Telugu Global
Arts & Literature

రామాయణ కావ్యాన్ని చిత్రగానం చేసిన " పిలకా నరసింహమూర్తి దంపతులు

తెలుగువారు గర్వంగా ఇది నాది అని చెప్పుకునే రూపకళా వైభవం 'లేపాక్షి చిత్రకళ'. నేత్రరచన, వస్త్రధారణ, కేశాలంకరణ, ఆభరణాలు, వేషం, స్వభావాలలో ఒక్కొ రూపచిత్రం ఒక్కో విధానాన్ని చూపిస్తూ మొత్తం మీద కనులకు ఇంపుగా కనిపించే రాగమాలికలవి. అనంతపురం జిల్లాలోని హిందూపురం పట్టణానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లె లేపాక్షి. దానికి ఆనుకునే ఉంది విరూపాక్ష నిర్మితమైన వీరభద్రేశ్వరుని దేవాలయం. ఆ దేవాలయ ప్రాంగణంలో పై కప్పుపై ఎన్నో అందమైన కళాకృతులు మనకు కనువిందు చేస్తాయి. కాలగతిలో […]

రామాయణ కావ్యాన్ని చిత్రగానం చేసిన  పిలకా నరసింహమూర్తి దంపతులు
X
Pilaka Narasimha Murthy
పిలకా నరసింహమూర్తి దంపతులు

తెలుగువారు గర్వంగా ఇది నాది అని చెప్పుకునే రూపకళా వైభవం 'లేపాక్షి చిత్రకళ'. నేత్రరచన, వస్త్రధారణ, కేశాలంకరణ, ఆభరణాలు, వేషం, స్వభావాలలో ఒక్కొ రూపచిత్రం ఒక్కో విధానాన్ని చూపిస్తూ మొత్తం మీద కనులకు ఇంపుగా కనిపించే రాగమాలికలవి. అనంతపురం జిల్లాలోని హిందూపురం పట్టణానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లె లేపాక్షి. దానికి ఆనుకునే ఉంది విరూపాక్ష నిర్మితమైన వీరభద్రేశ్వరుని దేవాలయం. ఆ దేవాలయ ప్రాంగణంలో పై కప్పుపై ఎన్నో అందమైన కళాకృతులు మనకు కనువిందు చేస్తాయి. కాలగతిలో చాలా వేగంగా కనుమరుగవుతున్న ఈ కుడ్య చిత్రాలకు పునర్జన్మ ప్రసాదించినవారిగా పిలకా నరసింహమూర్తి ప్రసిద్ధులు. 1948 వ సంవత్సరంలో లేపాక్షి మెమోరియల్‌ కమిటీ ఈ బాధ్యతను ఆయనకు అప్పజెప్పింది. దానితో ఆయన ఆ దేవాలయానికి వెళ్ళి, అక్కడ ఒక మంచెను నిర్మించుకొని, దానిపై వెల్లకిలా పడుకొని లేపాక్షి చిత్రకళా రూపురేఖలను ఒక కాగితంపై ట్రేస్‌ చేసి అక్కడ కనిపించే అదే రంగుల ఛాయలను ఉపయోగిస్తూ వాటన్నిటినీ యథాతథంగా పునఃలిఖించి, వాటిని ఆ కమిటీకి అందజేశారు. నరసింహమూర్తికి ముందు లేపాక్షి కుడ్యాలకు నకలుచేసిన వారు లేకపోలేదు. కానీ పిలకావారిది యథాతథ (Size to Size) చిత్రీకరణ. ఆ కమిటీ ద్వారా దేశంలోని ముఖ్య మ్యూజియమ్‌లకు వాటి ప్రతులు కొన్ని పంపబడ్డాయి. ఈ విధంగా తెలుగు వారి చిత్రకళా జైత్రయాత్రకు సారధ్యం వహించేవారాయన. ఈ కృషికి అప్పట్లో భారతీయ కళపై మక్కువ కలవాడు, కళావిమర్శకుడు అని పేరుగాంచిన జె.హెచ్‌.కజిన్స్‌ మన్ననలు పొందటం చాలా సహజంగా జరిగిపోయింది. చాలా క్లిష్టతరమైన ఈ కృషికి లభించిన గుర్తింపుతో మద్రాసు ప్రభుత్వం ఆయనను అడవి బాపిరాజుతో కలసి సిగిరియా బౌద్ధ గుహల చిత్రాలకు నకళ్ళు చేయడానికి పంపింది. ఆ తరువాత మద్రాసు రాష్ట్రంలో దేవాలయాలలో నిక్షిప్తమయిన చిత్రాలకు ప్రాచుర్యం కలిగించడం కోసం ఆ చిత్రాలకు ప్రతిరూపాలు తయారు చేయించడానికి నియమితులైనారు. పిలకావారు శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం, తిరువాయూర్‌, ఉత్తర ఆర్కాట్‌ జిల్లాలోని తిరుమలై, తిరునవ్వేలి జిల్లాలోని తిరువైరైపురం, కేరళలోని తిరుప్పారందోడి దేవాలయాలను దర్శించి ఆ దేవాలయంలోని చిత్రాలకు ప్రతిరూపాలు తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు.

