Telugu Global
NEWS

పఠాన్‌కోటే ఎందుకు టార్గెట్‌ అయింది?

మూడు రోజులుగా భీకర పోరు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లో క్షణక్షణం ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. అసలు ఉగ్రవాదులు పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ నే ఎందుకు టార్గెట్ చేశారు? ఉగ్రవాదుల చొరబాటు వెనుక పాక్ హస్తం ఉందనడానికి అనేక ఆధారాలు ఇప్పటికే భద్రతాదళాలు, ఇంటలిజెన్స్ వర్గాలు సంపాదించాయి. భారత్‌కు సైనిక పరంగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ప్రాంతం అత్యంత వ్యూహాత్మకమైన స్థావరం. అయితే భౌగోళికంగా ఈ ప్రాంతం […]

పఠాన్‌కోటే ఎందుకు టార్గెట్‌ అయింది?
X

మూడు రోజులుగా భీకర పోరు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లో క్షణక్షణం ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. అసలు ఉగ్రవాదులు పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ నే ఎందుకు టార్గెట్ చేశారు? ఉగ్రవాదుల చొరబాటు వెనుక పాక్ హస్తం ఉందనడానికి అనేక ఆధారాలు ఇప్పటికే భద్రతాదళాలు, ఇంటలిజెన్స్ వర్గాలు సంపాదించాయి.

భారత్‌కు సైనిక పరంగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ప్రాంతం అత్యంత వ్యూహాత్మకమైన స్థావరం. అయితే భౌగోళికంగా ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దులకు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరింత సూటిగా చెప్పాలంటే ఓవైపు హిమాలయాలు మరోవైపు పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రాంతమే పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌. ఈ సైనిక స్థావరంపై పాకిస్థాన్ శతాబ్ధాలుగా కన్నేసింది. ఎందుకంటే జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌ లో ఉండే భారత సైన్యానికి సరకులు సరఫరా చేయడానికి పఠాన్‌కోట్‌ ప్రాంతమే కీలకం. అంతేకాదు భారత సైనిక విడిదుల్లో ఇదే అతిపెద్దది. యుద్ధ సమయంలో గగనతల దాడులకు ఈ స్థావరం ఎంతో వీలుగా ఉంటుంది. ఇక సరిహద్దులు దాటివచ్చే పాక్‌ యుద్ధ విమానాలపై విరుచుకుపడేందుకు ఈ స్థావరమే కీలకమైనది.

పఠాన్‌కోట్‌లో ఎప్పుడూ సైన్యంతోపాటు వైమానిక దళాలు మోహరించి ఉంటాయి. ఇటీవలకాలంలో మిగ్‌-21 యుద్ధ విమానాలు, ఎంఐ-25, ఎంఐ-35 ఎటాక్‌ హెలికాప్టర్లు, పెచోరా క్షిపణులు, మానవ రహిత విమానాలు, అధునాతన రాడార్లు ఇలా అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంత కీలకమైన ఈ స్థావరంపై పాకిస్థాన్ గతంలోనే రెండు సార్లు దాడులకు తెగబడింది. పాక్‌ సైన్యం తొలిసారి పఠాన్‌కోట్‌పై 1965 సెప్టెంబర్‌ 6న దాడిచేసింది. మన యుద్ధ విమానాలను ధ్వంసం చేసేందుకు పారా ట్రూపర్లను దించింది. అయితే అప్పట్లోనే పాక్ సైనికుల వ్యూహాన్ని మన జవాన్లు తిప్పికొట్టారు. 136 మంది పాక్‌ కమాండోలను ఖైదీలుగా బందీచేశారు. 1971లో మరోసారి పాక్‌ వైమానిక దళం పఠాన్‌కోట్‌తో పాటు భారత్‌లోని 11 స్థావరాలపై దాడులకు దిగింది. పఠాన్‌కోట్‌ రన్‌వేలో కొంత భాగాన్ని రాకెట్లు, బాంబులతో ధ్వంసం చేసింది. ఈ యుద్ధ సమయంలోనే పాక్ కు గట్టి బుద్ధి చెప్పిన భారత సైన్యం బంగ్లాదేశ్ కు కూడా విముక్తి కలిగిచింది.

తాజాగా ఇప్పుడు ఉగ్రవాదుల ముసుగులో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగిందని భారత్ అనుమానిస్తోంది. మరో వారంలో భారత్, పాక్ అధికారుల చర్చలు జరగాల్సిన సమయంలో ఈ దాడులకు పాక్ పాల్పడడం చర్చనీయాంశమవుతోంది. కాశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తోపాటు, ఉగ్రవాదులు రెచ్చిపోతున్నా మోడీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

First Published:  4 Jan 2016 5:39 AM GMT
Next Story