Telugu Global
Others

పరువు పొగొట్టుకునేందుకే పోటీనా?

వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని వైసీపీ ప్రకటించింది. పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ మధ్యే ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. . దీంతో వైసీపీ ఎందుకు పోటీ చేస్తోంది?… ఫలితాల్లో ఏ స్థానంలో ఉంటుందన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే వైసీపీ పోటీ వెనుక ఏదో ప్లాన్ ఉండి తీరాలే గానీ గెలుపుపై ధీమా అత్యాశే అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఒక రాజకీయ పార్టీగా […]

పరువు పొగొట్టుకునేందుకే పోటీనా?
X

వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని వైసీపీ ప్రకటించింది. పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ మధ్యే ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. . దీంతో వైసీపీ ఎందుకు పోటీ చేస్తోంది?… ఫలితాల్లో ఏ స్థానంలో ఉంటుందన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే వైసీపీ పోటీ వెనుక ఏదో ప్లాన్ ఉండి తీరాలే గానీ గెలుపుపై ధీమా అత్యాశే అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది.

ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలకు దూరంగా ఉండడం సబబు కాదు. నిజమే ఆ విషయాన్ని ఎవరూ కాదనరు. కానీ వచ్చే ఫలితాలు పార్టీ భవిష్యత్తుపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో కూడా అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు అధికార పీఠం అధిరోహించని వైసీపీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో ఎలాంటి ఫలితాలు సాధించిందో అందరికీ తెలుసు. ఆ ఫలితాలు చూసిన తర్వాత కూడా ఒంటరి తెగింపు ఎంతవరకు మంచిదో ఆలోచించుకోవాలి.

ఒక వేళ రాజకీయ పార్టీగా ఎన్నికల్లో తమ పాత్ర ఉండాలి తీరాలి, అదే సమయంలో పరువు పోకూడదనుకుంటే కమ్యూనిస్టులు నిలుపుతున్న అభ్యర్థికి మద్దతిస్తే సరిపోతుంది. ఓడినా ఓటమి నింద గుంపులో గోవింద అన్నట్టు కలిసిపోతుంది. ఒకవేళ తమ పార్టీ బలమెంతో తెలుసుకునేందుకు వైసీపీ నేరుగా బరిలో దిగుతోందా అని భావించేందుకు పెద్దగా అవకాశం లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల సమయానికి , ఇప్పటికీ తెలంగాణలో వైసీపీ చేసిన ప్రత్యేక కార్యక్రమాలు గానీ, ప్రజా పోరాటాలు గానీ నామమాత్రమే . అధికార పార్టీకి వైసీపే ప్రత్యామ్నాయం అన్న భావన ఏకోశాన జనంలో లేదు. మార్కులు కొట్టేసేందుకు జగన్ వద్దకు వచ్చే నేతలంతా తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ”బ్రహ్మాండంగా ఉంది” అది చెప్పి ఉండవచ్చు. కానీ అది ఎంతవరకు నిజమన్నది కూడా బేరీజు వేసుకోవాలి.

ఒంటిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి మరో ఇబ్బంది కూడా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా అధికార టీఆర్‌ఎస్‌కు మంచి చేసేందుకు వైసీపీ బరిలో దిగిందన్న భావన కలగవచ్చు. ఆ అభిప్రాయం బలపడితే మాత్రం. భవిష్యత్తులో పడే ఓట్లు కూడా పడవు. ఎందుకంటే అధికార పార్టీతో అంటగాగిన ప్రతిపక్షం బాగుపడినట్టు చరిత్రలో లేదు. వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతే ఆ విషయాన్ని టీడీపీ నేతలు ఏపీలోనూ ప్రచారం చేస్తారు. భవిష్యత్తులో ఏపీలోనూ వైసీపీ పరిస్థితి వరంగల్‌లాగే ఉంటుందని నిత్యం ప్రచారం చేస్తారు. దాని వల్ల సొంత కోటపైనా ఒత్తిడి పెరుగుతుంది. పైగా అధికార పార్టీ విమర్శలను తిప్పికొట్టడంలో వైసీపీది ఎప్పుడూ పూర్ రికార్డే. అందుకే పెద్దలు చెప్పారు.. ”అనువుగాని చోట అధికులమనరాదని”. వైసీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల అధికార పార్టీకి అంతోఇంతో ఉపయోగం ఉంటుందేమోగానీ, పార్టీకి వచ్చే ఉపయోగం మాత్రం పెద్దగా ఉండదని చెప్పాలి. ఒకవేళ వరంగల్‌లో వైసీపీ విజయం సాధిస్తే మాత్రం 2019ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో 42 ఎంపీ స్థానాలున్నట్టే.

First Published:  27 Oct 2015 9:47 AM GMT
Next Story