1ఈ మహాయజ్ఞంలో భారతీయ సంప్రదాయ చిత్రకళపై, ముఖ్యంగా లేపాక్షి శైలిపై ఆయన అభిమానాన్ని పెంచుకున్నారు. ఆ అభిమానమే ఆయన చిత్రకళా జీవితాన్ని చివరికంటా ఆవహించింది. పిలకావారు లేపాక్షి చిత్రాలకు నకళ్లు తయారు చేసే సమయానికి లేపాక్షి కళా వైభవం అంతగా వెలుగులోకి రాలేదు. ఒక ప్రత్యేకత సంతరించుకున్న ఆ చిత్రాల కళావైభవాన్ని ఆయన తయారు చేసిన నకళ్ళు ద్వారానే ప్రపంచానికి తెలిసింది. ఈ విధంగా తెలుగు వారిగా ఆయనకు మనమెంతో రుణపడి వున్నాము.

ప్రకృతి నేసిన పచ్చదనాల పందిరి కోనసీమ (తూ||గో||జిల్లా). అక్కడి రాజోలు తాలూకాలోని బుట్టిలంకలో 1918లో జన్మించారు నరసింహమూర్తి. వారి ముత్తాత గౌతమీతీరాన పర్ణశాల నిర్మించుకొని జీవితాన్ని వెళ్ళమార్చుకున్న తపస్వి. తాతగారు నిత్యాగ్నిహోత్రి. తండ్రి సంస్కృత పండితుడు. తల్లి వీరు రెండు సంవత్సరాల వయస్సులో

ఉండగానే స్వర్గస్థులైనారు. వీరి అన్నగారైన పిలకా గణపతి శాస్త్రి జగమెరిగిన రచయిత. (విశాల నేత్రాలు, ప్రాచీన గాథాలహరి) చిన్నతనంలోనే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్న వీరికి అప్పట్లో భారతి మాస పత్రికలో వచ్చిన చిత్రాలు ప్రేరణ కలిగించాయి. చిన్నతనంలోనే 'పాకిస్థాన్‌ పెయింటర్‌ లారియెట్‌' గా నియమించబడ్డ అబ్దుల్‌ రహమాన్‌ చుగ్‌తాయ్‌ చిత్రాలను కాపీ చేసేవారు. వీరి శృతి మించిన చిత్రకళాభిమానాన్ని గమనించిన స్కూలు టీచర్‌ తీవ్రంగా దండించటంతో బొబ్బలెక్కిన ఆయన చేతులు చూసిన అన్నలు తమ్ముని కళాభివేశాన్ని అర్థం చేసుకొని రాజమండ్రిలోని దామెర్ల రామారావు కళాశాలలో విద్యార్థిగా జేర్పించారు. అప్పటికాయన వయస్సు పధ్నాలుగు సంవత్సరాలు. అప్పుడే ఆయనకు మరొక ప్రముఖ చిత్రకారుడయిన మొక్కపాటి కృష్ణమూర్తితో పరిచయమేర్పడి, తరువాత బంధుత్వంలోకి దారి తీసింది.

