దేశ వ్యాప్తంగా మిన్నంటిన పెట్రో నిరసనలు
దేశ వ్యాప్తంగా పెట్రో నిరసనలు మిన్నంటాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా… మోడీ రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఉద్యమించారు. పెంచిన పెట్రో ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండు చేశారు. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబాయి, చెన్నై తదితర నగరాల్లో కాంగ్రెస్తోపాటు వామపక్షాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. బీజేపీ ప్రభుత్వం పేదవాడిని, మధ్య తరగతిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగిందని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు దుయ్యబట్టారు. పెట్రో ధరలు తగ్గాయని ఢంకా భజాయించి చెప్పేటప్పుడు తగ్గించిన ఛార్జీలు […]
BY sarvi16 May 2015 4:32 AM GMT
X
sarvi Updated On: 16 May 2015 4:41 AM GMT
దేశ వ్యాప్తంగా పెట్రో నిరసనలు మిన్నంటాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా… మోడీ రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఉద్యమించారు. పెంచిన పెట్రో ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండు చేశారు. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబాయి, చెన్నై తదితర నగరాల్లో కాంగ్రెస్తోపాటు వామపక్షాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. బీజేపీ ప్రభుత్వం పేదవాడిని, మధ్య తరగతిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగిందని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు దుయ్యబట్టారు. పెట్రో ధరలు తగ్గాయని ఢంకా భజాయించి చెప్పేటప్పుడు తగ్గించిన ఛార్జీలు నామమాత్రంగా ఉంటుండగా పెంచడం వచ్చే సరికి భారీగా భారం వేస్తుందని వారు దుయ్యబట్టారు. అభివృద్ధి ముసుగు వేసుకున్న మోడీ ప్రభుత్వం దారిద్య్రాన్ని పెంచే చర్యలకు తెగబడుతుందని వారు విమర్శించారు.
ఈ నిరసన కార్యక్రమాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మిన్నంటాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను భారీగా ర్యాలీలు జరిపి నిరసన తెలిపాయి. హైదరాబాద్లో సీపీఐ ఆధ్యర్వంలో ఈ ర్యాలీ జరిగింది. చాడ వెంకటరెడ్డి దీనికి నేతృత్వం వహించారు. పేద, మధ్య తరగతిపై భారం మోపుతున్న పెట్రో ధరలను పెంచడం అన్యాయమని ఆయన అన్నారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీలు తొలగించి పేదవాడిపై భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండు చేశారు. పెట్రో చార్జీలను పెంపును నిరసిస్తూ విజయవాడ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత బాబురావు మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం కావడానికి దగ్గరలో ఉంది, ప్రథమ వార్షికోత్సవ కానుకగా ఛార్జీలను పెంచారని విమర్శించారు. మంచి రోజులు వస్తాయి అని చెప్పారు కాని ముష్టి రోజులు వచ్చాయని, తగ్గించాల్సిన తరుణంలో రేట్లను పెంచుతారా అని ప్రశ్నించారు. 33 శాతం ఎక్సైజ్ డ్యూటి, వ్యాట్ విధించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా లాభం వస్తోందని తెలిపారు. వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఆటోలకు తాళ్ళు కట్టి లాగుతూ సీపీఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడం కోసమే ధర పెంచారని విశాఖపట్నంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటుసభ్యుడు పి.మధు విమర్శించారు. పదిహేను రోజుల్లో రెండుసార్లు పెంచడం అది కూడా సామాన్యుడు భరించలేనంత స్థాయిలో ఉండడం ప్రభుత్వ సిగ్గులేని తనాన్ని తెలియజేస్తుందని ఆరోపించారు. ఈ 15 రోజుల్లోనే పెట్రోలు ఏడు రూపాయలకుపైగా డీజిల్ ఐదు రూపాయలకు పైగా పెంచేశారని, ఈరోజు సామాన్యుడు కూడా మోటార్ సైకిల్ లేకుండా పనులు చేసుకునే పరిస్థితి లేదని అలాంటి వ్యక్తిపై భారం మోపడం న్యాయమా అని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు బంగారం కన్నా పెట్రో ఉత్పత్తులే భారమయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని తిరుపతిలో నిరసన కారులు అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీపీఐ-ఎంఎల్ మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించక పోతే ఉద్యమం తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.
Next Story