Telugu Global
Others

యాగానికి మోదీ రానట్టే.. ఎందుకంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన చంఢీయాగానికి ప్రధాని మోదీ రావడం లేదని తెలుస్తోంది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు ఫాంహౌజ్‌లో యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. యాగానికి రావాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీలను స్వయంగా వెళ్లి కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. అయితే మోదీ యాగానికి వచ్చే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డే స్వయంగా ఓ మీడియా సంస్థకు చెప్పారు. డిసెంబర్ ఆఖర్లో మోదీ […]

యాగానికి మోదీ రానట్టే.. ఎందుకంటే..?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన చంఢీయాగానికి ప్రధాని మోదీ రావడం లేదని తెలుస్తోంది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు ఫాంహౌజ్‌లో యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. యాగానికి రావాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీలను స్వయంగా వెళ్లి కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. అయితే మోదీ యాగానికి వచ్చే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డే స్వయంగా ఓ మీడియా సంస్థకు చెప్పారు.

డిసెంబర్ ఆఖర్లో మోదీ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. అయినప్పటికీ యాగానికి హాజరయ్యే అవకాశం లేదన్నారు మోదీని కేసీఆర్ వెళ్లి యాగానికి ఆహ్వానించిన వెంటనే రాష్ట్ర బీజేపీ నేతలు మోదీ సన్నిహితులను సంప్రదించారని సమాచారం. కేసీఆర్ విధానాలపై తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని ఈ సమయంలో మోదీ యాగానికి వస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది. మోదీ రాకను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పార్టీ పెద్దలను వివరించారు. దీంతో మోదీ కూడా యాగానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాత్రం యాగానికి ప్రధానిని ఆహ్వానించడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెబుతున్నారు. మోదీ యాగానికి వస్తారన్న నమ్మకం తమకూ ఇప్పటికీ ఉందని చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం మోదీ యాగానికి హాజరయ్యే అవకాశమే లేదని తేల్చేస్తున్నారు.

అయితే భారీ ఖర్చు పెట్టి చేయనున్న యాగంపై మాత్రం బీజేపీ రాష్ట్ర నేతలు అభ్యంతరం చెప్పడం లేదు. దీనికి కారణం అమరావతి శంకుస్థాపనేనని చెబుతున్నారు. యాగానికి పెట్టే ఖర్చును వ్యతిరేకిస్తే… మరి వందల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదన్న విమర్శ వస్తుందన్న ఉద్దేశంతోనే కమలనాథులు ఈ విషయంలో మౌనంగా ఉన్నారని చెబుతున్నారు.

First Published:  4 Nov 2015 10:30 PM GMT
Next Story