మద్రాసు ఆర్ట్‌ కాలేజీకి ప్రిన్సిపాలుగా వున్న రాయ్‌ చౌదరి ఈయన చిత్రాలను చూసి ఈయనలోని సృజనను గ్రహించి పిలకావారిని మద్రాసు కాలేజిలో సీనియర్‌ బేచ్‌లో జేర్పించుకున్నారు. 1939 వ సంవత్సరంలో డిప్లమా పొందిన పిలకావారు, అదే సంవత్సరం తాను ఒకనాటి విద్యార్థిగా ఉన్న దామెర్ల రామారావు కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమితులైనారు. 1953వ సంవత్సరంలో చెెన్నపురి ఆంధ్రమహాసభ నిర్వహించిన భారతీయ కళా విభాగంలో బంగారు పతకాన్ని పొందారు. అమృతసర్‌లో నిర్వహించబడిన ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అసోషియేషన్‌ పోటీలో మరొక బంగారు పతకం బహుమతిగా అదే సంవత్సరం లభించింది. చిత్రకళలో తరువాతి కాలంలో దిగ్గజాలనిపించుకొన్న కె.సి.ఎస్‌.పణిక్కర్‌, సయ్యద్‌ అహ్మద్‌, ప్రొదోష్‌ దాస్‌ గుప్తా, సుశీల్‌ ముఖర్జీలు మద్రాసులో వీరి సహాధ్యాయులు. నరసింహమూర్తి నీటిరంగుల మాధ్యమంను ఇష్టపడతారు. కొన్ని చిత్రాలు చెక్కపై, బట్టపై వేసినా ఎక్కువ భాగం చిత్రాలు కాగితంపై నీటిరంగుతో వేసినవే. గోధుమ, పసుపు, ఎరుపులు ఆయన అభిమానించే సంప్రదాయ రంగులు. ఆయన చిత్రాలలో అజంతా, లేపాక్షి, తెలుగు జానపద శైలులు కొట్టొచ్చినట్లు కనిపించినా బెంగాలీ స్కూలు ప్రభావం కొంత లేకపోలేదు.

2పిలకావారిది గోదావరికి తూర్పు ప్రాంతమయితే వారి సతీమణి విజయలక్ష్మిది పశ్చిమ గోదావరి జిల్లాలోని వసంతవాడ. అయినా మద్రాసులోనే నివాసం. అర్థాంగి అన్న మాటకు అన్నివిధాలా ప్రత్యక్ష నిదర్శనంగా నిలచిన విజయలక్ష్మి మొక్కపాటి వారి ఆడపడుచు. ఆమె తన పందొమ్మిదవ యేట చిత్రాలు గీయాలని ఆరాటపడుతుంటే అన్నగారైన మొక్కపాటి కృష్ణమూర్తి ఆమెకు చిత్రకళలో ఓనమాలు నేర్పిన గురువు. పెండ్లయిన తరువాత ఆమెలోని మౌఖిక భావాలకు రూపమిచ్చి, ప్రోత్సహించి, మెళుకువలు నేర్పి, ఆమె సృజనకు మెరుగులు పెట్టినవారు వారి జీవిత భాగస్వామయిన పిలకావారే. ఒక్కోసారి పోటీకి పంపబడిన చిత్రాలు తిరిగివస్తే ఆమె అధైర్యపడకుండా, ప్రోత్సహించి ధైర్యం నింపేవారు. ఆమె అతి త్వరలోనే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. రాజస్థాన్‌, పహాడీ చిత్రాలలో కనిపించే లాలిత్యాన్ని దక్షిణాది చిత్రాలకు తీసుకొని వచ్చిన ఘనత ఆమెదే. ఎంతో నేర్పూ, ఓర్పూ ఉంటేనే గాని కొనసాగించ లేని సన్నటి రేఖా విలాసాన్ని ఆమె సొంతం చేసుకోగలిగారు. వేళ్ళమీద లెక్కించదగిన చిత్రకారిణులు వున్న ఆ రోజులలో, పెళ్ళినాడు పిలకావారి చిటికెన వ్రేలు పట్టుకుని నిజజీవితంలోనూ, కళాజీవితంలోనూ ఆయనతో సమానంగా ప్రయాణించి పేరు తెచ్చుకున్నారు. ఆమె వేసిన చిత్రాలు చూసిన రాజాజీ ఆమె నైపుణ్యం చూసి, నిజంగానే ఈ అమ్మాయే వేసిందా? అని విస్తుపోయారు. సంప్రదాయ చిత్రాలేకాదు మూర్తి చిత్రాలు వేయటంలోనూ ఆమె నిష్ణాతురాలు. ఆమె పెన్సిల్‌తో వేసిన సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి, రామకృష్ణ పరమహంస, వివేకానంద మూర్తుల చిత్రాలు ఆమెలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనంగా నిలుస్తాయి. మొట్ట మొదటిసారిగా విశాఖపట్టణంలో జరిగిన చిత్రకళా పరిషత్‌ ప్రదర్శనలో 1969న ఆమె మొదటి బహుమతి గెలుచుకున్నారు. 'పలికించెడివాడు రామభద్రుండట' అన్నట్లుగా విజయలక్ష్మి "నేను ఏ గీత గీసినా శ్రీరాముని రూపమే అవుతుంది, నా కళ భక్తి కోసమే" అని చెబుతారు.

