Telugu Global
Family

కలువ పువ్వు కథ

పూర్వం విక్రముడనే రాజువుండేవాడు. ఆయనకు ఒక రోజు వేట మీద మనసుపడింది. సేవకులతో వేటకు అడవికి బయల్దేరాడు. అడవిలో జంతువుల వేట ఆరంభమయింది. రాజు ఒక జింక వెంట పడ్డాడు. జింక ఎక్కడో పొదల్లో అదృశ్యమైంది. అటువేపు చూస్తే ఒక ఎలుగుబంటి కనిపించింది. దాని వెంట పడ్డాడు. అది అడవిలో చాలా దూరం పరిగెట్టింది. బాగా ఎత్తుగా వున్న చెట్ల గుబుర్లలోకి వెళ్ళింది. రాజు గుర్రం మీద అనుసరించాడు. అది కూడా తప్పించుకుంది. సేవకులు రాజు కోసం […]

పూర్వం విక్రముడనే రాజువుండేవాడు. ఆయనకు ఒక రోజు వేట మీద మనసుపడింది. సేవకులతో వేటకు అడవికి బయల్దేరాడు. అడవిలో జంతువుల వేట ఆరంభమయింది. రాజు ఒక జింక వెంట పడ్డాడు. జింక ఎక్కడో పొదల్లో అదృశ్యమైంది. అటువేపు చూస్తే ఒక ఎలుగుబంటి కనిపించింది. దాని వెంట పడ్డాడు. అది అడవిలో చాలా దూరం పరిగెట్టింది. బాగా ఎత్తుగా వున్న చెట్ల గుబుర్లలోకి వెళ్ళింది. రాజు గుర్రం మీద అనుసరించాడు. అది కూడా తప్పించుకుంది.

సేవకులు రాజు కోసం వెతికారు. రాజు కనిపించకపోయేసరికి నగరానికి వెళ్ళిపోయారు. రాజు దారి తప్పి అడవిగుండా సాగి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మెట్లమీద కూచున్న ఒక యువకుణ్ణి చూశాడు. అతను దిగులుగా కనిపించాడు. రాజు అతని దగ్గరికి వెళ్ళి ‘ఎందుకంత దిగులుగావున్నావు? నేనేమైనా సాయం చేయగలనా?’ అన్నాడు. ఆ యువకుడు చిరాకుపడి ‘నా బాధల్ని నువ్వు ఆర్చే వాడివా తీర్చేవాడివా! నీతో నేను ఎందుకు చెప్పాలి? నువ్వేమన్నా అందరి సమస్యలూ తీర్చడానికి ముందుకొచ్చే రాజు విక్రముడివా? అన్నాడు.

విక్రముడు ‘అవును నేనే విక్రముణ్ణి. నీ సమస్యలేమిటో చెప్పు’ అన్నాడు. ఆ మాటల్తో ఆ యువకుడు విక్రముడి కాళ్ళ మీదపడి ‘రాజా! నన్ను మన్నించు తెలియక అన్నాను. మీరు విక్రములు మీతో నిశ్చింతగా నా సమస్యలు చెప్పుకోవచ్చు’ అని తన కథ చెప్పాడు.

‘నా పేరు అజిత్ నేను రాజు జస్వంత్ కొడుకును చిన్నప్పటి నించీ నాకు ప్రార్థనలన్నా, పవిత్రగ్రంథాలన్నా యిష్టం. రాజ భవనాలు బోగాల పట్ల నాకు ఆసక్తి లేదు. అందుని ఒక రోజు ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచీ వెళ్ళి పోయాను. తీర్థయాత్రలు చేసుకుంటూ పవిత్రక్షేత్రాల్ని దర్శిస్తూ తిరుగుతూ వున్నాను. ఒక రోజు మార్గమధ్యంలో అలసిపోయి మర్రి చెట్టు దగ్గరవున్న ఈ కొలను దగ్గర ఆగాను. ఈ కొలనులోఒక పద్మాన్ని చూశాను. అది అద్భుతంగా, అపురూపంగా వుంది. అంత మనోహరమయిన పుష్పాన్ని నా జీవితంలో చూడ లేదు. నేను దాని సౌందర్యాన్ని వర్ణించలేను. దానికి వేయి రేకులున్నాయి. అన్నీవివిధ వర్ణాల్లో వున్నాయి. నేను దాన్ని అందుకోడానికి కొలనులో దిగాను. నేను దాని దగ్గరకు వెళ్ళేకొద్దీ అది నాకు అందకుండా ముందుకు జరిగింది. ఎట్లాగయినా దాన్ని అందుకోవాలని ప్రయత్నించాను.

