Telugu Global
NEWS

ఒక అవిశ్వాసం- రెండు లక్ష్యాలు 

ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అవును తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఇదే విధంగా ఆలోచిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో రైతుల అత్మహత్యల అంశం దుమారం రేపుతూనే ఉంది. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్న టీకాంగ్రెస్ విపక్షాలతో కలిసి పోరాటం మరింత తీవ్రం చేసేందుకు ప్లాన్ చేసింది. అవసరమైతే కేసీఆర్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని సంధించేందుకు కూడా సిద్ధమంటోంది. సభలో కేసీఆర్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం ద్వారా ఒకేసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున […]

ఒక అవిశ్వాసం- రెండు లక్ష్యాలు 
X

ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అవును తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఇదే విధంగా ఆలోచిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో రైతుల అత్మహత్యల అంశం దుమారం రేపుతూనే ఉంది. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్న టీకాంగ్రెస్ విపక్షాలతో కలిసి పోరాటం మరింత తీవ్రం చేసేందుకు ప్లాన్ చేసింది. అవసరమైతే కేసీఆర్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని సంధించేందుకు కూడా సిద్ధమంటోంది. సభలో కేసీఆర్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం ద్వారా ఒకేసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టొచ్చని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అవిశ్వాస తీర్మానాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం కాంగ్రెస్ కు 21, టీడీపీకి 15, వైసీపీకి ముగ్గరు, సీపీఐ, సీపీఎంలకు ఒక్కొక్కరు, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ వీరిలో పార్టీ మారిన వారున్నారు. వారిని మినహాయిస్తే విపక్షాల బలం 41కి చేరుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్, టీడీపీలు విప్ జారీ చేస్తే ఖచ్చితంగా గెలిచిన పార్టీకే ఓటు వేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆయా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నుంచి గెలిచి వైసీపీ సభ్యులుగా కొనసాగిన వారికి విప్ జారీ చేశారు. అయితే వారు వైసీపీకి అనుకూలంగా ఓటేయడంతో వేటు పడింది. ఇప్పుడు టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. వారందర్నీ ఇరుకున పెట్టడానికి అవిశ్వాస తీర్మానం కలిసి వస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎంఐఎం తటస్థంగా ఉండే అవకాశం ఉంది. అయినా పార్టీ మారిన ఎమ్మెల్యేలను మాత్రం ఇరుకున పెట్టొచ్చని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.
టీడీపీ, వామపక్ష పార్టీలు, బీజేపీ నేతలు కూడా వీరికి సహకరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నిస్తుందా? లేక మాటలకే పరిమితమవుతుందా? అన్నది సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తేలిపోనుంది.

First Published:  3 Oct 2015 3:50 AM GMT
Next Story