Telugu Global
Others

ప్రెస్‌మీట్ ఎవరి కోసం.. ప్రజలకా? మీడియాకా?

చాలాకాలం తర్వాత లోటస్‌పాండ్‌లోని నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టిన జగన్ ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఉతికేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరు, స్పీకర్ వ్యవహార శైలి, రోజా సస్పెన్షన్‌పై ఘాటుగా మాట్లాడారు. స్పీకర్‌పై అవిశ్వాసం నేపథ్యంలో ఈ అంశాల గురించి మాత్రమే జగన్ మాట్లాడుతారనుకున్నారు. ప్రెస్‌మీట్ మొదట్లో జగన్‌ చెప్పే విషయాలను ఆసక్తిగానే మీడియా ప్రతినిధులు, అందరూ గమనించినా కాసేపటికి సీన్‌ మారిపోయింది. అసెంబ్లీలో అవకాశం వస్తే చంద్రబాబును కడిగేయాలనుకున్నారో ఏమో… ఆ అవకాశం రాకపోయే సరికి సభలో చెప్పాలనుకున్నదంతా ప్రెస్‌మీట్లో […]

ప్రెస్‌మీట్ ఎవరి కోసం.. ప్రజలకా? మీడియాకా?
X

చాలాకాలం తర్వాత లోటస్‌పాండ్‌లోని నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టిన జగన్ ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఉతికేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరు, స్పీకర్ వ్యవహార శైలి, రోజా సస్పెన్షన్‌పై ఘాటుగా మాట్లాడారు. స్పీకర్‌పై అవిశ్వాసం నేపథ్యంలో ఈ అంశాల గురించి మాత్రమే జగన్ మాట్లాడుతారనుకున్నారు. ప్రెస్‌మీట్ మొదట్లో జగన్‌ చెప్పే విషయాలను ఆసక్తిగానే మీడియా ప్రతినిధులు, అందరూ గమనించినా కాసేపటికి సీన్‌ మారిపోయింది. అసెంబ్లీలో అవకాశం వస్తే చంద్రబాబును కడిగేయాలనుకున్నారో ఏమో… ఆ అవకాశం రాకపోయే సరికి సభలో చెప్పాలనుకున్నదంతా ప్రెస్‌మీట్లో చెప్పేశారు. మధ్నాహ్నం 12. గంటల 12 నిమిషాలకు మొదలైన ప్రెస్‌మీట్ 1. 14 నిమిషాల వరకు సుధీర్ఘంగా సాగింది. ఇంత నిడివితో ప్రెస్‌మీట్ సాధారణంగా( చంద్రబాబు మినహాయిస్తే) ఎవరూ పెట్టరు. జాతీయ నాయకులు కూడా సూటిగా ఒకటి రెండు అంశాలపై మాత్రమే మాట్లాడేసి ప్రెస్‌మీట్లు ముగించేస్తుంటారు. ప్రెస్‌మీట్‌ 20 నిమిషాలు దాటితే ఎవరికైనా బోరుగానే ఉంటుంది.

అలాంటిది గంటకు పైగా అంటే దాని వల్ల ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే… గంట పాటు ఏ టీవీచానల్‌కు కూడా లైవ్ ప్రసారం చేయడం (సాక్షి మినహాయిస్తే) కుదరదు. ఏ చానల్‌ అయినా తొలి కొన్ని నిమిషాలు మాత్రమే లైవ్ ప్రసారం చేస్తాయి. అలాంటప్పుడు మాట్లాడిన మొత్తం విషయం అప్పటికప్పుడు జనంలోకి వెళ్లే పరిస్థితి ఉండదు. సరే మిగిలిన బులిటెన్‌లోనైనా టీవీ చానళ్లు చూపుతాయా అంటే మీడియాలో ఎంత ముఖ్యమైనా విషయం అయినా నిమిషం మించి బైట్ వేయడానికి సాధ్యం కాదు. అంతే కాదు జగన్ ఇలా సుధీర్ఘంగా ప్రెస్‌మీట్ పెట్టడం కూడా ఆయనంటే గిట్టని మీడియా చానళ్లకు అవకాశంగా మారుతోంది. ఒకే ప్రెస్‌మీట్‌లో చాలా అంశాలపై మాట్లాడితే… జగన్‌ వ్యతిరేక మీడియా వాటిలో పెద్దగా ఉపయోగం లేని అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ అసలు విషయాన్ని దాచేస్తున్నాయి. పైగా తామూ జగన్‌ మాట్లాడింది చూపించాం అన్న క్రెడిట్‌ను వైరి మీడియా కొట్టేస్తోంది.

సరే ఆ మరుసటి రోజు పేపర్‌లోనైనా సవివరంగా జగన్‌ మాట్లాడిన విషయాలు వస్తాయా అంటే అదీ ఉండదు. ఎందుకంటే ఒకేసారి దాదాపు 10 అంశాలపై మాట్లాడితే వాటన్నింటినీ కవర్ చేయాలంటే ఏ పత్రికైనా కనీసం ఒక పేజీ మొత్తం కేటాయించాల్సి ఉంటుంది. అక్కడ కూడా జగన్ అంటే గిట్టని పత్రికలు ఏవో ప్రాధాన్యత లేని అంశాలను ప్రచురించి సరిపెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తక్కువ విడివితో ప్రెస్‌మీట్ నిర్వహించి సూటిగా ఒకటి రెండు ప్రాధాన్యత అంశాలను ఎంచుకుని మాట్లాడితే వాటికి మీడియాలో తప్పనిసరిగా విస్రృత ప్రచారం వచ్చే చాన్స్ ఉంటుంది. బుధవారం జగన్ నిర్వహించిన ప్రెస్‌మీట్ మాత్రం చివరకు అసలు విషయం ఏమిటన్న అనుమానం కలిగేలా చేసింది. అసెంబ్లీ, రోజా, స్పీకర్‌ మొదలుకొని బాలయ్య వియంకుడికి భూముల కేటాయింపు వరకు అన్ని అంశాలపైనా మాట్లాడేశారు. రోజుల తరబడి సాగే అసెంబ్లీలో చెప్పాల్సిన అంశాలన్నింటినీ జగన్‌ ప్రెస్‌మీట్ పెట్టి ఒకేసారి చెప్పినట్టుగా ఉంది. అలా కాకుండా వారానికొకసారి ప్రెస్‌మీట్ నిర్వహిస్తుంటే ఈ సమస్య ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం గంటకు పైగా ప్రెస్‌మీట్‌ నిర్వహించాలంటే దానికి చాలానే కసరత్తు చేసి ఉండాలి. అందుకు తగ్గట్టుగానే జగన్‌ బాగానే స్టడీ చేసినట్టుగా ఉన్నారు.

First Published:  23 Dec 2015 5:28 AM GMT
Next Story