రాత్రింబవళ్ళు చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ తెల్లవారింది మొదలు దాన్ని అందుకోడానికి విఫలయత్నం చేస్తునే వున్నా. అందినట్లే అంది అది జారి పోతోందన్నాడు.

విక్రముడు యిదంతా విని ఆశ్చర్యపోయాడు. ఆ పద్మాన్ని ఎట్లాగయినా అందుకుని ఆ యువకుడి అందించాలని నిశ్చయించాడు.

ఎనిమిదవరోజు ఆ పద్మం సరస్సులో ప్రత్యక్షమైంది. దాని అపూర్య సౌందర్యానికి విక్రముడు దిగ్భ్రమ చెందాడు. దాని సంపూర్ణత సమగ్రత చూసి ఆశ్చర్య పోయాడు.

విక్రముడు దేవతల్ని ప్రార్థించి తనను రక్షించమని కోరి సరస్సులో దూకాడు దూకిన వాడికి కాళ్ళకింద నేల తగిలింది. కళ్ళు తెరిచి చూశాడు. తానొక అద్భుతమయిన నగరంలో వున్నట్లు గ్రహించాడు. అక్కడఎన్నో ఆకాశాన్ని అంటే భవనాలున్నాయి. విక్రముడు ఆ నగరాన్నంతా కలయదిరిగాడు.

అలా తిరుగుతూ ఒక వుద్యానవనానికి వచ్చారు. ఆ ఉద్యాన వనంలో ఎన్నోన్నో పూల చెట్లు, పండ్ల చెట్లువున్నాయి. పచ్చగా, ఆహ్లాదకరంగా వుంది వాతావరణం.

అక్కడ ఒక కొలనువుంది. కొలనులో సూర్య కిరణాలు పడుతున్నాయి. ఆ కిరణాల్లో నాట్యం చేస్తున్నట్లు వేల పద్మాలు వికసించాయి. విక్రముడు ఒక పద్మాన్ని అందుకుని యువకుడి యిద్దామన్నవుద్దేశంలో కొలనులో దిగాడు.

అంతలో ఎదురుగా వున్న భవనంనించీ ఎవరో అరవడం వినిపించింది. వాళ్ళు విక్రముణ్ణి దొంగ అనుకున్నారు. కొద్దిమంది సైనికులు కొలనును చుట్టు చుట్టారు. విక్రముడితో తలపడ్డారు. విక్రముడు వీరోచితంగా పోరాడి వాళ్ళను ఓడించాడు.

హఠాత్తుగా ఒక దేవదూత ప్రత్యక్షమై ‘ఎవరు నువ్వు ఎందుకు వీళ్ళతో యుద్ధం చేసి ఓడించావు. ఎందుకు పద్మాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నావు’ అంది.

నేను విక్రముడనే రాజును. నాకు యితరులు కష్టాల్లో వుంటే ఆదుకోవడం యిష్టం. ఆ విధంగా ఒక యువకుడు కొలనులోని పదం కోసం కలవరపడుతుంటే అతనికి సహాయపడడం కోసం యిలాచేశాను. అని జరిగింది వివరించాడు.

ఆ దేవత సంతోషించి ‘ ఈ రాజభవనం నీది నీకు యిష్టమన్నపుడు నువ్వు రావచ్చు’ అంది.

అని ఆమె వేయిరేకుల పద్మాన్ని విక్రముడికి యిచ్చింది. విక్రముడు కృతజ్ఞత చెప్పి దాన్ని తీసుకుని వచ్చి యువకుడికి అందిచాడు. యువకుడు ఎంతో సంతోషించాడు. విక్రముడు కొలను లోపలి విషయమంతా వివరించాడు. అదంతా విని ఈర్షతో ఆ యువకుడు ‘నేను చెప్పడం వల్లే నువ్వు లోపలికి వెళ్ళి పద్మాన్ని ఆ రాజభవాన్ని, సంపదను సంపాదించావు’ అన్నాడు.

విక్రముడు జాలిగా ఆ యువకుడితో ‘నాకు నువ్వు చెప్పినవేవీ అక్కర్లేదు. నీకు పద్మాన్ని తేవడం కోసమే నేను వెళ్ళాను నువ్వు కొలనులోకి వెళితే అన్నీ నీవే అవుతాయి. సాహసవంతునికి ఏదీ అసాధ్యంకాదు. సాహసమే అతని సంపద’ అని విక్రముడు తన గుర్రమెక్కి వెళ్ళిపోయాడు.

– సౌభాగ్య

First Published:  5 April 2016 1:02 PM GMT
Next Story