కాంగ్రెస్ను మరోసారి ఆదుకోనున్న చంద్రబాబు?
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా టీడీపీని పెట్టారు ఎన్టీఆర్. పలుమార్లు టీడీపీని గద్దెదించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్.. ప్రజల చేతిలో గుణపాఠం నేర్వక తప్పలేదు. టీడీపీని భూస్థాపితం చేయాలని చూసి శతవిధాలా ప్రయత్నించిన కాంగ్రెస్ అన్నివిధాలా విఫలమైందని తెలుగు రాష్ర్టాల ప్రజలకు తెలిసిన విషయమే. విధానపరంగా ఈ రెండు పార్టీలు ఉత్తర – దక్షిణ ధ్రువాల్లా వ్యవహరిస్తాయి. కానీ, కొన్నేళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఆపదల్లో ఆదుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో టీఆర్ ఎస్- […]
BY sarvi23 April 2016 3:48 AM GMT
X
sarvi Updated On: 23 April 2016 5:31 AM GMT
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా టీడీపీని పెట్టారు ఎన్టీఆర్. పలుమార్లు టీడీపీని గద్దెదించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్.. ప్రజల చేతిలో గుణపాఠం నేర్వక తప్పలేదు. టీడీపీని భూస్థాపితం చేయాలని చూసి శతవిధాలా ప్రయత్నించిన కాంగ్రెస్ అన్నివిధాలా విఫలమైందని తెలుగు రాష్ర్టాల ప్రజలకు తెలిసిన విషయమే. విధానపరంగా ఈ రెండు పార్టీలు ఉత్తర – దక్షిణ ధ్రువాల్లా వ్యవహరిస్తాయి. కానీ, కొన్నేళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఆపదల్లో ఆదుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో టీఆర్ ఎస్- వైసీపీలు అప్పటి కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే.. మద్దతివ్వకుండా చంద్రబాబు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. ఫలితంగా ఆయన ఆస్తులపై సీబీఐ విచారణ రాకుండా చేసుకున్నారని అప్పట్లో వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ప్రజలపై ఎన్నికల వ్యయభారం పడకూడదనే తాను అవిశ్వాసానికి మద్దతివ్వలేదని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు బాబు. అసలు విషయం ఏంటంటే.. శత్రువుకు శత్రువు మిత్రుడు.. అన్న పాత సామెత ప్రకారం బాబు వ్యవహరించాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అవిశ్వాసానికి మద్దతిస్తే.. మైనారిటీలో ఉన్న కిరణ్ సర్కారు కుప్పకూలి ఎన్నికలు వచ్చేవి. అప్పుడు టీడీపీ గెలిచే పరిస్థితులు లేకనే ఆయన పరోక్షంగా కిరణ్ సర్కారుకు మద్దతిచ్చారని పలు విమర్శలు రేగాయి.
ఇప్పుడు రెండోసారి..!
ఓటుకు నోటు కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో టేపులు బయటపడటం దేశవ్యాప్తంగా ఆయన ప్రతిష్ట మంటగలిసినట్లయింది. తరువాత సెక్షన్-8 అంటూ నానా యాగీ చేయడంతో టీడీపీ ప్రభ ప్రజల్లో మసకబారింది. దీనికితోడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా.. గులాబీ పార్టీలో చేరారు. ఈ పరిణామాల కారణంగా టీడీపీ తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకు పోయిందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే.. ప్రస్తుతం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే క్రిష్ణయ్య మొదటి నుంచీ.. పార్టీకి దూరంగానే ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్, సండ్ర ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితులే! దీంతో తమ పార్టీని తెలంగాణలో ముప్పతిప్పలు పెడుతున్న కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు తమపార్టీకి ఆగర్భ శత్రువుగా చెప్పుకునే కాంగ్రెస్కు పాలేరు ఉప ఎన్నికలో మద్దతిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ విజయావకాశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కనీసం వార్డు మెంబర్లుగా టీడపీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో బాబు మరోసారి.. కాంగ్రెస్కు మద్దతు తెలుపుతారనే అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Next Story