ఈ దీపావళికి ఆకలిని పేల్చేద్దాం
దీపావళి అనేది ఆనందానికి ఒక సింబల్.. చెడుపై మంచి విజయం సాధించినందుకు సింబాలిక్గా జరుపుకుంటున్న పండుగ. ఈ మంచి జరిగినందుకు మేము సంతోషంగా ఉన్నాం…అని ప్రపంచానికి దీపావళి ద్వారా తెలియజేస్తున్నాం. అయితే యుగాలు మారినా ఆ సింబాలిజం మారదా…మన ఆనందాన్ని తెలిపేందుకు మరే పద్ధతైనా ఎంపిక చేసుకోవచ్చు కదా…అని అనిపిస్తే, బాణసంచా కాల్చడం కంటే మెరుగైన, ఆనందాన్ని తెలిపే పద్ధతులు మన ముందుకు వస్తాయి. ఇలాగే ఆలోచించినట్టున్నాడు 24 సంవత్పరాల సాజన్ అబ్రోల్. ప్రతి దీపావళికి మతాబులు, […]
దీపావళి అనేది ఆనందానికి ఒక సింబల్.. చెడుపై మంచి విజయం సాధించినందుకు సింబాలిక్గా జరుపుకుంటున్న పండుగ. ఈ మంచి జరిగినందుకు మేము సంతోషంగా ఉన్నాం…అని ప్రపంచానికి దీపావళి ద్వారా తెలియజేస్తున్నాం. అయితే యుగాలు మారినా ఆ సింబాలిజం మారదా…మన ఆనందాన్ని తెలిపేందుకు మరే పద్ధతైనా ఎంపిక చేసుకోవచ్చు కదా…అని అనిపిస్తే, బాణసంచా కాల్చడం కంటే మెరుగైన, ఆనందాన్ని తెలిపే పద్ధతులు మన ముందుకు వస్తాయి. ఇలాగే ఆలోచించినట్టున్నాడు 24 సంవత్పరాల సాజన్ అబ్రోల్. ప్రతి దీపావళికి మతాబులు, చిచ్చుబుడ్లేనా…ఈ దీపావళికి ఆకలిని పేల్చేద్దాం…అంటూ ఆన్లైన్ ద్వారా పిలుపునిచ్చాడు. #బరస్ట్హంగర్ఛాలెంజ్ పేరుతో అతను ఓ ప్రచారాన్ని ప్రారంభించాడు. దీపావళికి క్రాకర్స్ని కాల్చేబదులుగా అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి ఆహారం, దుస్తులు, దుప్పట్లు, బూట్లు ఇలా ఏదోఒక వస్తువుని ఇవ్వాలి. అయితే ఇచ్చేవి ఏవైనా కొత్తవే అయిఉండాలి. దీన్ని ఫొటో లేదా వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయాలి. వస్తువులు తీసుకుంటున్న వ్యక్తి అభిప్రాయాలను కూడా వీడియో తీసి పోస్ట్ చేయవచ్చు. ఇలా చేస్తూ ఈ దీపావళికి క్రాకర్స్ బదులు ఆకలిని పేల్చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను…#బరస్ట్హంగర్ఛాలెంజ్కి నేను సిద్ధం మీరూ సిద్ధమేనా అంటూ తమ పోస్ట్తో పాటు అయిదుగురు స్నేహితులను ఛాలెంజ్ చేయాలి. అసంఖ్యాకంగా దీనిపై సహృదయులు స్పందిస్తున్నారు. దీపావళికి సరికొత్త అర్థం చెబుతున్నారు.
హైదరాబాద్కి చెందిన 26 సంవత్సరాల విశ్వజీత్ వంగల అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గత ఏడాది దీపావళికి ఒక మంచిపని చేశాడు. బాణసంచాను తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో ఇ- కామర్స్ వెబ్సైట్… హైటెక్ క్రాకర్స్ని మొదలుపెట్టి తన స్నేహ బృందంతో కలిసి అమ్మకాలు చేశాడు. అయితే పర్యావరణానికి హానిచేసే ఈ పని తనకు అంతగా తృప్తిని ఇవ్వలేదు. దాంతో తమ బిజినెస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని హుదుద్ తుపాను బాధితుల ఫండ్కి ఇచ్చేశారు. ఈసారి కూడా క్రాకర్స్ అమ్ముతున్నారు..అయితే ఆ వచ్చిన డబ్బుతో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ ప్యూరిఫయిర్ ప్లాంట్లను నెలకొల్పే ఉద్దేశంతో ఉన్నారు. తమకు వచ్చిన ప్రతి ఆర్డర్కి ఒక మొక్కను నాటాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశంలో 125 డెసిబెల్స్కి మించి శబ్ద కాలుష్యం ఉండరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఈ ఆదేశాలను తు చ తప్పకుండా పాటిస్తోంది. స్టేట్ కంట్రోల్ బోర్డు 90 డెసిబెల్స్కి శబ్దం మించకూడదని ఉత్తర్వులు జారీచేసింది. ఎక్కువ ధ్వని చేసే చాలా క్రాకర్స్ని బ్యాన్ చేశారు. వినియోగదారులు ప్రభుత్వ నియంత్రణని దృష్టిలో ఉంచుకుని బాణసంచా కోలు గోలుచేయాల్సి ఉంది.
ముస్కాన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మీరు కొనే టపాసుల బాక్సుల మీద, వీటి తయారీలో బాల కార్మికులను వినియోగించలేదు…అనే గమనిక ఉందోలేదో చూసి, ఉంటేనే కొనుగోలు చేయమని చెబుతోంది.
దీపావళికి టపాసుల తరువాత ఎక్కువ డిమాండ్ స్వీట్లకే. చెన్నైలోని సుస్వాద్ అండ్ సావరీస్ షాపువారు అంగవైకల్యం ఉన్నవారికి స్వీట్ల తయారీలో ఉపాధిని ఇచ్చి ఈ దీపావళికి వారి జీవితాలకు మరింత తీయదనం తెచ్చారు.
ఏకల్ విద్యాలయా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా బాలల జీవితాల్లో దీపావళి వెలుగులను మరింతగా నింపే ప్రయత్నం చేసింది. ఏకల్ దీప్ ప్రాజెక్టు పేరుతో పిల్లలచేత ప్రమిదలను చేయించింది. అలహాబాద్లోని అయిదు జిల్లాల్లోని గ్రామీణ పాఠశాలలనుండి 500 మంది చిన్నారులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు. వీరు తయారుచేసిన 75వేల దీపాలను భారతీయులు ఎక్కువగా నివసించే అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ఎగుమతి చేశారు. దీనివలన వచ్చిన నిధులను పేద విద్యార్థుల చదువులకు వినియోగిస్తారు. ఏకల్ విద్యాలయా దేశవ్యాప్తంగా 54వేల స్కూళ్ల పరిధిలో పనిచేస్తోంది.