పరువుకోసం...సోదరి ప్రాణాలు తీశారు!
రాజస్థాన్లో అత్యంత దారుణంగా ఓ పరువు హత్య జరిగింది. కుటుంబానికి ఇష్టంలేని పెళ్లి చేసుకున్న మహిళను ఆమె సోదరులు కర్కశంగా హతమార్చారు. చోటా అస్పూర్ గ్రామానికి చెందిన రమా కున్వర్ ఎనిమిది సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. సంతోషకరమైన వైవాహిక జీవితం గడుపుతోంది కూడా. ఎనిమిదేళ్ల తరువాత తన పుట్టింటివారిని చూడాలనే ఆశతో తన మూడేళ్ల బిడ్డతో పాటు కన్నవారింటికి వచ్చింది. అయితే ఆనాటి ఆగ్రహాన్ని ఇంకా మనసులో ఉంచుకున్న రమ సోదరుడు లక్ష్మణ్ సింగ్, […]
రాజస్థాన్లో అత్యంత దారుణంగా ఓ పరువు హత్య జరిగింది. కుటుంబానికి ఇష్టంలేని పెళ్లి చేసుకున్న మహిళను ఆమె సోదరులు కర్కశంగా హతమార్చారు. చోటా అస్పూర్ గ్రామానికి చెందిన రమా కున్వర్ ఎనిమిది సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. సంతోషకరమైన వైవాహిక జీవితం గడుపుతోంది కూడా. ఎనిమిదేళ్ల తరువాత తన పుట్టింటివారిని చూడాలనే ఆశతో తన మూడేళ్ల బిడ్డతో పాటు కన్నవారింటికి వచ్చింది. అయితే ఆనాటి ఆగ్రహాన్ని ఇంకా మనసులో ఉంచుకున్న రమ సోదరుడు లక్ష్మణ్ సింగ్, మరో ఆరుగురు కజిన్స్ తో కలిసి రమ శరీరానికి నిప్పు పెట్టి హతమార్చాడు. రమ అత్త అయిన కళావతి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
రమ భిన్నకులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుందనే కోపంతోనే వారీపని చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
రమ ఇంటికి వచ్చిందని తెలియగానే మరుసటి రోజే లక్ష్మణ్ సింగ్ 30మందితో కలిసి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కళావతి, ఆమె చిన్న కుమారుడు, కోడలు, రమ అంతా కలిసి ఇంటి కాంపౌండ్లో కూర్చుని ఉన్నారు. దుండగులు రమని తమ ఇంటికి చేరువలో ఉన్న గుడివద్దకు ఈడ్చుకువెళ్లి నిప్పంటించారు. సగం కాలిన ఆమె శరీరానికి అదే రోజు రాత్రి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామం నడిబొడ్డున ఈ ఘోరం జరుగుతున్నా ఏ ఒక్కరు బాధితురాలిని కాపాడేందుకు ముందుకు రాలేదు. తరువాత కూడా ఏ ఒక్క గ్రామస్తుడూ నిందితులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయితే గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడ ఆదనపు బలగాలను మోహరించారు. రాజస్థాన్లో పరువు హత్యలు తరచుగా జరుగుతున్నాయి. రెండునెలల క్రితమే శ్రీగంగానగర్ జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంతో ఓ వ్యక్తి సొంత కూతురిని హతమార్చాడు. అన్యాయంగా ఆడపిల్లల ఉసురు, భారత్ పరువు తీస్తున్న ఈ పరువు హత్యల విషయంలో ప్రభుత్వాలు అభ్యుదయవాదులు, ప్రజలు, మహిళా సంఘాలు అందరూ తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది.