Telugu Global
Editor's Choice

వీరు కలిస్తే... వారికి పండుగ.. ఎందుకో!

మన తెలుగు మీడియాది అభిమానమో లేక అత్యుత్సాహమో గానీ కొన్ని విషయాల్లో మరీ వింతగా స్పందిస్తుంది. అలాంటి విషయంలో చంద్రబాబు, కేసీఆర్ కలయిక ఒకటి. ఎక్కడ వీరిద్దరూ కలిసినా తెలుగు మీడియా తెలియకుండా ఎగిరి గంతేస్తోంది. సరే ఒకరి ఇంటికి మరొకరు వెళ్లిన సమయంలో  హడావుడి చేసినా అర్థముంది. అలా కాకుండా ఎదురుపడి పలకరించుకున్నా ఇద్దరు చంద్రులు కలిశారంటూ భారీ నిడివితో కథనాలు ప్రసారం చేస్తున్నారు.  ఇలా చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందని చెప్పుకుంటున్నారు.    […]

వీరు కలిస్తే... వారికి పండుగ.. ఎందుకో!
X

మన తెలుగు మీడియాది అభిమానమో లేక అత్యుత్సాహమో గానీ కొన్ని విషయాల్లో మరీ వింతగా స్పందిస్తుంది. అలాంటి విషయంలో చంద్రబాబు, కేసీఆర్ కలయిక ఒకటి. ఎక్కడ వీరిద్దరూ కలిసినా తెలుగు మీడియా తెలియకుండా ఎగిరి గంతేస్తోంది. సరే ఒకరి ఇంటికి మరొకరు వెళ్లిన సమయంలో హడావుడి చేసినా అర్థముంది. అలా కాకుండా ఎదురుపడి పలకరించుకున్నా ఇద్దరు చంద్రులు కలిశారంటూ భారీ నిడివితో కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇలా చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందని చెప్పుకుంటున్నారు.

బుధవారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ కూతురు వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు హాజరయ్యారు. ఈ సమయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. సహజంగానే మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. పెద్దగా జోకులేసుకున్నది లేదు… పెద్దగా మాట్లాడుకున్నది లేదు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఇద్దరు పలకరించుకుని పరస్పరం దండం పెట్టుకుని వెళ్లిపోయారు. వీరు కొన్ని సెకన్ల పాటు పలకరించుకుంటే మీడియా చానళ్లు మాత్రం ప్రతి బులిటెన్‌లోనూ వరుసపెట్టి కథనాన్ని ప్రసారం చేశాయి. ”కుశల ప్రశ్నలేసుకున్నారు… జోకులేసుకున్నారు” అంటూ కుట్లు అల్లికలతో కథనాలు రాసేశారు. అయినా ..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలకరించుకుంటే ఈ స్థాయిలో దాన్ని హైలైట్ చేయాల్సిన పనేముంది. బహుశా భారత్‌ ప్రధాని, పాక్ ప్రధాని కలిసినప్పుడు కూడా మీడియా ఇంత హడావుడి చేసి ఉండదు. చంద్రబాబు, కేసీఆర్‌ ఒకరికొకరు శత్రువులు అయినట్టు దశాబ్దాల తర్వాత తిరిగి కలుసుకున్నట్టు ఇంతహడావుడి అవసరమా?. ఓటుకు నోటు తర్వాత చంద్రబాబు, కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిన మాట వాస్తవమే కానీ… మరీ ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం కూడా మానేసే సంస్కారహీనులు మన ముఖ్యమంత్రులు కాదు. కానీ తెలుగు మీడియా చానళ్లు ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా పనిచేసే మీడియా సంస్థలు సీఎంలు కలిసిన ప్రతిసారి తెగ హడావుడి చేస్తున్నాయి. దీనికి కారణం కూడా ఉందని చెబుతున్నారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కేసీఆర్‌ ఇబ్బంది పెడుతారేమోనన్న ఆందోళన టీడీపీ అనుకూల మీడియా చానళ్ల మనుసులో ఏ మూలనో దాగి ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్, చంద్రబాబు కాస్త సన్నిహితంగా కలిపిస్తే చాలు సదరు మీడియా చానళ్ల యజమానుల మనసు ఉల్లాసంగా స్పందిస్తోందని చెప్పుకుంటారు. అంతటితో ఆగకుండా వారి ఆనందాన్ని జనం మీదకూ రుద్దే పక్రియలో భాగంగానే ”ఇద్దరు చంద్రులు కలిశారహో” అంటూ వరుస పెట్టి కథనాలు ప్రసారం చేయడం అని చెప్పుకుంటున్నారు.

First Published:  10 Dec 2015 7:14 PM GMT
Next Story