తాళికట్టి సెల్ఫీలు తీశాడు... బ్లాక్మెయిల్ చేసి బుక్కయ్యాడు!
జీవితం అంటే సినిమా అనుకున్నాడేమో ఆ ప్రబుద్దుడు ఒక యువతి మెడలో బలవంతంగా తాళికట్టి సెల్ఫీలు, వీడియో తీశాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలనుకున్నాడు. చివరికి అతని పాచిక పారలేదు. కర్ణాటక, ఉడిపి జిల్లా బిందుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మోసం వెలుగుచూసింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం 29ఏళ్ల ఓ యువకుడికి కాపు బీచ్లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో అతను ఆమె ఫొటోలు తీశాడు, ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు. […]
జీవితం అంటే సినిమా అనుకున్నాడేమో ఆ ప్రబుద్దుడు ఒక యువతి మెడలో బలవంతంగా తాళికట్టి సెల్ఫీలు, వీడియో తీశాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలనుకున్నాడు. చివరికి అతని పాచిక పారలేదు. కర్ణాటక, ఉడిపి జిల్లా బిందుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మోసం వెలుగుచూసింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం 29ఏళ్ల ఓ యువకుడికి కాపు బీచ్లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో అతను ఆమె ఫొటోలు తీశాడు, ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు. ఇది జరిగి నాలుగు సంవత్సరాలయ్యింది.
తరువాత ఇటీవల ఆ యువతికి పెళ్లవుతుందని తెలిసి, తననే పెళ్లి చేసుకోవాలని లేదా యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఆమె పెళ్లి చేసుకోబోతున్నవ్యక్తి ఫోన్ నెంబర్ అడిగాడు. ఇవ్వకపోతే కాపు బీచ్లో తీసుకున్న ఫొటోలను ఫేస్బుక్లో పెడతానని బెదిరించాడు. దాంతో ఆమె అతని ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఏ ప్లాన్తో ఫోన్ నెంబరు తీసుకున్నాడో గానీ, తరువాత ప్లాన్ మార్చుకుని ఆమెను బలవంతంగా అగుంబే అనే చిన్న గ్రామానికి తీసుకువెళ్లి మెడలో తాళి కట్టాడు. సెల్ఫీలు, వీడియో తీశాడు. ఆపై కొంత డబ్బు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలను ఫేస్బుక్లో పెడతానని మళ్లీ బెదిరించాడు.
దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేయకముందే ఆ దుండగుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లయి చేశాడు. అయితే కోర్టు ఈ కేసు తీవ్రతని పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ని మంజూరు చేయడం లేదని, అతను పోలీసుల ముందు సరెండర్ అయిన తరువాతే బెయిల్కోసం అప్లయి చేసుకోవాలని తెలిపింది. పోలీసులు అతనిమీద పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.