బెల్లి ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. మొత్తానికి జిల్లాపై ఆధిప‌త్యానికి ఇద్ద‌రు నేత‌లు పోటీ ప‌డుతున్నా.. ఎప్ప‌టిక‌ప్పుడు శ్రీ‌హ‌రిదే పై చేయి అవుతూ వ‌స్తోంది.

First Published:  12 May 2015 6:18 AM GMT
Next Story