Telugu Global
NEWS

మన మట్టి... మన నీరు... మన రాజధాని

 నేటి నుంచి ఘనంగా అమరావతి వారోత్సవాలు అమరావతి శంకుస్థాపనలో రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని భాగస్వామిని చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, 3000 మున్సిపల్‌ వార్డుల నుంచి మట్టి, నీటిని సేకరించనుంది. శంకుస్థాపన కార్యక్రమాన్ని వారోత్సవాలుగా నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాడ్యమి, దసరా శుభ ఘడియలు ప్రవేశించే 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మట్టి, నీటిని సేకరించే కార్యక్రమానికి శ్రీకారం […]

మన మట్టి... మన నీరు... మన రాజధాని
X
నేటి నుంచి ఘనంగా అమరావతి వారోత్సవాలు
అమరావతి శంకుస్థాపనలో రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని భాగస్వామిని చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, 3000 మున్సిపల్‌ వార్డుల నుంచి మట్టి, నీటిని సేకరించనుంది. శంకుస్థాపన కార్యక్రమాన్ని వారోత్సవాలుగా నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాడ్యమి, దసరా శుభ ఘడియలు ప్రవేశించే 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మట్టి, నీటిని సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం కోరింది. ప్రతి గ్రామం, వార్డులో పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీ సభ్యులు, పురోహితులు, అర్చకులు ర్యాలీగా ఎంపిక చేసిన ప్రదేశానికి వెళ్లి వేదోక్తంగా కిలో మట్టిని, కలశంతో నీటిని వేర్వేరుగా సేకరించి… పసుపు సంచి, పాలిథీన్‌ కవర్‌లో ఉంచి 13, 14 తేదీల్లో గ్రామాల్లో వేడుకగా ఊరేగించాలి. వీటిని 14 సాయంత్రం గ్రామాల నుంచి తహసీల్దారు కార్యాలయాలకు చేర్చి అక్కడకు వచ్చిన మట్టి, నీటిని అట్టపెట్టెలలో పేర్చి 15వ తేదీ ఉదయం 10 గంటలకల్లా మండల కేంద్రాలకు తరలించాలి. అక్కడ పూజల నిర్వహణ అనంతరం 17వ తేదీ సాయంత్రం నియోజకవర్గ కేంద్రాలకు తరలిస్తారు. 18వ తేదీ సాయంత్రం ఊరేగింపుగా జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. 19న మంత్రులు జెండా ఊపడంతో జిల్లా కేంద్రాల నుంచి మట్టి, నీరు ఉంచిన వాహనాలు గుంటూరుకు తరలివెళ్తాయి. ఇలా వచ్చిన వాహనాలన్నీ గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా పార్క్‌ చేసి ఉంచుతారు. 20న సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపి ప్రారంభించే యాత్రతో భారీ ఊరేగింపుతో మట్టిని, నీటిని రాజధాని అమరావతికి తీసుకెళ్తారు. ఇలా సేకరించిన పవిత్ర జలాలను, మట్టితోపాటు సంకల్పజ్యోతులు కూడా ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి అదే సమయానికి రాజధాని ప్రాంతం అమరావతికి చేరుకుంటాయి. ఇలా ఓ అద్భుతమైన వేడుకగా అమరావతి వారోత్సవాలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
First Published:  12 Oct 2015 9:52 PM GMT
Next Story