గవర్నర్ లేఖ..కేసీఆర్ కాక
కేసీఆర్ గవర్నర్ మధ్య విభేదాలు వచ్చాయా? ఇద్దరి మధ్యా స్నేహం చెడిందా? గవర్నర్ పరోక్షంలో రాజ్భవన్ నుంచి వచ్చిన ఓ లేఖ కేసీఆర్ కు కాక పుట్టించిందా? ఇవే అనుమానాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. తలసాని తలనొప్పితో కేసీఆర్కు బొప్పి కట్టిందని, ఇది కేసీఆర్ గవర్నర్ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా పాడు చేసిందని సమాచారం. అక్టోబర్ 10 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే వ్యూహంతో ఉన్న కేసీఆర్ గవర్నర్తో వ్యవహారం చెడిపోవడంతోనే నిరవధికంగా వాయిదా […]
కేసీఆర్ గవర్నర్ మధ్య విభేదాలు వచ్చాయా? ఇద్దరి మధ్యా స్నేహం చెడిందా? గవర్నర్ పరోక్షంలో రాజ్భవన్ నుంచి వచ్చిన ఓ లేఖ కేసీఆర్ కు కాక పుట్టించిందా? ఇవే అనుమానాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. తలసాని తలనొప్పితో కేసీఆర్కు బొప్పి కట్టిందని, ఇది కేసీఆర్ గవర్నర్ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా పాడు చేసిందని సమాచారం. అక్టోబర్ 10 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే వ్యూహంతో ఉన్న కేసీఆర్ గవర్నర్తో వ్యవహారం చెడిపోవడంతోనే నిరవధికంగా వాయిదా వేయించారని ప్రచారం సాగుతోంది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్
సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్పై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశారట. అసెంబ్లీ, శాసనమండలి సభ్యులకు కలిపి ఒకేసారి దీనిపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేశారట. ఉభయసభల సభ్యులను అసెంబ్లీకి రప్పించి, గవర్నర్ సమక్షంలో అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 10 వరకూ సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. ఈ కార్యక్రమానికి గవర్నర్ను ఆహ్వానించారట. ఆయన తిరస్కరించడంతో కేసీఆర్ ప్లాన్ బెడిసి కొట్టిందని పార్టీ వర్గాల సమాచారం. దీంతో సభను వాయిదా వేయించారని తెలుస్తోంది.
సభాయనమః
తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ మధ్య గ్యాప్ కారణంగానే తెలంగాణ వర్షాకాల సమావేశాలు అర్ధంతరంగా వాయిదా పడ్డాయని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. చివరి రోజైన బుధవారం పలు అంశాలపై చర్చ జరిగిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిసినందున సభను వాయిదా వేయాల్సిందిగా సీఎం కేసీఆర్ స్పీకర్ మదుసూధనాచారిని కోరారు. దాంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీ వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా ముందుగానే నిరవధిక వాయిదా వేశారు.
తలసాని తలనొప్పి
టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ..తన పదవికి రాజీనామా చేయక ముందే టీఆర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తలసాని శ్రీనివాసయాదవ్ వ్యవహారంలో గవర్నర్ కేసీఆర్ మధ్య విభేదాలొచ్చాయని ప్రచారం సాగుతోంది. తలసాని అనర్హుడైనా గవర్నర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారని టీడీపీ, కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై చాలా రోజులుగా మౌనంగా ఉన్న గవర్నర్ ..ఇటీవలే తన కార్యదర్శి ద్వారా తలసాని వ్యవహారం తేల్చాలని లేఖ పంపించారు. ఇది తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మకు చేరింది. ఈ లేఖాస్ర్తంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారట. ఇదే సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్కు గవర్నర్ సుముఖంగా లేకపోవడం కూడా ఇద్దరి మధ్యా విభేదాలకు ఆజ్యం పోసిందని మీడియాలో ప్రచారం సాగుతోంది.