Telugu Global
Others

ఆమె కూతురు... పిలుపు చెల్లెలు... తుదకు హత్య!

కూతురని చెప్పుకుంటే వయసు ఎక్కడ బయటపడి పెళ్ళిళ్ళకు ఆటంకం కలుగుతుందనే భయంతో చెల్లిగా చెప్పుకుంది. తన కార్యకలాపాలకు అడ్డు వస్తుందనో… లేక మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతోనో హత్య చేసింది… అదీ ఈ కూతుర్ని ఎవరితో కన్నదో అతన్నే హత్యలో వాడుకుంది… అమె పేరే ఇంద్రాణి. ముగ్గురు భర్తల వగలాడి. ఈ కేసును నిశితంగా పరీక్షిస్తే ఎన్నో మలుపులు… మరెన్నో ట్విస్టులు! రామ్‌గోపాల్ వ‌ర్మ క్రైం థ్రిల్ల‌ర్‌ను మించేదిలా ఉన్న నేర‌ఘ‌ట‌న ఇది. మూడేళ్ల క్రితం […]

ఆమె కూతురు... పిలుపు చెల్లెలు... తుదకు హత్య!
X
కూతురని చెప్పుకుంటే వయసు ఎక్కడ బయటపడి పెళ్ళిళ్ళకు ఆటంకం కలుగుతుందనే భయంతో చెల్లిగా చెప్పుకుంది. తన కార్యకలాపాలకు అడ్డు వస్తుందనో… లేక మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతోనో హత్య చేసింది… అదీ ఈ కూతుర్ని ఎవరితో కన్నదో అతన్నే హత్యలో వాడుకుంది… అమె పేరే ఇంద్రాణి. ముగ్గురు భర్తల వగలాడి. ఈ కేసును నిశితంగా పరీక్షిస్తే ఎన్నో మలుపులు… మరెన్నో ట్విస్టులు! రామ్‌గోపాల్ వ‌ర్మ క్రైం థ్రిల్ల‌ర్‌ను మించేదిలా ఉన్న నేర‌ఘ‌ట‌న ఇది. మూడేళ్ల క్రితం ముంబ‌యిలో హ‌త్య‌కు గురైన షీనా బోరా అనే యువ‌తి హ‌త్య కేసులో చిక్కుముడులు ఇప్పుడిప్పుడే వీడుతున్నాయి. ఈ కేసులో స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీట‌ర్ ముఖ‌ర్జియా భార్య ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇంత‌కాలం షీనాబోరా ఇంద్రాణికి చెల్లెలుగా సమాజం భావిస్తోంది. కానీ ఆమె ఇంద్రాణి క‌న్న‌కూతుర‌ని తెలిసి పోలీసులే నిర్ఘాంత పోతున్నారు. విచార‌ణ‌లో ఇంద్రాణి గురించి క‌ళ్లు బైర్లు క‌మ్మే వాస్త‌వాలు తెలుసుకుని సీనియ‌ర్ పోలీసు అధికారులే అవాక్క‌వుతున్నారు. షీనా బోరా హ‌త్య విష‌యం తెలుసుకున్న ఇంద్రాణి మూడో భ‌ర్త పీట‌ర్ ముఖ‌ర్జీ నిర్ఘాంత‌పోయాడు. ఇంత‌కాలం త‌న భార్య షీనాను చెల్లెల‌నే చెప్పింద‌ని మీడియా ఎదుట వాపోయాడు. అస‌లు ఇంద్రాణికి రెండు పెళ్లిళ్లు అయిన సంగ‌తి కూడా త‌న‌కు తెలియ‌ద‌ని ముఖర్జీ పేర్కొన‌డం విశేషం.
ఎందుకు చంపింది?
