Telugu Global
Others

ఇది సింగపూర్‌కే వార్నింగా?

అమరావతి శంకుస్థాపనకు వచ్చే ప్రసక్తే లేదని ప్రతిపక్ష నేత జగన్ స్పష్టం చేయడంతో దాని పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సాయం చేస్తాయంటూ ఏపీ ప్రభుత్వం చెబుతున్న సింగపూర్, జపాన్‌లు ఎలా స్పందిస్తాయన్న దానిపై టీడీపీ నేతలు కొంచెం ఆందోళన చెందుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణం ఏమిటంటే… అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి సింగపూర్ వెళ్లినప్పుడు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని అక్కడి ప్రభుత్వాన్ని, కంపెనీలను కోరారు. […]

ఇది సింగపూర్‌కే వార్నింగా?
X

అమరావతి శంకుస్థాపనకు వచ్చే ప్రసక్తే లేదని ప్రతిపక్ష నేత జగన్ స్పష్టం చేయడంతో దాని పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సాయం చేస్తాయంటూ ఏపీ ప్రభుత్వం చెబుతున్న సింగపూర్, జపాన్‌లు ఎలా స్పందిస్తాయన్న దానిపై టీడీపీ నేతలు కొంచెం ఆందోళన చెందుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణం ఏమిటంటే…

అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి సింగపూర్ వెళ్లినప్పుడు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని అక్కడి ప్రభుత్వాన్ని, కంపెనీలను కోరారు. అందుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ లాంటి వాళ్లు మారుమాట చెప్పకుండా సమర్ధించినప్పటికీ మిగిలిన నేతలు, కంపెనీల ప్రతినిధులు పలు అనుమానాలు వ్యక్తం చేశారట. ముఖ్యంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు.

రాజధాని నిర్మాణం అన్నది ఐదు పదేళ్లలో పూర్తి కాదని…ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మరోపార్టీ అధికారంలోకి వస్తే తాము పెట్టిన పెట్టుబడులకు గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారట. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, పాలసీలను వచ్చే ప్రభుత్వం వ్యతిరేకిస్తే తమ పరిస్థితి ఏమిటని సంశయాన్ని సింగపూర్, జపాన్ ప్రతినిధులు మొదట్లో వ్యక్తం చేశారని చెబుతున్నారు. దీనిపై చంద్రబాబు బృందం కొన్ని విషయాలు వివరించి ఒప్పించారని సమాచారం.

తమ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయాలను విపక్షాలు వ్యతిరేకించడం సహజమని… ఒక వేళ వారు అధికారంలోకి వచ్చినా పెట్టుబడులు పెట్టే వారికి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించరని వివరించారు. వారు కూడా ఈ విషయాలు నమ్మారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అతిథులను పిలిచి రాజధాని శంకుస్థాపన చేస్తున్న వేళ ప్రతిపక్షం రాకపోతే సింగపూర్,జపాన్ మిత్రులకు ఎలాంటి సంకేతాలు అందుతాయోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

కార్యక్రమానికే హాజరు కాలేనంత స్థాయిలో వ్యవహారం నడుస్తున్న పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో అధికారం మారితే తమ పెట్టుబడులకు రక్షణ ఎలా ఉంటుందన్న భావన వారిలో కలిగే అవకాశం ఉంటుందంటున్నారు. రాజధానిలో విదేశీ కంపెనీలకు వేల ఎకరాల భూములు అప్పగించడాన్ని భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం తప్పుపడితే పరిస్థితి ఏమిటన్న భావన కలిగే అవకాశం ఉంటుందంటున్నారు. మొత్తం మీద జగన్ శంకుస్థాపనకు రానని చెప్పడం ద్వారా అమరావతి నిర్మాణంలో జరిగే రహస్య ఒప్పందాలకు తాము వ్యతిరేకమన్న మేసేజ్ పంపారన్న భావన వ్యక్తమవుతోంది.

First Published:  17 Oct 2015 12:02 AM GMT
Next Story