ఆయన తిట్టారు....ఈయన పొగిడారు!
ప్రభుత్వ అధికారుల మీద తమకు పూర్తిగా నమ్మకం ఉందని, వారి పనితీరు చాలా బాగుందని, వారిపట్ల తమకు ఏమాత్రం అసంతృప్తి లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇంతకుముందు ఇదే విషయంమీద ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించిన తీరుకి సరిగ్గా వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రసంగించిన మోడీ, ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుందని దాన్ని తీసుకోవడమే తమ పని అని అన్నారు. మార్పుకి ఏజంట్లుగా పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన ఇదే […]
ప్రభుత్వ అధికారుల మీద తమకు పూర్తిగా నమ్మకం ఉందని, వారి పనితీరు చాలా బాగుందని, వారిపట్ల తమకు ఏమాత్రం అసంతృప్తి లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇంతకుముందు ఇదే విషయంమీద ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించిన తీరుకి సరిగ్గా వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రసంగించిన మోడీ, ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుందని దాన్ని తీసుకోవడమే తమ పని అని అన్నారు. మార్పుకి ఏజంట్లుగా పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు.
మంగళవారం జరిగిన ఇదే తరహా సమావేశంలో కేజ్రీవాల్ అధికారులమీద తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తాను దేన్నయినా భరిస్తాను కానీ, విధి నిర్వహణలో రాజకీయాలు చేస్తే సహించనని కేజ్రీవాల్ అధికారులను హెచ్చరించారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే రాజీనామా చేసి రాజకీయాల్లో చేరాలని, తమకు వ్యతిరేకంగా పోటీచేయాలని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు కలిసి పనిచేయాలని, విధుల్లో రాజకీయాలను ప్లే చేయవద్దని హెచ్చరించారు.
మోడీ తన పథకాల నిర్వహణ విషయంలో ఉన్నతాధికారులను ఆకట్టుకుని పనిచేయిస్తుంటే, కేజ్రీవాల్కి తనతో పాటు కలిసి నడవని బ్యూరోక్రాట్లు సమస్యగా మారుతున్నారు. ఢిల్లీ లోని ప్రధాన శాఖల మీద కేంద్రం పెత్తనాన్ని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వానికి, అధికారులకు మధ్య విభేదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.
గత డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 200 మంది అధికారులు ఒకరోజు మాస్ లీవు పెట్టి తమ నిరసన తెలిపారు. కేంద్రం ఆదేశాలను పాటించారనే అభియోగంతో తమ సహ అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేసినందుకు గాను, అలా మూకుమ్మడి సెలవు ప్రకటించారు. సరిగ్గా ఆడ్ ఈవెన్ నెంబర్ల ప్రయోగ సమయంలో అలా జరగటంతో అదంతా కేంద్రం కుట్ర అని, ఆ ఉద్యోగులంతా బిజెపికి చెందిన బి టీములని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో ప్రజాప్రతినిధులు కేజ్రీవాల్ పార్టీ సభ్యులైనా, పనిచేసే అధికారులను తమ వైపుకి తిప్పుకోవాలని కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్కి చిక్కులు ఎదురవుతున్నాయి.