Telugu Global
Others

మోదీని అవమానిస్తే ఊరుకోం!

అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ ఏపీకి ఎలాంటి వరాలు ఇవ్వకుండా వెళ్లడంపై వస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అయితే మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు బృందమే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో బీజేపీ తరపున తొలి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ సోమువీర్రాజు … చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శంకుస్థాపనలో ప్రధాని ప్రసంగం నిరాశ కల్పించిందన్న ఎంపీ గల్లా జయదేవ్‌పైగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్రం ప్రభుత్వం […]

మోదీని అవమానిస్తే ఊరుకోం!
X

అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ ఏపీకి ఎలాంటి వరాలు ఇవ్వకుండా వెళ్లడంపై వస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అయితే మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు బృందమే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో బీజేపీ తరపున తొలి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ సోమువీర్రాజు … చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శంకుస్థాపనలో ప్రధాని ప్రసంగం నిరాశ కల్పించిందన్న ఎంపీ గల్లా జయదేవ్‌పైగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి కేంద్రం ప్రభుత్వం అనేక రీతుల్లో సాయం చేస్తున్నా టీడీపీ ప్రభుత్వం మాత్రం వాటి గురించి చెప్పడం లేదని వీర్రాజు మండిపడ్డారు. కేవలం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అంటూ మోదీని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంటూ యాగి చేస్తున్న హీరో శివాజీ, కారెం శివాజీల వెనుక ఎవరున్నారో తమకు తెలుసన్నారు. కారెం శివాజీని ఒక మంత్రి నడిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా మీడియాలో పద్దతి ప్రకారం ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.

రాజధాని రింగ్‌రోడ్డుకు 950 కోట్లు ఇస్తున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఏపీలో 24 గంటల విద్యుత్ అమలవుతోందంటే దానికి కారణం కేంద్రం కాదా అని ప్రశ్నించారు. విభజన బిల్లులో లేకున్నా నిరంతర విద్యుత్‌కు ఏపీని ఎంపిక చేశారని గుర్తు చేశారు. చిన్నపిల్లల టీకా కార్యక్రమం ఇంద్రదనస్సును కేంద్రం ప్రారంభిస్తే… ఏపీలో ఆ కార్యక్రమంలో కనీసం మోదీ ఫోటో కూడా లేకుండా చేస్తున్నారని వీర్రాజు విమర్శించారు. చత్తీస్‌ఘడ్ రాజధాని కోసం కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని… అదే ఏపీ రాజధానికి ఇప్పటికే 1850 కోట్లు ఇచ్చారని చెప్పారు. మునుముందు మరింత సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

ఇప్పటికైనా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు అడ్డుకట్టవేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము కూడా నోరు విప్పాల్సి వస్తందని హెచ్చరించారు. ప్రధానిని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన గల్లా జయదేవ్ క్షమాపణ చెప్పాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

First Published:  25 Oct 2015 5:12 AM GMT
Next Story