3మద్రాసు రాష్ట్రంలో చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసి రిటైరైన ఎమ్‌. అనంతనారాయణ ఈ దంపతుల అభిమాని. రామాయణం లోని సుందర కాండను చిత్రించవలసినదిగా వారు ఇచ్చిన సలహాననుసరించి రామాయణ చిత్ర గాథకు శ్రీకారం చుట్టారు. శాంతినికేతన్‌లో నందలాల్‌ బోసు వద్ద శిష్యరికం చేసిన వి. ఆర్‌. చిత్ర వీరిని ప్రోత్సహించటమేకాక మొట్టమొదటి సుందరకాండ ప్రదర్శన విశాఖపట్టణంలో జరిగేలా ఏర్పాట్లు చేశారు. 1959లో జరిగిన ఆ ప్రదర్శన అప్పటి నుంచి అప్రతిహతంగా బెంగుళూరు, మద్రాసులలోని మాక్స్‌ముల్లర్‌ భవనంతో పాటు అనేక నగరాలలో ప్రదర్శించబడి అందరి ఆమోదాన్ని పొందాయి. అప్పుడు బాలకాండతో ప్రారంభమయిన ఆ చిత్రణ ఇప్పుడు యుద్ధకాండ వరకూ కొనసాగి సుమారు ఆరువందల చిత్రాలుగా రూపుదిద్దుకుంది. వీటిని ఒక క్రమంలో చూస్తూ పోతే ఒక నిశ్చల, చలనచిత్ర అనుభూతి కలుగుతుంది. ఈ చిత్రాలలో ఇద్దరూ కలసి చిత్రించినా, కొన్ని చిత్రాలలో విజయలక్ష్మి భావుకత మనల్ని కట్టిపడేస్తుంది. సీత బొట్టు పెట్టుకుంటున్నపుడు శ్రీరాముని చిత్రం అద్దంలో కనిపిస్తున్నట్లుగా చేసిన ఆమె చిత్రణ, అంతే కాకుండా, శ్రీరామ భరత లక్ష్మణ శతృఘ్నుల బాల్యపు ఆటలు రామాయణంలో లేనివి ఆమె ఊహించి ఆ బాల క్రీడలను చిత్రించారు. భార్యా భర్తల మధ్య సౌహార్ద పూరిత వాతావరణం ఉంటేనే అలా జంటగా చిత్రించటం సాధ్యమవుతుంది. వారి బాంధవ్యంలో అది పుష్కలంగా ఉందని చెప్పడానికి వారి రామాయణ రచనలు చాలు.

