Telugu Global
Others

దేశంలో మ‌ళ్లీ ఖ‌లిస్థాన్ ఉద్యమం‌?

దేశంలో మ‌ళ్లీ ఖ‌లిస్తాన్ ఉద్య‌మం నిద్ర‌లేస్తోందా? ఇండియా నుంచి పంజాబ్‌ను వేరు చేసేందుకు పాకిస్తాన్ గూడ‌ఛార సంస్థ ఐఎస్ఐ పావులు క‌దుపుతోందా?  సోమ‌వారం గురుదాస్‌పూర్ జిల్లాలో చొర‌బ‌డిన తీవ్ర‌వాదులు ఖలిస్థాన్‌ ఉద్యమానికి ప్రాణం పోసేందుకు ఉద్దేశించినవారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు దేశంలో క‌ల‌క‌లానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఆదివారం పంజాబ్ సీఎం ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ ఇంటి ఎదుట నిర‌స‌న చేప‌ట్టిన ఆందోళ‌న‌కారులు ఖ‌లిస్థాన్ ఉద్య‌మానికి అనుకూలంగా నినాదాలు చేయ‌డం ఈ అనుమానాల‌కు కార‌ణం. ఇదే అంశంపై లూథియానా ఎంపీ […]

దేశంలో మ‌ళ్లీ ఖ‌లిస్థాన్ ఉద్యమం‌?
X
దేశంలో మ‌ళ్లీ ఖ‌లిస్తాన్ ఉద్య‌మం నిద్ర‌లేస్తోందా? ఇండియా నుంచి పంజాబ్‌ను వేరు చేసేందుకు పాకిస్తాన్ గూడ‌ఛార సంస్థ ఐఎస్ఐ పావులు క‌దుపుతోందా? సోమ‌వారం గురుదాస్‌పూర్ జిల్లాలో చొర‌బ‌డిన తీవ్ర‌వాదులు ఖలిస్థాన్‌ ఉద్యమానికి ప్రాణం పోసేందుకు ఉద్దేశించినవారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు దేశంలో క‌ల‌క‌లానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఆదివారం పంజాబ్ సీఎం ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ ఇంటి ఎదుట నిర‌స‌న చేప‌ట్టిన ఆందోళ‌న‌కారులు ఖ‌లిస్థాన్ ఉద్య‌మానికి అనుకూలంగా నినాదాలు చేయ‌డం ఈ అనుమానాల‌కు కార‌ణం. ఇదే అంశంపై లూథియానా ఎంపీ ర‌న్‌వీత్ సింగ్ బిట్టూ సోమ‌వారం పార్ల‌మెంటులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అత్యంత ఆందోళ‌న‌క‌ర‌మైన ప్ర‌శ్న‌ను లేవ‌నెత్త‌డంతో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. దేశంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అవ‌లంబిస్తున్న విధానాలే తిరిగి ఖ‌లిస్థాన్ ఉద్య‌మం ప్రాణం పోసుకోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని బిట్టూ ఆరోపించారు. దేశంలో వివిధ చోట్ల జైళ్ల‌లో ఉన్న ఉగ్ర‌వాదుల‌ను స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన‌ పంజాబ్‌లోకి త‌ర‌లించ‌డం వెన‌క కేంద్రం ఆలోచ‌న ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలోని సూర‌త్ సింగ్ డిమాండ్ మేర‌కు జైళ్ల‌లో ఉన్న ప‌లువురు సిక్కు నేత‌ల‌ను విడుద‌ల చేసి, ఖ‌లిస్తాన్ ఉద్యమానికి పంజాబ్ ప్ర‌భుత్వ‌మే ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తోంద‌ని ఆరోపించారు.
అసలు ఖలిస్థాన్‌ ఉద్యమం అంటే…
మూడు దశాబ్దాల క్రితం దేశంలో నెత్తుటేర్లు పారించిన పీడ‌ క‌ల ఖ‌లిస్థాన్ ఉద్య‌మం. ఇండియాలో స‌మైక్య‌త‌ను దెబ్బ‌ కొట్టేందుకు పాకిస్థాన్‌ ప్ర‌యోగించిన ప‌దునైన ఆయుధం ఖ‌లిస్థాన్‌. సిక్కుల‌కు ప్ర‌త్యేక దేశం కావాలంటూ ఆరంభ‌మైన ఈ ఉద్య‌మానికి పంజాబ్ యువ‌త విప‌రీతంగా ఆక‌ర్షితుల‌య్యారు. వీరికి ఆయుధాలు, న‌గ‌దు పాకిస్థాన్ స‌మ‌కూర్చేది. ఆయుధాల‌పై మోజు ఉన్న ప్ర‌తి యువ‌కుడు ఉద్య‌మంలో చేరేవాడు. దేశ స‌మ‌గ్ర‌త‌కు వ్య‌తిరేకంగా లేవ‌దీసిన‌ పోరాటానికి బింద్రేన్‌వాలే నేతృత్వం వ‌హించారు. దేశంలో వారి ఆగ‌డాలు మితిమీర‌డంతో అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ సైన్యాన్ని రంగంలోకి దించి స్వ‌ర్ణ‌దేవాల‌యంలో దాక్కున్న ఉగ్ర‌వాదుల‌ను ఆపరేషన్‌ బ్లూస్టార్‌ పేరుతో తుద ముట్టించారు. ఈ పరిణామ క్రమంలోనే అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ బలైపోయారు. దాంతో పోరాటం అంత‌మైన‌ప్ప‌టికీ దాని ఛాయలు మళ్ళీ కనిపిస్తున్నాయి. టెక్నాల‌జీ అంత‌గా లేని రోజుల్లోనే వేలాది మందిని పొట్ట‌న‌బెట్టుకున్న ఉద్య‌మం.. నేడు తిరిగి ప్రారంభ‌మైతే.. వారికి పాకిస్తాన్‌, చైనా మ‌ద్ద‌తిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. పంజాబ్‌లో మళ్ళీ ఆ పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే.
First Published:  28 July 2015 12:20 AM GMT
Next Story