Telugu Global
Others

పైచేయి ఎవరిది?

ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన దీక్షను ఏడో రోజు ప్రభుత్వం భగ్నం చేసింది. ఇప్పుడు మొత్తం ఎపిసోడ్‌లో ఎవరు ఏం సాధించారన్న దానిపై లెక్కలేసుకుంటున్నారు. జగన్ దీక్షలో తొలి నాలుగు రోజులు సాధారణంగానే సాగింది. యువకుడు కావడంతో తొలిరోజుల్లో ఆయన ఆరోగ్యంపైనా ఎవరూ పెద్దగా ఆందోళన చేయలేదు. మీడియాలో టీడీపీదే పైచేయి కావడం వల్ల చాలా టీవీ చానళ్లు జగన్‌ దీక్షపై పెద్దగా ప్రచారం కూడా ఇవ్వలేదు. అయితే మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు […]

పైచేయి ఎవరిది?
X

ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన దీక్షను ఏడో రోజు ప్రభుత్వం భగ్నం చేసింది. ఇప్పుడు మొత్తం ఎపిసోడ్‌లో ఎవరు ఏం సాధించారన్న దానిపై లెక్కలేసుకుంటున్నారు. జగన్ దీక్షలో తొలి నాలుగు రోజులు సాధారణంగానే సాగింది. యువకుడు కావడంతో తొలిరోజుల్లో ఆయన ఆరోగ్యంపైనా ఎవరూ పెద్దగా ఆందోళన చేయలేదు. మీడియాలో టీడీపీదే పైచేయి కావడం వల్ల చాలా టీవీ చానళ్లు జగన్‌ దీక్షపై పెద్దగా ప్రచారం కూడా ఇవ్వలేదు. అయితే మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు చేసిన ఆరోపణలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చెప్పాలంటే జగన్‌ దీక్షకు విపరీతమైన పబ్లిసిటీ రావడానికి మంత్రులిద్దరూ బాగా సాయపడ్డారు.

జగన్ షుగర్ లెవల్స్‌పై అనుమానాలున్నాయంటూ మంత్రులు ఆరోపణలు చేయడంతో మీడియాతో పాటు అందరి దృష్టి జగన్ దీక్షపైకి మళ్లింది. పాజిటివ్‌గానైనా నెగిటివ్‌గానైనా ప్రతి టీవీ చానల్ జగన్ దీక్షపై చర్చ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని చానళ్లు పనిగట్టుకుని జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా దాని వల్ల ప్రజలకు మరిన్ని విషయాలు అర్థమయ్యాయి.

అందులో 1. జగన్ షుగర్ లెవల్స్ ఎలా ఉన్నా ఆయన చేస్తున్న దీక్ష రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం కదా… అలాంటప్పుడు మద్దతివ్వాల్సింది పోయి మంత్రులు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అన్న భావన కలిగింది.

2. జగన్‌ అంటే చాలు గుడ్డిగా వ్యతిరేకించాలన్న పాలసీ పెట్టుకున్న కొన్ని చానళ్లు కూడా జనంలో చులకనైపోయాయి. నీతులు చెప్పే సదరు మీడియా సంస్థలు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న అనుమానం ప్రజల్లో కలిగింది.

3. ప్రతిపక్ష నేత దీక్ష చేస్తుంటే కనీసం తామూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం అన్న ప్రకటన కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. దీని ద్వారా ప్రత్యేక హోదాపై ప్రభుత్వానికి ఏమాత్రం ఆసక్తి లేదన్న అభిప్రాయం కలిగింది.

4. జగన్‌కు దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయాలని టీడీపీ నేతలు ఎదురుదాడి చేసినా… జగన్ కనీసం ఇక్కడైనా దీక్ష చేస్తున్నారు… మరి ప్రత్యేకహోదా హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలేం చేస్తున్నారన్న ప్రశ్న సహజంగానే మరోసారి హైలైట్ అయింది. టీడీపీ చెబుతున్నట్టు జగన్ నిజంగా మోదీకి భయపడుతుంటే … కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో దీక్షకు దిగే సాహసం చేసేవారా అన్న భావన కూడా కలిగింది.

5. రాజకీయంగా దీక్ష ద్వారా జగన్‌కు అంతోఇంతో లాభం కలిగిన మాట వాస్తవం. ప్రత్యేక హోదా పోరాటానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌ అని చెప్పుకునే అవకాశం దీక్ష ద్వారా జగన్‌కు దక్కింది. మంచి కార్యక్రమం చేశారన్న సంతృప్తి పార్టీ శ్రేణుల్లోనూ కనిపిస్తోంది. అయితే జగన్ దీక్ష మీడియాలో బాగా హైలైట్ అవడానికి… జనంలో చర్చ జరిగేలా ఊపు రావడానికి మాత్రం మంత్రులు కామినేని, ప్రత్తిపాటి కామెంట్స్ బాగానే ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు.

First Published:  13 Oct 2015 12:04 AM GMT
Next Story