Telugu Global
POLITICAL ROUNDUP

ఎందుకీ రి"పేర్లు"?

రిపేరు జ‌రుగుతున్న‌ది ఏ ప్రాజెక్టుకో, యంత్రానికో కాదు. ఒక పేరుకు త‌ర‌చూ రిపేరు జ‌రుగుతోంది. డెమొక్ర‌సీలో అధికారం మారిన ప్ర‌తి సారీ నామ‌క‌ర‌ణ ర‌ణం షురూ అవుతోంది. దేశ స్వాతంత్ర్యం కోసం,  ప్ర‌జా సంక్షేమం కోసం పాటుప‌డిన‌  దివంగ‌త నేత‌లను స్మ‌రించుకునేందుకు మ‌న‌దేశంలో ప‌థ‌కాల‌కు, ప్రాజెక్టుల‌కు, విమానాశ్ర‌యాల‌కు, ర‌హ‌దారుల‌కు, పార్కుల‌కు వారి పేర్లు పెట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ఈ పేరు త‌ర‌చూ రిపేరుకు గుర‌వుతోంది.  ఐదేళ్ల‌కోసారి ప్ర‌భుత్వం మారే ప్ర‌తిసారీ ఈ పేర్లు మారుతుంటాయి. మార‌డ‌మంటే […]

ఎందుకీ రిపేర్లు?
X
రిపేరు జ‌రుగుతున్న‌ది ఏ ప్రాజెక్టుకో, యంత్రానికో కాదు. ఒక పేరుకు త‌ర‌చూ రిపేరు జ‌రుగుతోంది. డెమొక్ర‌సీలో అధికారం మారిన ప్ర‌తి సారీ నామ‌క‌ర‌ణ ర‌ణం షురూ అవుతోంది. దేశ స్వాతంత్ర్యం కోసం, ప్ర‌జా సంక్షేమం కోసం పాటుప‌డిన‌ దివంగ‌త నేత‌లను స్మ‌రించుకునేందుకు మ‌న‌దేశంలో ప‌థ‌కాల‌కు, ప్రాజెక్టుల‌కు, విమానాశ్ర‌యాల‌కు, ర‌హ‌దారుల‌కు, పార్కుల‌కు వారి పేర్లు పెట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ఈ పేరు త‌ర‌చూ రిపేరుకు గుర‌వుతోంది. ఐదేళ్ల‌కోసారి ప్ర‌భుత్వం మారే ప్ర‌తిసారీ ఈ పేర్లు మారుతుంటాయి. మార‌డ‌మంటే తమ పార్టీ అధినేత‌ను సంతృప్తి ప‌రిచేవిధంగా, ఓట్ల‌ను కొల్ల‌గొట్టే పేర్ల‌తో రిపేరు చేస్తుంటారు. స‌ర్కారు మారిన ప్ర‌తి చోటా ఇదే రివాజు. కేంద్రం నుంచి రాష్ర్ట ప్రభుత్వాల వ‌ర‌కూ ప‌థ‌కాల‌ను ఎలాగూ మారుస్తాయి..వాటితోపాటే వాటికున్న ట్యాగ్‌లైన్ లాంటి పేరుకు రిపేరు త‌ప్ప‌నిస‌రి చేస్తారు. ఇంత‌కీ పేరు మార్పులో ఏముంది అంటే..నేముంది అంటారు. ఫేముంది అని చెబుతుంటారు. పేరుతో పేరుకొట్టేయొచ్చ‌నుకుంటారు. తాజాగా ఇందిరాసాగర్ పోలవరంగా ఉన్న ప్రాజెక్ట్ పేరును “పోలవరం సాగునీటి ప్రాజెక్టు”గా మార్చింది ఏపీ ప్ర‌భుత్వం. ఇందిరాసాగ‌ర్ అంటే..పోల‌వ‌రం పూర్త‌యితే కాంగ్రెస్‌కు క్రెడిట్ కొట్టేస్తుంద‌నుకున్నారేమో! ఎన్‌డీఏ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను ఆక‌ట్టుకోవ‌చ్చ‌నుకున్నారేమో! ఇందిరాసాగ‌ర్ పోల‌వ‌రం పేరుకు రిపేరు చేసి “పోల‌వ‌రం సాగునీటి ప్రాజెక్టుగా“ నామ‌క‌ర‌ణం చేశారు. అయితే ఇక్క‌డ ఓ మాంచి సంప్ర‌దాయం పాటించారు. ఏ ఎన్టీఆరో, కేంద్రాన్ని సంతృప్తి ప‌రిచేందుకు అట‌ల్‌బిహారీ వాజ్‌పేయో పేరు పెట్ట‌లేదు. గ‌తంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు వివాదానికి దారితీసింది. రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలోనే దేశీయ టెర్మిన‌ల్‌కు గ‌తంలో ఎన్టీఆర్ పేరుండేది. కాంగ్రెస్ హ‌యాంలో పేరు మారింది. మ‌ళ్లీ ఏపీలో టీడీపీ, కేంద్రంలో మిత్ర‌ప‌క్ష‌మైన ఎన్‌డీఏ అధికారంలోకి వ‌చ్చింది. మ‌ళ్లీ ఎన్టీఆర్ పేరుపెట్టారు. అయితే ఈ పేరు గొడ‌వ సామాన్యంగా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఏ పేరు మారినా జ‌నానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుగానే పిలుచుకుంటారు. ఇంకో విశేషం ఏంటంటే..మ‌హాత్మ‌గాంధీ రోడ్ అని ప్ర‌భుత్వం పేరు పెడుతుంది. జ‌నం దానిని షార్ట్‌క‌ట్‌లో ఎం.జీ రోడ్ అని పిలుచుకుంటారు. ఇంక పేరుకు ఇస్తున్న గౌర‌వం ఏంటి? పేరుకు పెరుగుతున్న విలువ ఏంటి? అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరుకు యాడ్ చేశారు. కానీ ఎవ‌రైనా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అని ప‌లుకుతున్నారా? ఈ పేరు జిల్లాకు పెట్ట‌డం వ‌ల్ల రికార్డుల్లో ఉంటుంది త‌ప్పా! జ‌నం నోట్లో నానుతుందా? మ‌హానేత‌ల త్యాగాల‌కు మ‌న‌మిచ్చే ప్ర‌తిఫ‌లం పేరుతోనేనా? అది రిపేరు కాకుండా ఉంటుందా? ఆలోచించాల్సిన వారు దృష్టి సారిస్తే..పేరులో నేమ్ ఉంది అని స‌ర్దుకుంటారు.
-కుసుమ దుర్గేశ్వరీ
First Published:  25 Jun 2015 8:06 PM GMT
Next Story