జూన్నాటికి అమరావతికి పాలనా యంత్రాంగం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం: పరకాల పాలనా యంత్రాంగాన్ని వచ్చే జూన్ నాటికి తొంభై శాతం వరకు తరలించాలన్న పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నట్టు తెలిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు 2023 వరకు తెలంగాణలోని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడానికి చట్టానికి వెసులుబాటు ఉన్నప్పటికీ శాశ్వత రాజధాని నగరమైన అమరావతికి పరిపాలనా యంత్రాంగాన్ని తీసుకువస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ తాను విజయవాడలో […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం: పరకాల
పాలనా యంత్రాంగాన్ని వచ్చే జూన్ నాటికి తొంభై శాతం వరకు తరలించాలన్న పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నట్టు తెలిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు 2023 వరకు తెలంగాణలోని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడానికి చట్టానికి వెసులుబాటు ఉన్నప్పటికీ శాశ్వత రాజధాని నగరమైన అమరావతికి పరిపాలనా యంత్రాంగాన్ని తీసుకువస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ తాను విజయవాడలో ఉండడం, పాలనా వ్యవహారాల్లో వేగం లోపించడంతో ఎలాగైనా వచ్చే జూన్ నాటికి అధికార యంత్రాంగాన్ని అమరావతికి తరలించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు.
2014లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలం హైదరాబాద్ నుంచి పాలనా వ్యవహారాలు చక్కబెట్టారు. కాని ఇది విమర్శలకు తావివ్వడం… ఇక్కడ ఉండడం వల్ల ఆయనకు కూడా కొన్ని సమస్యలు ఎదురు కావడంతో నాలుగు నెలల క్రితం హైదరాబాద్ నుంచి బిచాణం ఎత్తివేసి విజయవాడలో తాత్కాలిక స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ రాక చాలా తగ్గిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వారాంతాల్లో కూడా ఆయన రావడం లేదు. దీంతో అధికార యంత్రాంగమే ఆయన దగ్గరకు వచ్చి పనులు చేయించుకోవలసి వస్తోంది. ఇది పరిపాలన పరంగా అనేక సమస్యలకు దారి తీయడంతో జూన్కల్లా తప్పనిసరిగా పాలనా యంత్రాంగం మొత్తం అమరావతికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ చెబుతున్నారు.
నీటిపారుదల, మున్సిపల్ పాలనా యంత్రాంగం, సమాచార ప్రచార మంత్రిత్వశాఖ వంటి కొన్ని కీలక శాఖలన్నీ త్వరగా అమరావతికి చేరుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని పరకాల తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా రప్పించడానికి చంద్రబాబు వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని, జూన్ అంతానికల్లా ఇది సాధ్యపడాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగుల ఆందోళనలను, వారి సందేహాలను నివృత్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 12 వేల మంది ఉద్యోగులు వచ్చే సెప్టెంబర్లో శాశ్వత ప్రాతిపదికన అమరావతికి మారనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఉద్యోగులందరినీ కొత్త రాజధానికి తరలించేలంటే కార్యాలయాలకు 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం అవసరమవుతుందని, అలాగే ఉద్యోగుల నివాసాల కోసం 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కావాల్సి ఉంటుందని పరకాల ప్రభాకర్ తెలిపారు.