వీరి బాంధవ్యానికి నిదర్శనంగా కాబోలు ఈ దంపతులు రచించిన శ్రీరామపట్టాభిషేకం (5'x10′) ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో స్థానం సంపాదించింది. రాముని చిత్రాలేకాదు ప్రతి సంవత్సరం ఒక వినాయకుని చిత్రాన్ని గీయటం వీరు తమంత తాముగా ఏర్పరుచుకున్న ఒక సంప్రదాయం. ఇంతవరకూ యాభై చిత్రాలు గీశారు. పెద్ద పెద్ద చిత్రాలు గీయవలసి వచ్చినపుడు వాటిని నేలపై పరచి చిత్రరచన సాగిస్తారు. తిరుపతి గుడిలోని వెంకటేశ్వరుని మూలవిరాట్టును చిత్రించడానికి విజయలక్ష్మికి అవకాశం కల్పించబడింది. ఆమె భక్తి పారవశ్యంతో పాటలు పాడుకుంటూ చిత్రీకరణ సాగించి అందరి మన్ననలనూ పొందగలిగారు. అరుదైన ఆ అవకాశం తన పూర్వజన్మ సుకృతమంటారు ఆమె.

4నరసింహమూర్తి చిత్రాలలోని రేఖలు అందమైన తెలుగు అక్షరములకు కొనసాగింపుగా మనల్ని అలరిస్తాయి. ఆ చిత్రాలు చూసిన ఎవరైన చాలా సులువుగా చెప్పగలుగుతారు. ఇది వేసింది తెలుగువారని. తెలుగు అక్షరంలోని పూర్ణానుస్వారంతో కూడిన సౌందర్యం వీరి రేఖలలో పొందికగా ఒదిగిపోయింది. వీరిద్దరి శైలిలో తేడాలు వున్నా అవి ఒకే చిత్రంలో చూస్తున్నపుడు పాలు నీళ్ళులా కలసిపోతాయి.

వీరి రామాయణ దృశ్యాలతో ఒక మ్యూజియమ్‌ను స్థాపించాలనుకున్న అనంతరామన్‌ కోర్కె ఇంకా నెరవేరలేదు. ఒకనాటి ప్రసిద్ధ చిత్రకారులయిన దామెర్ల, రాజాజీ, భగీరథ, కూల్డ్రే మొదలగు వారి చిత్రాలు రాజమండ్రిలోని దామెర్లవారి ఆర్ట్‌ గ్యాలరీలో, మరికొన్ని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రదర్శనకు నోచుకున్నాయి. మరి వందలకొద్ది చిత్రాలు వేసిన పిలకా దంపతుల సంగతేమిటి? వీరి చిత్రాలను మనం ఎక్కడ చూడగలుగుతాం? వీరి కళకు మనం ఇవ్వగలిగే నివాళి ఏమిటి? మన రాష్ట్రంలో ఇంకా ఎన్నో చిత్రకళా మ్యూజియమ్‌లు రావలసిన అవసరం ఉందనే సత్యాన్ని ఇది చాటి చెబుతుంది. సంప్రదాయ చిత్ర కళా రీతుల్లో వేసే ఇటువంటి చిత్రాలను రాష్ట్రం ప్రభుత్వం లేదా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థలు వీటిని తమ అధీనంలోకి తీసుకొని మనకళా సంపదను రాబోయే తరాలకు అందించవలసిన బాధ్యత ఉంది. ఇందులో మనమందరం పాలుపంచుకోవాలి.

పిలకానరసింహమూర్తి కీర్తిశేషులైనారు. విజయలక్ష్మి ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. వీరు వేసిన వందలాది చిత్రాలను అతి జాగరూకతతో భద్రపరచినవారు వీరి ఏకైక కుమార్తె విష్ణుప్రియ, అల్లుడు చిట్టి బాలసుబ్రహ్మణ్యం. పిలకావారి సంపూర్ణ రామాయణాన్ని మ్యూజియంలో చూసే అదృష్టం త్వరలోనే లభిస్తుందని ఆశిద్ధాం.

(సప్తపర్ణి నుంచి)

– కాండ్రేగుల నాగేశ్వరరావు

First Published:  24 Aug 2021 8:40 AM GMT
Next Story