Telugu Global
Family

శుక్రుడు (For Children)

మృతి చెందిన వాళ్ళను తిరిగి బతికించే విద్యే మృత సంజీవనీ విద్య! అలాంటి అద్భుతమైన మృత సంజీవనీ విద్య తెలిసినవాడు శుక్రుడు. శుక్రుడు ఎవరో తెలుసా? దేవతలకు గురువు బృహస్పతి అయితే. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడన్న మాట! శుక్రుని తల్లి ఉశవ. తండ్రి భృగువు (కవి). ప్రియవ్రతుని కూతురైన ఊర్జస్వతిని పెళ్ళాడాడు. చండుడు, అమర్కుడు, త్వాస్టృడు, ధరాత్రుడు శుక్రుని సంతానమే!             బృహస్పతి తండ్రైన అంగీరసుని దగ్గరే బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ విద్యాబుద్ధులు నేర్చుకునేవాళ్ళు. విద్యను విద్యార్థులైన […]

మృతి చెందిన వాళ్ళను తిరిగి బతికించే విద్యే మృత సంజీవనీ విద్య! అలాంటి అద్భుతమైన మృత సంజీవనీ విద్య తెలిసినవాడు శుక్రుడు. శుక్రుడు ఎవరో తెలుసా? దేవతలకు గురువు బృహస్పతి అయితే. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడన్న మాట! శుక్రుని తల్లి ఉశవ. తండ్రి భృగువు (కవి). ప్రియవ్రతుని కూతురైన ఊర్జస్వతిని పెళ్ళాడాడు. చండుడు, అమర్కుడు, త్వాస్టృడు, ధరాత్రుడు శుక్రుని సంతానమే!

బృహస్పతి తండ్రైన అంగీరసుని దగ్గరే బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ విద్యాబుద్ధులు నేర్చుకునేవాళ్ళు. విద్యను విద్యార్థులైన వాళ్ళకు సమానంగా నేర్పించాలి. కాని అంగీరసుడు ఆపనిచేయలేదు. శుక్రుణ్ని తక్కువ చేసి చూసాడు. తేడా గమనించిన శుక్రుడు గౌతముని దగ్గరకు వెళ్ళాడు తనకు విద్య నేర్పించమని కోరాడు. లోకానికి గురువు ఆ ఈశ్వరుడేనని అతన్నే ప్రార్థించమన్నాడు. గౌతమీ తీరానా శివుని ధ్యానించి “మృత సంజీవని” విద్యను నేర్పించమన్నాడు. శివుడు నేర్పించాడు. ఇంకేముంది? దేవతలతో జరిగిన యుద్ధంలో చనిపోయిన రాక్షసులను తన విద్యతో శుక్రుడు బ్రతికించేవాడు. దాంతో చావు భయం లేకుండా పోయింది. దేవతలకు భయం పట్టుకుంది. అంధకాసురుణ్ని అంతం చేయాలన్న దేవతల ఆశ నెరవేరలేదు. శివుణ్ని, దేవతల్ని వేడుకోవడంతో శుక్రుణ్ణి శివుడే మింగేసాడు. దేవతలు అంధకాసురుణ్ని అంత మొందించారు. తరువాత శుక్ల రూపంలో శివుని శరీరంలోంచి బయట పడి నిజరూపం దాల్చాడని కాశీఖండంలో కథ ఉంది.

భారతంలో – కుబేరుని మోసం చేసి దశసంపదను శుక్రుడు అపహరించినట్టు – కుబేరుడు శివునితో మొరపెట్టుకున్నట్టు – శివుడు కన్నెర్రజేసినట్టు – శుక్రుడు దాక్కునట్టు – చివరకు శివునికి చిక్కినట్టు – శివుడు మింగేసినట్టు – బయటపడడానికి శుక్రుడు ప్రయత్నించినట్టు – శివుడు తన శరీరంలోని అన్ని రంధ్రాలను మూసేసినట్టు – శిశ్నము మూయనట్టు – అందులోంచి శుక్రుడు బయట పడ్డట్టు – అందుకే ఆ పేరు వచ్చినట్టు కథ ఉంది. ఈ కథలోనే – శివుని గర్భంలోంచి పుట్టాడు గనుక శివకుమారుడని పార్వతి భావించినట్టు – సుఖవంతుణ్ని చేయమన్నట్టు – అందుకు శివుడు అంగీకరించినట్టు – తేజోవంతుణ్ని చేసినట్టు చెపుతారు.

శుక్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటే – భంగం చేయమని తన కూతురు జయంతిని ఇంద్రుడు పంపాడనీ – అయితే శుక్రుడు తపస్సు పూర్తి చేసి బ్రహ్మచేత వరంపొంది వస్తూ జయంతిని చూసాడనీ – జయంతి శుక్రుని సంతానమే దేవయాని అనీ మత్స్యపురాణం చెపుతోంది. అంతేకాదు, జయంతితో శుక్రుడు ఉన్న సమయంలో బృహస్పతి శుక్రుని వేషం ధరించి వస్తే రాక్షసులు తమ గురువేనని గుట్టు మట్టులన్నీ చెప్పుకున్నారని – ఇంతలో అసలు శుక్రుడు రావడం – ఎవరు తమ గురువో తేల్చుకోలేక పోవడం – అలా ఇద్దరూ తలపడడం – బృహస్పతి అంతర్ధానం కావడం కూడా జరిగిందట!

శుక్రుని దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకురమ్మని కచుణ్ని దేవతలు పంపించారు. కచుడు గురువుగారికి సేవలు చేసాడు .కచుని అవసరాన్ని గుర్తించి, ఆపదని గ్రహించి రాక్షసులు కచున్ని చంపేసారు. గురుపుత్రిక చొరవతో కచుడు తిరిగిప్రాణం పొందాడు. మరోసారి కచున్ని చంపి కాల్చి ఆ బూడిదని శుక్రునికి తెలియకుండా సురలో కలిపి తాగించేసారు. కూతురుపై మక్కువతో తన పొట్టలోని కచునికి మృత సంజీవని విద్యనేర్పాడు. కచుడు పొట్ట చీల్చుకు రావడంతో ప్రాణం విడుస్తాడు. కచుడు ప్రాణం పోస్తాడు. ఆనాటి నుంచి సురాపానం పాతకమయ్యేలా శుక్రుడు శపించాడు.

కూతురు దేవయానిని శర్మిష్ట అవమానించిందని వృషపర్వనగరానికి రానన్నాడు శుక్రుడు. దేవయానికి శర్మిష్టని దాసిగా పంపాకనే అడుగు పెట్టాడు. యయాతితో కూతురు పెళ్ళికి ఒప్పుకున్నా, తర్వాత అతణ్ని చంపినా దేవయాని పట్ల ప్రేమతోనే చేసాడు శుక్రుడు.

బలి చక్రవర్తిని మూడడుగుల భూమి వామనుడు కోరితే – వచ్చినవాడు సామాన్యుడు కాదని, ఏమీ ఇవ్వ వద్దని, మాట తప్పిన దోషం లేదని శుక్రుడు చెప్పాడు. బలిని కాపాడాలనుకున్నాడు. దానమిచ్చే సందర్భంలో ఈగగా మారాడు. విడుస్తున్న నీటి ధార పడకుండా అడ్డుకోబోతే – వామనుడు పుల్లతో పొడిచాడు. దాంతో శుక్రుని కన్ను ఒకటి చితికిపోయింది. శుక్రుడు ఒంటికన్నుతో మిగిలాడు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  3 July 2015 1:02 PM GMT
Next Story