Telugu Global
Others

నిన్న చిట్టెం.. నేడు పువ్వాడ‌.. త‌రువాత ఎవ‌రు?

టీడీపీ విలీనం త‌రువాత గులాబీ పార్టీ కాంగ్రెస్‌పై దృష్టి సారించిన‌ట్లుంది. పాలేరు ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఈ విష‌యంలో కారు జోరు మ‌రింత‌ పెంచింది. ఇటీవ‌ల మాజీ మంత్రి డీకే అరుణ సోద‌రుడు, మ‌క్త‌ల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవ‌డంతో మొద‌లైన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ రెండోపార్టు తాజాగా ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కుమార్ చేరిక‌తో మ‌రింత ఊపందుకుంది. మ‌రింతమంది నేత‌లు కాంగ్రెస్ నుంచి కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌చారం చేతి […]

నిన్న చిట్టెం.. నేడు పువ్వాడ‌.. త‌రువాత ఎవ‌రు?
X
టీడీపీ విలీనం త‌రువాత గులాబీ పార్టీ కాంగ్రెస్‌పై దృష్టి సారించిన‌ట్లుంది. పాలేరు ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఈ విష‌యంలో కారు జోరు మ‌రింత‌ పెంచింది. ఇటీవ‌ల మాజీ మంత్రి డీకే అరుణ సోద‌రుడు, మ‌క్త‌ల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవ‌డంతో మొద‌లైన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ రెండోపార్టు తాజాగా ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కుమార్ చేరిక‌తో మ‌రింత ఊపందుకుంది. మ‌రింతమంది నేత‌లు కాంగ్రెస్ నుంచి కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌చారం చేతి గుర్తుపార్టీలో క‌ల‌వర‌పాటుకు కార‌ణ‌మ‌వుతోంది. పువ్వాడ చేరిక వెన‌క గులాబీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు మంత్రాంగం న‌డిపార‌ని తెలుస్తోంది. పువ్వాడ చేరిక విష‌యం కాంగ్రెస్‌కు ముంద‌స్తుగా తెలిసినా.. కాంగ్రెస్ పార్టీ ఈ విష‌యంలో ఆప‌లేక‌పోవ‌డం ఆ పార్టీలో నాయ‌క‌త్వ లోపాన్ని ఎత్తిచూపుతోంది. సీనియ‌ర్ నేత జానారెడ్డి పువ్వాడ‌తో స‌మావేశ‌మై బుజ్జ‌గించినా… ఫ‌లితం లేక‌పోయింది. ఆదివారం సాయంత్రానికి ప‌రిస్థితి మారింది. పువ్వాడ తాను పార్టీ మారుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. ప‌నిలోప‌నిగా పార్టీకి, పార్టీ ప‌ద‌వుల‌కు, ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. పువ్వాడ జారిపోవ‌డంతో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయాలో పాలుపోక త‌ల‌లు ప‌ట్టుకుంది. పార్టీ ఫిరాయింపుల‌ను ఎలా ఆపాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు సీనియ‌ర్ నేత‌లు.
మ‌రిన్ని చేరిక‌లు ఉంటాయా?
ఈ వారంలో ఖ‌మ్మంలో టీఆర్ ఎస్ భారీ ప్లీన‌రీని నిర్వ‌హించ త‌ల‌పెట్టింది. ఈ నేప‌థ్యంలో ఇత‌ర‌పార్టీల‌కు చెందిన జిల్లా నేత‌లు భారీగా కారెక్కుతార‌న్న ప్ర‌చారం జోరందుకుంది. ఈ ప్ర‌చారం.. టీపీసీసీ ఉత్త‌మ్‌తోపాటు, అధిష్టానానికి నిద్ర‌ను దూరం చేస్తోంది. గోడ‌దూకుళ్ల‌కు క‌ళ్లెం ఎలా వేయాలో వారికి అర్థం కావ‌డం లేదు. బీసీ, ఓసీలు – సీనియ‌ర్లు – జూనియ‌ర్ల లాంటి అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో ఇబ్బందులు ప‌డుతున్న‌కాంగ్రెస్‌కు ప్లీన‌రీ రోజు మ‌రెన్ని ఆప‌ద‌లు ఎదుర‌వ‌నున్నాయోన‌న్న భ‌యం వారిని మ‌రింత క‌ల‌వ‌ర పెడుతోంది. పాలేరు స్ధానాన్ని ఎలా ద‌క్కించుకోవాల‌న్న ఆరాటంలో ఉన్న కాంగ్రెస్ నేత‌లు త‌మ వెన‌క ఉన్న ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లు ఏంచేస్తున్నారో గ‌మ‌నించ‌క‌పోవ‌డం కూడా వారు చేయి జారిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.
First Published:  24 April 2016 11:00 PM GMT
Next Story