Telugu Global
Others

చంద్రబాబుది మోసపూరిత పాలన: జగన్‌ 

రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతుందని, ప్రభుత్వమే కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని జగన్‌ ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక పోకడలకు నిలయమైన చంద్రబాబు సర్కారు త్వరలోనే కూలిపోతుందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వం లాక్కున్న భూములు తిరిగి ఇచ్చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావడం లేదని, మద్దతు ఉపసంహరించుకోవడం లేదని ఆయన విమర్శించారు. భూసేకరణకు వ్యతిరేకంగా, రాజధాని ప్రాంతంలో రైతులకు మద్దతుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి గుంటూరులోని […]

చంద్రబాబుది మోసపూరిత పాలన: జగన్‌ 
X
రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతుందని, ప్రభుత్వమే కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని జగన్‌ ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక పోకడలకు నిలయమైన చంద్రబాబు సర్కారు త్వరలోనే కూలిపోతుందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వం లాక్కున్న భూములు తిరిగి ఇచ్చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావడం లేదని, మద్దతు ఉపసంహరించుకోవడం లేదని ఆయన విమర్శించారు. భూసేకరణకు వ్యతిరేకంగా, రాజధాని ప్రాంతంలో రైతులకు మద్దతుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి గుంటూరులోని సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట చేసిన ధర్నాకు మంచి మద్దతు లభించింది. కార్పొరేట్‌ సంస్థల కోసమే బలవంతంగా భూములు లాక్కుంటున్నారని జగన్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదా వద్దు… ప్యాకేజీ చాలంటూ ఢిల్లీలో సన్నాయినొక్కులు నొక్కుతున్నారని, చంద్రబాబు పక్కా అవకాశవాది అనడానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలని జగన్‌ ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదా అంశాన్నే నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు ప్రధాని మోడి వద్ద మోకరిల్లి ప్రత్యేక హోదా వద్దు.. మంచి ప్యాకేజీ ఇవ్వండి అంటూ ప్రాధేయ పడ్డారని, ఇదంతా తననితాను ఓటుకు నోటు కేసు నుంచి రక్షించుకునే ఉద్దేశంతో చేస్తున్నదేనని జగన్‌ ఆరోపించారు. హోదా వస్తే పన్ను రాయితీ వస్తుంది… పరిశ్రమలు వస్తాయి… రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది… కాని ఈ అసమర్ధ సీఎం వల్ల ఏపీ ఎంతో నష్టపోతుందని ఆయన అన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి అప్పుల బాధ తగ్గుతుందని, ఏపీ అభివృద్ధి చెందుతుందని జగన్‌ అన్నారు. బీజేపీ మెడలు వంచేలా హోదా కోసం చంద్రబాబు ప్రయత్నం చేయడం లేదని ఆయన ఆరోపించారు.
కేసులకు వెరవను… దేవుడున్నాడు
తాను కేసులకు భయపడి ఇంట్లో కూర్చుంటే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని వై.ఎస్‌.జగన్‌ ప్రశ్నించారు. అందుకే తనకు కేసులంటే భయం లేదని, అంతా భగవంతుడే చూసుకుంటాడని ఆయన అన్నారు. గతంలో ఈ చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి తనను కేసుల్లో ఇరికించారని, ఇలా చేసినందుకే కాంగ్రెస్‌ పార్టీ అడ్రసు లేకుండా పోయిందని, ఇక చంద్రబాబు వంతు మిగిలి ఉందని జగన్‌ అన్నారు. నిజానికి చంద్రబాబు క్రిమినల్ మైండ్‌తో పాలన సాగిస్తున్నాడని, ఆయన పక్కా అవకాశవాది, అబద్దాలకోరు అని జగన్‌ విమర్శించారు.
29 బంద్‌కు మద్దతిచ్చి ప్రభుత్వ వ్యతిరేకత చాటండి
ఈ నెల 29న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని జగన్‌ పిలుపు ఇచ్చారు. అధికారం ఉంది కదా అని ఈ సీఎం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, కోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోకుండా భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారని ఆయన విమర్శించారు. రాజధాని భూముల్లో మూడు పంటలు పండే భూములు లేవని అబద్దాలు చెబుతున్నారని, కోర్టుల్లో కూడా ఇలాగే వ్యవహరిస్తూ నివేదికలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. బహిరంగసభ ముగిసిన తర్వాత సీఆర్‌డీఏ కమిషనర్‌కు వినతి పత్రం అందజేయడానికి వెళ్ళినా అక్కడ కమిషనర్‌గాని, అసిస్టెంట్ కమిషనర్‌గాని అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అధికారులు లేకపోవడంతో తీసుకెళ్ళిన వినతిపత్రాన్ని అక్కడ గోడకు అతికించి వచ్చారు.
First Published:  26 Aug 2015 3:05 AM GMT
Next Story