Telugu Global
Others

రాజధాని ‘ప్రైవేట్’ పరం

రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు 99 ఏళ్లపాటు లీజుకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కోసం ఇటీవలే కేపిటల్ సిటీ డెవలప్ మెంట్ అండ్ మేనేజ్ మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా అమరావతిలో ప్రైవేట్ కంపెనీలకు ద్వారాలు తెరిచింది.      సీసీడీఎంసీ ద్వారా అమరావతిలో చేపట్టబోయే ప్రాజెక్ట్ ల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాజధానిలో చేపట్టే ప్రాజెక్ట్ ల్లో పెట్టుబడి […]

రాజధాని ‘ప్రైవేట్’ పరం
X

రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు 99 ఏళ్లపాటు లీజుకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కోసం ఇటీవలే కేపిటల్ సిటీ డెవలప్ మెంట్ అండ్ మేనేజ్ మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా అమరావతిలో ప్రైవేట్ కంపెనీలకు ద్వారాలు తెరిచింది.

సీసీడీఎంసీ ద్వారా అమరావతిలో చేపట్టబోయే ప్రాజెక్ట్ ల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాజధానిలో చేపట్టే ప్రాజెక్ట్ ల్లో పెట్టుబడి భాగస్వామికి లేదా ప్రైవేట్ పార్టీలకు భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ 2015 మే 2న దీనికి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 110 ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేసిన విషయం బయటపడకుండా, ఆ జీవోను వెబ్ సైట్ లో పొందుపర్చకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ నెల 2వ తేదీన జీవో నెంబర్ మాత్రమే పెట్టి వివరాలను ఖాళీగా అంటే బ్లాక్ లిస్ట్ లో ఉంచారు. అయితే ఇందులో పొందుపరిచిన విషయాలు పరిశీలిస్తే.. రాజధానిలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్ట్ ల విషయంలో ప్రైవేట్ సంస్థలకు లీజు పద్ధతిలో భూములు అప్పగించడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాజధానిలో అభివృద్ధి చేసిన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), లేదా భూమిని లేదా ఉపాధి కల్పన పెట్టుబడి భాగస్వామికి లేదా ప్రైవేట్ పార్టీలకు 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు.

అసలా జీఓలో ఏం దాగుంది.. భూమిని 99 ఏళ్లపాటు లీజుకివ్వడం అంటే దాదాపు నాలుగు తరాలపాటు ప్రైవేట్ పార్టీలకు స్వాధీనం చేయడమేనని స్పష్టమవుతోంది. లీజు పొందిన పార్టీలు ఆ భూమి విలువ ఆధారంగా మార్కెట్ నుంచి ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు కల్పించారు. 2013 కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన సీసీడీఎంసీ విధులు, అధికారాలను జీవోలో నిర్థారించారు. ఏడాది వారీగా లీజును వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తుంది. 99 సంవత్సరాలకు లీజుకిస్తూ ఒప్పందాలు (డీల్) చేసుకుంటుంది. నూతన రాజధానిలో రవాణా, విద్యుత్, మంచినీటి సరఫరా, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సమాచార పరిజ్ఞానంతోపాటు ఆ ప్రాంతంలో ఇతర మౌలిక వసతుల పనులను నేరుగా గానీ, పీపీపీ విధానంలోగానీ అప్పగించవచ్చునని జీవోలో స్పష్టం చేశారు. అది కూడా ‘వయబులిటీ స్మార్ట్ సిటీ ప్రిన్సిపల్స్’ మేరకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. అంటే నామినేషన్ విధానంలో ఈ మౌలిక వసతుల పనులను అప్పగిస్తారని స్పష్టమవుతోంది. అలాగే నూతన రాజధానిలో వైద్య సేవలు, స్పోర్ట్స్, విద్య, వినోదం వంటి సామాజిక మౌలిక సదుపాయాలను వివిధ భాగస్వాముల ద్వారా చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సీఆర్డీఏ ఆమోదం పొందిన రాజధాని మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీసీడీఎంసీ ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది. తిరిగి ప్రణాళికను సీఆర్డీఏ ద్వారా ఆమోదం తీసుకుని కార్యాచరణను ప్రారంభిస్తుంది. నూతన రాజధానిలో అన్ని రకాల సేవలకు సంబంధించి డిజైన్, అభివృద్ధి, అమలు నిర్వహణ పనులను సీసీడీఎంసీ చేపడుతుంది. భవన నిర్మాణాల ప్రణాళికలను ఇతర మౌలిక వసతుల కల్పనలను పరిశీలించి సిఫార్సు చేసే అధికారం సీసీడీఎంసీకి ఇచ్చారు. ప్రైవేట్ డెవలపర్స్ నుంచి డెవలప్ మెంట్ చార్జీలను సీసీడీఎంసీ వసూలు చేస్తుంది. సీఆర్డీఏ నిర్థారించిన మేరకు వినియోగదారుల నుంచి యూజర్ చార్జీలు, టారిప్ ను సీసీడీఎంసీ వసూలు చేయనుంది. అలాగే రాజధాని పట్టణ నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేస్తారు. రాజధాని సిటీ అభివృద్ధిలో భాగంగా ఉపాధి కల్పన, పెట్టుబడి భాగస్వామితో పాటు ఇతర ప్రైవేట్ ఏజెన్సీలను సీసీడీఎంసీ ఎంపిక చేయనుంది.

First Published:  18 May 2015 6:46 AM GMT
Next Story