Telugu Global
CRIME

పారిపోయేందుకు ఉగ్రవాది యాసీన్‌ భత్కల్‌ కుట్ర ?

ఇండియన్‌ ముజాహిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు, ఉగ్రవాది యాసీన్‌ భత్కల్ జైలు నుంచి పారిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునేందుకు భ‌త్క‌ల్ కుట్ర పన్నాడని జైలు అధికారుల విచారణలో స్పష్టమైంది.  జైలు గోడలు బద్దలు కొట్టి వస్తానంటూ యాసీన్‌ భత్కల్ త‌న కుటుంబసభ్యులు, సన్నిహితులకు ఫోన్‌కాల్స్‌ చేసినట్లు వెల్లడైంది. త్వరలోనే మనం కలుసుకుందామని యాసీన్‌ తన భార్య జాహిదాతో పలుసార్లు కాయిన్‌బాక్స్‌ నుంచి ఫోన్‌కాల్స్‌ చేశారని జైళ్లశాఖ అధికారులు గుర్తించారు. జైలు నుంచి బయట పడేందుకు సిరియాలోని ఐఎస్‌ […]

పారిపోయేందుకు ఉగ్రవాది యాసీన్‌ భత్కల్‌ కుట్ర ?
X

ఇండియన్‌ ముజాహిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు, ఉగ్రవాది యాసీన్‌ భత్కల్ జైలు నుంచి పారిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునేందుకు భ‌త్క‌ల్ కుట్ర పన్నాడని జైలు అధికారుల విచారణలో స్పష్టమైంది. జైలు గోడలు బద్దలు కొట్టి వస్తానంటూ యాసీన్‌ భత్కల్ త‌న కుటుంబసభ్యులు, సన్నిహితులకు ఫోన్‌కాల్స్‌ చేసినట్లు వెల్లడైంది. త్వరలోనే మనం కలుసుకుందామని యాసీన్‌ తన భార్య జాహిదాతో పలుసార్లు కాయిన్‌బాక్స్‌ నుంచి ఫోన్‌కాల్స్‌ చేశారని జైళ్లశాఖ అధికారులు గుర్తించారు. జైలు నుంచి బయట పడేందుకు సిరియాలోని ఐఎస్‌ మిత్రులు సహకరిస్తారని భత్కల్‌ చెప్పినట్టు ఫోన్‌ సంభాషణల్లో బయటపడింది. జైలులో కాయిన్‌బాక్స్‌ నుంచి చేసిన ఫోన్‌కాల్స్‌ను మామూలుగా రికార్డు చేస్తారు. ఈ విషయం భత్కల్‌కు కూడా తెలుసు. అయినా ఇలాంటి సంభాషణలు జరపడం వెనుక అసలు ఉద్దేశ్యమేమిటన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు జైళ్ళ శాఖ డి.జి. వి.కె. సంగ్‌ చెప్పారు. అధికారిక ఫోన్‌ నుంచి చేసిన కాల్స్‌ రికార్డు చేసిన జైలు అధికారులు అప్పుడ‌ప్పుడూ వాటిని వింటారు. ఈ సంభాషణలన్నింటినీ నిఘా వర్గాలకు చేరవేస్తారు. ఇలా పంపిన సంభాషణల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. మొత్తం పదిసార్లు యాసిన్‌ భత్కల్‌ కుటుంబసభ్యులతో మాట్లాడినట్టు ఫోన్‌ రికార్డులు చెబుతున్నాయి. భ‌త్క‌ల్ కుట్ర విష‌యం బ‌య‌ట‌ప‌డడంతో ఈ విష‌యాన్ని వెంట‌నే ఎన్‌ఐఏ అధికారులకు సమాచారం అందించారు. ఎన్‌ఐఏ ఈ విషయాలను తెలుపుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దీంతో చర్లపల్లి జైలులో భారీ భద్రతా ఏర్పాట్లు చేసి మిగ‌తా అంశాల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

కాగా భత్కల్‌ విషయం బయటపడడంతో చర్లపల్లి జైలులో పరిస్థితులపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. భత్కల్‌ పాత రికార్డులను కూడా మరోసారి పరిశీలిస్తున్నారు. మొత్తం ఇటీవల కాలంలో భత్కల్‌ ఎవరెవరితో ఫోన్‌లు మాట్లాడాడు. అందులో ఏమైన ముఖ్యమైన సమాచారం ఉందా అనే విషయాలపై పోలీసులు ఇపుడు దృష్టి సారించారు. భత్కల్‌ దిల్‌సుఖ్‌న‌గ‌ర్ పేలుళ్ళ‌లో ప్ర‌ధాన నిందితుడైనందు వల్ల అతనికి అంతర్జాతీయ టెర్రరిస్టులతో సంబధాలుంటాయన్నది వాస్తవం. ఇపుడు దొరికిన ఫోన్‌ సంభాషణల్లో కూడా అతనికి సిరియా తీవ్రవాదుల సహకారం లభిస్తుందన్న విషయం బయటపడింది. ఈ కోణంలో అసలు కుట్ర సారాంశం ఏమిటన్న అంశంపై తీవ్రంగా విచారిస్తున్నారు. మొత్తం విషయాలన్నింటినీ పరిశీలిస్తున్నామని, చర్లపల్లి జైలులో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని, అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని చ‌ర్ల‌పల్లి జైలులో డిఐజీ న‌ర‌సింహ తెలిపారు.

First Published:  3 July 2015 1:30 PM GMT
Next Story