విపక్షాలకు దిశానిర్దేశం చేసిన బీహార్ : సోమనాథ్
‘అసహనం’పై ఎలా స్పందించాలో బీహార్ ప్రజలు చాటి చెప్పి దేశానికి దిశానిర్దేశం చేశారని లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ అన్నారు. గాడి తప్పిన అధికారంపై పోరాటానికి ప్రతిపక్షాలన్నీ సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. పార్టీలు తమ అహాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని, ఇపుడు ప్రతిపక్ష పార్టీలు మేల్కొనకుంటే నష్టపోయేది దేశ ప్రజలేనని ఆయన అన్నారు. ఏపార్టీకాపార్టీ తమతమ సిద్ధాంతాల ముసుగులో నెమ్మదించాల్సిన సమయం కాదని, అధికార పక్షంపై […]
‘అసహనం’పై ఎలా స్పందించాలో బీహార్ ప్రజలు చాటి చెప్పి దేశానికి దిశానిర్దేశం చేశారని లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ అన్నారు. గాడి తప్పిన అధికారంపై పోరాటానికి ప్రతిపక్షాలన్నీ సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. పార్టీలు తమ అహాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని, ఇపుడు ప్రతిపక్ష పార్టీలు మేల్కొనకుంటే నష్టపోయేది దేశ ప్రజలేనని ఆయన అన్నారు. ఏపార్టీకాపార్టీ తమతమ సిద్ధాంతాల ముసుగులో నెమ్మదించాల్సిన సమయం కాదని, అధికార పక్షంపై పోరాటానికి అన్ని పార్టీలూ సమాయత్తం కావాలని సోమనాథ్ అన్నారు. ప్రజలను, దేశాన్ని అధికారం ముసుగులో అరాచకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం నుంచి రక్షించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని, ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. బీహార్ ఎన్నికల సందర్భంగా దాదాపు 26 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాటిని కూడా గెలుచుకోలేక పోయారంటే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారో గుర్తించాలని ఆయన హితవు చెప్పారు. లక్షల కోట్లు కుమ్మరిస్తామని హామీలిచ్చినా మోదీని ఎవరూ నమ్మలేదని, దీన్ని అసహనానికి జవాబుగా భావించి ప్రతిపక్షాలు తమ వ్యూహాలను రచించుకోవాలని హితవు చెప్పారు. బీహార్ ప్రజలకున్న తెలివి దేశమంతటా ఉంటుందని, దాన్ని వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలదేనని ఆయన సూచించారు. అసహనానికి వ్యతిరేకంగా ఎలా పోరాటం జరపాలో బీహార్ ప్రజలు చెప్పిన తర్వాత కూడా మేల్కొనక పోతే ఆ తప్పు ప్రజలది కాదని, ప్రతిపక్షాలదే అవుతుందని సోమనాథ్ అన్నారు.