Telugu Global
NEWS

నోటీసుల జారీకి ఏసీబీకి అధికారం లేదు: అచ్చెన్నాయుడు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తప్పించుకోలేరని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఒక వేళ ట్యాపింగ్‌ చేయకపోతే రాతపూర్వకంగా తెలియ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్‌ టెస్ట్‌కు రావాల్సిందిగా టీ-ఏసీబీ నోటీసులు ఇస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కక్షతో ఏం చేసినా తాము ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం తెలంగాణ […]

నోటీసుల జారీకి ఏసీబీకి అధికారం లేదు: అచ్చెన్నాయుడు
X
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తప్పించుకోలేరని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఒక వేళ ట్యాపింగ్‌ చేయకపోతే రాతపూర్వకంగా తెలియ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్‌ టెస్ట్‌కు రావాల్సిందిగా టీ-ఏసీబీ నోటీసులు ఇస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కక్షతో ఏం చేసినా తాము ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం తెలంగాణ ఏసీబీకి లేదని ఆయ‌న అన్నారు. అస‌లు ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న స‌మ‌యంలో టేపులు రికార్డు చేయ‌డానికి ఏసీబీకి అధికారం ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌ని, అయితే గ‌వ‌ర్న‌ర్ ఆదేశం మీద చేయాలి… లేదా ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశంతో చేయాలి. సొంతంగా చేయ‌డానికి ఏసీబీకి అధికారం ఎక్క‌డిది అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌భుత్వం చెప్పుచేత‌ల్లో న‌డుస్తున్న ఏసీబీకి త‌మ నాయ‌కుల‌పై కేసులు పెట్టే అధికారంగాని, నోటీసులు జారీ చేసే హ‌క్కుగాని లేద‌ని అచ్చెన్నాయుడు అన్నారు. ఇలా హైద‌రాబాద్‌లో త‌మ‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆయ‌న అన్నారు.
టీ-పోలీస్ భ‌ద్ర‌త మాకు అక్క‌ర్లేదు…
తెలంగాణ పోలీసుల భద్రతను త‌మ‌కు అక్క‌ర‌లేద‌ని, ఏపీ పోలీసులే మాకు భద్రత కల్పిస్తారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై తెలంగాణకు ఎంత హక్కు ఉందో… ఉమ్మడి రాజధానిగా మాకు అంతే హక్కు ఉందని ఆయన అన్నారు. అవ‌స‌ర‌మైతే హైద‌రాబాద్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌తో స్టేష‌న్లు ఏర్పాటు చేసుకుంటామ‌ని అచ్చెన్నాయుడు చెప్పారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు గవర్నర్‌ చేతిలో ఉండాలని…త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే గ‌వ‌ర్న‌ర్‌తో చెప్పి ప‌రిష్క‌రించుకోడానికి త‌మ‌కు అవ‌కాశం ఉంటుంద‌ని, శాంతిభద్రతలను తెలంగాణ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవ‌డం వ‌ల్ల త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న అన్నారు. ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వ వైఖ‌రి కార‌ణంగా రాజ్యాంగ సంక్షోభం ఏర్ప‌డితే కేంద్రం చూసుకుంటుంద‌ని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్-8 అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు.
మేం త‌ల‌చుకుంటే కేసీఆర్ ప్ర‌భుత్వం గ‌ల్లంతే: ప‌్ర‌తిపాటి
ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్టు ఆధారాలున్నాయన్న పుల్లారావు తమ దగ్గరున్న ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని, కేసీఆర్‌ రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏసీబీ చెబుతున్నట్టు అది చంద్రబాబు సంభాషణ కాదన్న ఆయన సంభాషణ ఎక్కడి నుంచి వచ్చిందో ఏసీబీ చెప్పడం లేదన్నారు. ఏసీబీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదని చెప్పారు. సీఎం రాజీనామా చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడబోమని చెప్పారు. సెక్షన్‌ 8కు విలువ లేకుంటే విభజనకు విలువ లేదని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్‌, కేసీఆర్‌ కుట్ర పన్నారని పుల్లారావు ఆరోపించారు.
కేసీఆర్‌కూ నోటీసులిస్తాం: య‌న‌మ‌ల‌
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నోటీసులు జారీ చేసే ప‌రిస్థితి వ‌స్తే ఏపీ ప్ర‌భుత్వంలో మంత్రులు, ముఖ్య‌మైన వ్య‌క్తుల ఫోన్‌ల‌ను ట్యాపింగ్ చేసిన కేసులో తాము కూడా తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావుకు నోటీసులు జారీ చే్స్తామ‌ని ఆర్థిక మంత్రి య‌న‌మ‌న రామ‌కృష్ణుడు అన్నారు. ప్ర‌తి చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య ఉంటుంద‌ని గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న స‌మ‌యంలో కేసులు పెట్టే అధికారం ఏసీబీకి ఎక్క‌డ నుంచి వ‌స్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.
First Published:  16 Jun 2015 6:05 AM GMT
Next Story