ఒక కేసులో ఇంద్రాణి డ్రైవ‌ర్ శ్యాంవర్‌ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అత‌ను షీనాబోరా హ‌త్య కేసు గురించి పోలీసుల‌కు చెప్ప‌డంతో ఇంద్రాణి వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఇంద్రాణికి పీట‌ర్ ముఖ‌ర్జీ మూడో భ‌ర్త‌, మొద‌టి భ‌ర్త సిద్ధార్థ దాస్, రెండో భ‌ర్త‌ సంజీవ్‌ ఖ‌న్నా. వీరిలో సిద్దార్ద్‌ దాస్‌ సంతానం షీనాబోరా, మిఖాయిల్. రెండో భర్తతో విదేహీ అనే కూతుర్ని కంది. మూడో భర్త ముఖర్జీతో రాహుల్‌, రాబిన్‌ అనే ఇద్దరికి జన్మనిచ్చింది. త‌న‌కు ఒక‌సారి మాత్రమే వివాహ‌మైంద‌ని పీట‌ర్‌ ముఖర్జీని న‌మ్మించి అత‌న్ని మూడో వివాహం చేసుకుంది. త‌న పిల్ల‌లను త‌ల్లిదండ్రుల వ‌ద్ద ఉంచేది. వారితో అక్కా అని పిలిపించుకునేది. విన‌కుంటే దండించేది. దీంతో వారూ అలాగే పిలిచేవారు. పీట‌ర్ ముఖర్జీతో కుమారుడితో షీనాకు వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. అదే విష‌యంపై పీట‌ర్‌, ఇంద్రాణి వారిద్దరినీ మంద‌లించినా ప్ర‌వ‌ర్త‌న మార్చుకోలేదు. అందుకే ఇంద్రాణి త‌న రెండో భ‌ర్త సంజీవ్‌ ఖన్నాతో క‌లిసి 2012 ఏప్రిల్ 24న షీనాను రాయ్‌గడ్ జిల్లాలోని అట‌వీ ప్రాంతంలో హ‌త్య చేసి, పెట్రోలు పోసి త‌గుల‌బెట్టింది. ఇదేమీ తెలియనట్టు షీనా అమెరికాలో చ‌దువుకుంటుంద‌ని ఇంద్రాణి లోకాన్ని న‌మ్మించింది. డ్రైవ‌ర్ తెలిపిన వివ‌రాల ఆధారంగా పోలీసులు ఇంద్రాణిని విచారించ‌గా హ‌త్యా నేరాన్ని అంగీక‌రించింది. ఇపుడు ఆమె ముగ్గురు భ‌ర్త‌ల‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
కార‌ణం నాకు తెలుసు!
షీనా హ‌త్య‌కు అస‌లు కార‌ణాలు నాకు తెలుస‌ని ఇంద్రాణి మరో కుమారుడు మిఖాయిల్ బోరా సంచ‌ల‌న ప్రకటన చేశాడు. తన సోదరిని ఎందుకు, ఎవరు చంపారో తనకు తెలుసని ఆయన ప్రకటించాడు. ఇంద్రాణి చెబుతున్నవి అస‌లైన కార‌ణాలు కావ‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న త‌ల్లి ఆగ‌స్టు 31లోగా అస‌లు విషయం చెప్పి నేరం అంగీక‌రించాల‌ని లేకుంటే తానే సాక్షిగా మారి నిజాల‌ను వెల్ల‌డిస్తాన‌న‌డంతో కేసు మ‌రో మలుపు తిరిగింది. దీంతో ఇంద్రాణి విచార‌ణ‌లో చెప్పిన విష‌యాలు నిజాలేనా, కావా? అన్న అనుమానాలు రేగుతున్నాయి. ఇంద్రాణికి రిమాండ్ 31తో ముగుస్తుంది. మిఖాయిల్ మాట‌ల ప్ర‌కారం.. రానున్న రోజుల్లో ఈ కేసు మ‌రో మ‌లుపు తిరుగబోతోంది.
Also Read
First Published:  27 Aug 2015 12:32 AM GMT
Next Story