Telugu Global
Others

గందరగోళంలో "దేశం"

ఓటుకు నోటు కేసులో పీక‌ల్లోతు క‌ష్టాల్లో మునిగిపోయిన చంద్ర‌బాబు, పార్టీ వ్య‌వ‌హారాల‌పై అంత‌గా దృష్టి పెట్టిన‌ట్లు లేదు. గ‌త 15 రోజులుగా కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా? అన్న అంశంపైనే అధికారుల‌తో వ‌రుస స‌మావేశాల‌తో త‌ల‌మున‌క‌ల‌య్యారు. దీంతో పార్టీలో ఏం జ‌రుగుతుందో తెలుసుకునే నాథుడే క‌ర‌వయ్యారు. రెండు రాష్ర్టాల్లోనూ అసంతృప్త బావుటాలు ఎగ‌రుతున్నాయి. ఒక‌వైపు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అసంతృప్తి ర‌చ్చ‌కెక్కింది. మ‌రోవైపు ఓటుకు నోటు ఎర కేసులో తెలంగాణ‌లో నేత‌లు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. ఏపీలో […]

గందరగోళంలో దేశం
X
ఓటుకు నోటు కేసులో పీక‌ల్లోతు క‌ష్టాల్లో మునిగిపోయిన చంద్ర‌బాబు, పార్టీ వ్య‌వ‌హారాల‌పై అంత‌గా దృష్టి పెట్టిన‌ట్లు లేదు. గ‌త 15 రోజులుగా కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా? అన్న అంశంపైనే అధికారుల‌తో వ‌రుస స‌మావేశాల‌తో త‌ల‌మున‌క‌ల‌య్యారు. దీంతో పార్టీలో ఏం జ‌రుగుతుందో తెలుసుకునే నాథుడే క‌ర‌వయ్యారు. రెండు రాష్ర్టాల్లోనూ అసంతృప్త బావుటాలు ఎగ‌రుతున్నాయి. ఒక‌వైపు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అసంతృప్తి ర‌చ్చ‌కెక్కింది. మ‌రోవైపు ఓటుకు నోటు ఎర కేసులో తెలంగాణ‌లో నేత‌లు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.
ఏపీలో ఇలా!
విశాఖలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తిరాజు (కన్నబాబు రాజు) తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పి అధిష్టానం మోసం చేసిందని మండిపడ్డారు. అంతేకాదు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. రెండు స్థానాలు ఓసీలకే కేటాయించడంతో పార్టీలోని బీసీ, ఎస్టీలు రగిలిపోతున్నారు. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మణికుమారి బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. క‌న్న‌బాబును అధిష్టానం బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయి. దీంతో ఆయ‌న రెబ‌ల్‌గానే బ‌రిలోకి దిగారు. పార్టీ బీసీల‌కు అన్యాయం చేస్తోంద‌ని మీడియా ముందు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు గవిరెడ్డి రామానాయుడు కూడా మంగళవారం రెబల్ గా బరిలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
తెలంగాణ‌లో అలా!
తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు టీడీపీ కుట్ర ప‌న్నింద‌ని టీఆర్ ఎస్ చేస్తున్న ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి. వీడియోలు, ఆడియోలను టీవీల్లో చూసిన జ‌నాలు టీడీపీ నేత‌ల‌ను నిల‌దీస్తుంటే స‌మాధానాలు దాట‌వేస్తున్నారు. త‌మ పార్టీ అధినేత తీరుతో త‌మ‌కు లేని త‌ల‌నొప్పులు త‌యార‌య్యార‌ని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌రోవైపు సాగునీటిప్రాజెక్టుల‌పై నిత్యం అడ్డు త‌గులుతున్న టీడీపీపై మీ వైఖ‌రేంట‌ని ప్ర‌శ్నిస్తోన్న టీఆర్ ఎస్ ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ నేత‌లు మొహం చాటేస్తున్నారు. ఇవ‌న్నీ వారిలో పార్టీ మారే ఆలోచ‌న‌ల‌ను రేకెత్తిస్తున్నాయి. చాలామంది పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌లో చేరారు. తాజాగా ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్, డీసీసీబీ చైర్మన్, వివిధ జిల్లాల్లో మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా పార్టీని వీడారు. జిల్లాల్లో పార్టీ వ్యవహారాలు చూసుకునే నాయకులు తగ్గిపోయారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఓటుకు నోటుపై సొంత నేత‌ల‌ అసంతృప్తి!
ఓటుకు నోటు కేసులో మీడియాకు పొంత‌న‌లేని స‌మాధానాలు చెబుతున్న టీడీపీ మంత్రులు, నేత‌లు అప్పుడ‌ప్పుడూ అస‌హ‌నం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సూటిగా స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. మంత్రులు ప‌ల్లెర‌ఘునాథ్‌రెడ్డి, కామినేని శ్రీ‌నివాస్‌, అచ్చెన్నాయుడు వివిధ సంద‌ర్భాల్లో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు దొరికిపోయారు. ‘ఒక‌వేళ రేవంత్‌రెడ్డి త‌ప్పు చేసి ఉంటే శిక్ష అనుభ‌వించాల్సిందే’న‌ని త‌మ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్నారు. ఈ విష‌యంలో పార్టీ అధినేత ట్యాపింగ్‌, సెక్ష‌న్‌-8 అంటూ వింత‌వాద‌న‌లు చేస్తున్నారు. క‌నీసం అంతా ఒక‌మాట మీద నిల‌వడం లేదు. మ‌రోవైపు తెలంగాణ టీడీపీ నేత‌లు మీడియా ముందుకే రావ‌డమే లేదు.
First Published:  16 Jun 2015 1:24 AM GMT
Next Story