Telugu Global
NEWS

జగన్‌ దీక్షను నిర్లక్ష్యం చేస్తున్న జాతీయ మీడియా

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిరాహారదీక్షకు అనూహ్య మద్దతు లభిస్తోంది. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహించడాన్ని నేతలంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు విజయనగరం నుంచి అనంతపురం వరకు జగన్‌కు దీక్షకు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే దీక్షకు జాతీయ మీడియా ప్రచారం లభించక పోవడాన్ని సీనియర్‌ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అంటే నిరుద్యోగాన్ని పాలదోలడమేనని, పారిశ్రామికీకరణకు పునాదులు పడడమేనని… ఇంతముఖ్యమైన విషయాన్ని జాతీయ మీడియా నిర్లక్ష్యం […]

జగన్‌ దీక్షను నిర్లక్ష్యం చేస్తున్న జాతీయ మీడియా
X
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిరాహారదీక్షకు అనూహ్య మద్దతు లభిస్తోంది. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహించడాన్ని నేతలంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు విజయనగరం నుంచి అనంతపురం వరకు జగన్‌కు దీక్షకు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే దీక్షకు జాతీయ మీడియా ప్రచారం లభించక పోవడాన్ని సీనియర్‌ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అంటే నిరుద్యోగాన్ని పాలదోలడమేనని, పారిశ్రామికీకరణకు పునాదులు పడడమేనని… ఇంతముఖ్యమైన విషయాన్ని జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానం కలుగుతోందిని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు.

జాతీయ మీడియా పట్టించుకుంటేనే కేంద్రం దృష్టికి సమస్య వెళుతుందని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం చేసే దీక్షను ఉపేక్షించడం సరికాదని అమర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడుచోట్ల జగన్‌ దీక్షకు మద్దతుగా ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. తిరుపతిలో, గుంటూరులోని జగన్‌ దీక్ష స్థలిలో ఇద్దరు వ్యక్తులు పెట్రలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా… కడప జిల్లా రాజంపేటలో ఓ మహిళ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష శిబిరం వద్ద ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని హల్‌చల్‌ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిపై నీళ్లు పోసి, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అక్కడే బోటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను కింద పారబోశారు.

తాడిపత్రిలో 30 మంది కార్యకర్తల అరెస్ట్‌

గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా అనంతపురం తాడిపత్రిలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో దీక్షలు చేపట్టిన దాదాపు 30 మంది కార్యకర్తలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని ఆ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా గోరంట్లలోని ఏటి గంగమ్మ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా జగన్ దీక్ష విజయవంతం కావాలని గంగమ్మను వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైఎస్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు మాజీ ఎంపీ జి వి హర్షకుమార్ మద్దతు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం హర్షకుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ దీక్ష తన స్వార్థం కోసం కాదన్నారు.

రిక్షా తొక్కిన వైఎస్‌ఆర్‌ పార్టీ ఎమ్మెల్యే
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జయరాములు పార్టీ అధినేత జగన్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం రిక్షా తొక్కారు. బద్వేలు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి సిద్ధవటం రోడ్డులోని వినాయకుడి గుడి వరకు రిక్షా తొక్కుకుంటూ వెళ్లారు. 101 కొబ్బరికాయలను రిక్షాలో తీసుకెళ్లి ఆలయం వద్ద కొట్టారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ కర్నూలు జిల్లా డోన్ లో వైఎస్ఆర్ సీపీ నేతల బైక్ ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా రిలే దీక్షలు కొనసాగాయి. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని విస్మరిస్తారా.. అందుకేనా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. నీతి ఆయోగ్ పేరిట ప్రత్యేక హోదా అడ్డుకుంటున్నారని, నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని సభలో అడిగిన వెంకయ్యనాయుడికి ఇప్పుడు ఆ విషయం ఎందుకు అర్థం కావడంలేదో అని అన్నారు.
హోదా కోసం 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం
వైఎస్ జగన్ ఆరోగ్యంపై మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి తిరుపతిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం దమ్ముంటే రాజీనామా చేయాలని మంత్రులిద్దరికి సవాల్ విసిరారు. సదరు మంత్రులిద్దరికీ మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు 67 మంది రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నామని చెవిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చిత్తశుద్దితో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ పై ఆరోపణలు మానుకోవాలని లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇష్టమొచ్చినట్లు వాఖ్యానిస్తున్నారని, అసలు రక్త నమునాలు ఎప్పుడు తీసుకుంటున్నారో పరీక్షలు ఎప్పుడు చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు.
First Published:  12 Oct 2015 10:01 AM GMT
Next Story