Telugu Global
Others

బీజేపీతో తెగదెంపులకు సన్నద్ధమవుతున్న శివసేన? 

మహారాష్ట్రలో అధికార పార్టీ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకునే దిశగా పావులు కదులుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సర్కారులో మంత్రులుగా ఉన్న శివసేన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే శివసేన ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసింది. పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖుర్షీద్ కసూరి పుస్తకావిషర్కణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం రాష్ట్రానికి అవమానకరమని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ […]

బీజేపీతో తెగదెంపులకు సన్నద్ధమవుతున్న శివసేన? 
X
cpvvsమహారాష్ట్రలో అధికార పార్టీ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకునే దిశగా పావులు కదులుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సర్కారులో మంత్రులుగా ఉన్న శివసేన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే శివసేన ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసింది. పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖుర్షీద్ కసూరి పుస్తకావిషర్కణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం రాష్ట్రానికి అవమానకరమని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. కసూరిని వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రే ఛత్రపతి శివాజీ మహనీయుడి గడ్డ అయిన మహారాష్ట్రకు చెడ్డ పేరు తెచ్చారని ఆరోపించారు. కసూరికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించడం నవంబర్‌ 26న ముంబై టెర్రర్ ఎటాక్‌లో అసువుల బాసిన పోలీస్ ఉన్నతాధికారులను అవమాన పరచడమేనని ఆయన అన్నారు. మరోవైపు ఫడ్నవీస్‌ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇది తమ పార్టీకి భవిష్యత్తులో నష్టం కలిగిస్తుందని శివసేన భావిస్తున్నట్టు తెలిసింది. దీన్ని ఆధారం చేసుకునే బీజేపీకి టాటా చెప్పేయాలని భావిస్తోందంటున్నారు.
పాకిస్తాన్‌ అంటే ఒంటి కాలిపై లేచే శివసేన… ఆ దేశానికి చెందిన కళాకారులను ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌లో అడుగుపెట్టనివ్వబోమని భీష్మించుకు కూర్చుంది. పాకిస్థాన్‌పై పోరాటం నేరమైతే.. ఆ నేరాన్ని చేసేందుకు శివసేన ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించడం ద్వారా సంజయ్ రౌత్ శివసేన వైఖరిని చెప్పకనే చెప్పారు. ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణిపై జరిగిన దాడిని కూడా శివసేన సమర్ధించుకుంది. శివసేన ఆందోళనల నేపథ్యంలో గట్టి పోలీసుల భద్రత మధ్య వర్లీలో కసూరి పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్రమ సహ నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణిపై నల్లరంగు పోసి అరెస్టైన ఆరుగురు శివసేన కార్యకర్తలు మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. వారిని శివసేన అధినేత ఉద్దవ్ ఠాకరే భుజం తట్టి అభినందించడం ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న కల్యాణ్‌ డొంబివిల్‌లో శివసేన ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తోంది. శివసేన ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడడం ఖాయం.
ఒకవేళ శివసేన మద్దతు ఉపసంహరించుకుంటే తమకు ఎన్సీపీ అండగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అయితే అనూహ్యంగా 41 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీ ఫడ్నవీస్ సర్కారు ఆశలపై నీళ్లు చల్లింది. 288 సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీకి 145 మంది ఎమ్మెల్యేలు అవసరం. 63 మంది ఎమ్మెల్యేలున్న శివసేనను ఫడ్నవీస్ సర్కారు వదిలించుకుంటే బిజెపి వద్ద తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు 123 మంది మాత్రమే మిగులుతారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతిస్తున్నా ప్రభుత్వం నిలబడాలంటే మరో 15 మంది ఎమ్మెల్యేలు అవసరం. శివసేనను వదిలించుకున్నాక అదే పార్టీ నుంచి కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుండ బద్దలు కొట్టారు. ఫడ్నవీస్ సర్కారుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. నిజంగా శివసేన మద్దతు ఉపసంహరించుకుంటే ఆ పార్టీ నుంచి 18 మంది బీజేపీ అండగా నిలబడతారా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
First Published:  13 Oct 2015 6:36 AM GMT
Next Story