Telugu Global
Others

బీజేపీ- టీఆర్ ఎస్ దోస్తీ ప‌క్కా ?

లేదు..లేదంటూనే టీఆర్ ఎస్‌-బీజేపీలు సన్నిహితంగా మెల‌గుతున్నాయి. ప్ర‌ధాని మోదీ ప్రాజెక్టు అయిన‌ స్వ‌చ్ఛ భార‌త్‌లో భాగంగా స్వ‌చ్ఛ‌ హైద‌రాబాద్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. నాలుగేళ్ల‌పాటు నిర్విరామంగా సాగుతుంద‌ని కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం ఇరుపార్టీల మ‌ధ్య కుదిరిన రాజ‌కీయ అవ‌గాహ‌న‌ను చెప్ప‌క‌నే చెపుతోంది. అస‌లు టీఆర్ ఎస్‌- బీజేపీ దోస్తీపై నాలుగైదు నెల‌లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కేసీఆర్ కూతురు ఎంపీ క‌విత‌తోపాటు, మ‌రో ఎంపీకి కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని, బ‌దులుగా ఇద్ద‌రు బీజేపీ […]

బీజేపీ- టీఆర్ ఎస్ దోస్తీ ప‌క్కా ?
X
లేదు..లేదంటూనే టీఆర్ ఎస్‌-బీజేపీలు సన్నిహితంగా మెల‌గుతున్నాయి. ప్ర‌ధాని మోదీ ప్రాజెక్టు అయిన‌ స్వ‌చ్ఛ భార‌త్‌లో భాగంగా స్వ‌చ్ఛ‌ హైద‌రాబాద్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. నాలుగేళ్ల‌పాటు నిర్విరామంగా సాగుతుంద‌ని కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం ఇరుపార్టీల మ‌ధ్య కుదిరిన రాజ‌కీయ అవ‌గాహ‌న‌ను చెప్ప‌క‌నే చెపుతోంది. అస‌లు టీఆర్ ఎస్‌- బీజేపీ దోస్తీపై నాలుగైదు నెల‌లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కేసీఆర్ కూతురు ఎంపీ క‌విత‌తోపాటు, మ‌రో ఎంపీకి కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని, బ‌దులుగా ఇద్ద‌రు బీజేపీ ఎమ్మెల్యేల‌కు రాష్ట్ర మంత్రివ‌ర్గంలో బెర్తులు ఖాయమ‌ని పుకార్లు వ‌చ్చాయి. కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు ఇరుపార్టీల నేత‌లు ఆ వార్త‌ల‌ను ఖండిస్తూ వ‌స్తున్నారు. ఇరుపార్టీలు ల‌బ్ధిపొందే ఈ అవ‌గాహ‌న ఏనాడో ముహూర్తం ఖ‌రారైంది. తాజాగా క‌విత కూడా కేంద్రం ఆహ్వానిస్తే ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి అభ్యంత‌రం లేద‌ని వ్యాఖ్యానించి ఇక చేరిక లాంఛ‌న‌మేనన్న సంకేతాలు ఇచ్చారు.
మ‌జ్లిస్ సంబంధాలకు మంగ‌ళ‌మేనా?
కానీ, గ్రేట‌ర్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే మ‌జ్లిస్‌తో దోస్తీ చేస్తున్న టీఆర్ ఎస్ ఆ పార్టీతో సంబంధాలు చెడిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతూ వ‌స్తోంది. బీజేపీ రూపొందించిన స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌ను అధికారికంగా చేప‌డుతున్న టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై మ‌జ్లిస్ పార్టీ గుర్రుగానే ఉన్నా బ‌య‌ట‌ప‌డ‌టం లేదు. ఎందుకంటే న‌గ‌రంలో ఆ పార్టీ ఎవ‌రితోనూ చెలిమి చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రైనా దాని వెంట వెళ్లాల్సిందే. సంస్థాగ‌తంగా న‌గ‌రంలో మ‌జ్లిస్ పునాదులు అంత గ‌ట్టిగా ఉన్నాయి మ‌రి. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను మ‌జ్లిస్ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. బీజేపీతో దోస్తీ చేస్తే గ్రేట‌ర్‌లో మ‌జ్లిస్ మ‌ద్ద‌తివ్వ‌ద‌న్న విష‌యం కేసీఆర్‌కు తెలియ‌నిది కాదు. గ్రేట‌ర్ పీఠం క‌న్నా రాష్ట్రంలో చేప‌డుతున్న మిష‌న్ కాక‌తీయ‌, వాట‌ర్‌గ్రిడ్ ప‌థ‌కాల‌కు నిధుల స‌మీక‌ర‌ణ ఆయ‌నకు ముఖ్యం. కేంద్రంతో స‌ఖ్య‌తగా ఉంటేనే నిధులొస్తాయి. పైగా పొరుగు రాష్ట్ర సీఎం చంద్ర‌బాబును క‌ట్ట‌డి చేయాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇవే ప‌రిణామాలు కొన‌సాగితే మైనార్టీలు, సెటిల‌ర్ల సంక్షేమం నినాదంతో మ‌జ్లిస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ క‌లిసి గ్రేట‌ర్ పీఠాన్ని ఎగ‌రేసుకుపోవ‌డానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో కేసీఆర్, మ‌జ్లిస్ స్నేహానికి మంగ‌ళం పాడ‌తారా? లేదా ఆ పార్టీతో ఇదివ‌ర‌కే కుద‌రిన అవ‌గాహ‌న మేర‌కే బీజేపీతో చెలిమి చేస్తున్నారా? లేదా మ‌జ్లిస్‌ను బుజ్జ‌గించి దారికి తెచ్చుకుంటారా? అన్న‌ది ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తి రేకెత్తిస్తోంది.
First Published:  18 May 2015 7:44 PM GMT
Next Story