దేవి మృతి కేసు...దారికి రాని చిక్కుముళ్లు!
జూబ్లీ హిల్స్లో ముగ్గురు యువకులతో కారులో బయలుదేరి, అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దేవి కేసులో చిక్కుముళ్లు ఇంకా వీడలేదు. తవ్విన కొద్దీ ఈ కేసులో పోలీసులు చేధించాల్సిన అంశాలు మరిన్ని తెరమీదకు వస్తున్నాయి. శనివారం రాత్రి మాదాపూర్లో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, తిరిగి ఇంటికి బయలుదేరిన దేవిని తాము దింపుతామంటూ భరత్ సింహారెడ్డి మరో ఇద్దరు యువకులు తమ కారులో ఎక్కించుకున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్నెంబర్ 70లోకి వచ్చి, ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయం వద్దకు […]
జూబ్లీ హిల్స్లో ముగ్గురు యువకులతో కారులో బయలుదేరి, అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దేవి కేసులో చిక్కుముళ్లు ఇంకా వీడలేదు. తవ్విన కొద్దీ ఈ కేసులో పోలీసులు చేధించాల్సిన అంశాలు మరిన్ని తెరమీదకు వస్తున్నాయి. శనివారం రాత్రి మాదాపూర్లో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, తిరిగి ఇంటికి బయలుదేరిన దేవిని తాము దింపుతామంటూ భరత్ సింహారెడ్డి మరో ఇద్దరు యువకులు తమ కారులో ఎక్కించుకున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్నెంబర్ 70లోకి వచ్చి, ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయం వద్దకు రాగానే 3.24 గం.లకు దేవి తన తండ్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి రెండు నిముషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పింది. కానీ ఆమె ఇంటికి చేరలేదు.
భరత్ సింహారెడ్డి కారుని దేవి ఇంటికి సమీపంలో ఉన్న ఎబిపి సొల్యుషన్ భవనం వైపు మళ్లించి అక్కడ ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన దేవి తండ్రికి కాల్ చేసింది. కానీ ఆయన ఫోన్ ఎత్తేసరికే కాల్ కట్ అయ్యింది. తరువాత ఉదయం నాలుగున్నర వరకు ఆయన కూతురికి ఫోన్ చేస్తూనే ఉన్నా, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. 4.36 ప్రాంతంలో అక్కడ ఉన్న ఓ కానిస్టేబుల్ మోగుతున్న దేవి ఫోన్ని లిఫ్ట్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు.
పోలీసులు దీన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా భావించారు. అయితే కారుని మళ్లించి ఆపిన ప్రాంతంలో స్థానిక ఇంటి వాచ్మెన్గా ఉన్న రాము చెబుతున్న విషయాలతో ఈ కేసులో అనుమానాలు మొదలయ్యాయి. దేవి కుటుంబ సభ్యులు సైతం ప్రమాదం జరిగిన స్థలంలో కనబడుతున్న పరిస్థితులపై పలు అనుమానాలు లేవనెత్తారు. పరిశీలించిన కొద్దీ చిక్కుముళ్లు పెరిగిపోతున్న ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాలనుండి దర్యాప్తు జరుపుతున్నారు.
దేవి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పిన తరువాత 3.24 నుండి ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్న 4.36గం.ల వరకు అంటే దాదాపు గంటంపావు సమయం ఆమె సమాచారం తల్లిదండ్రులకు తెలియలేదు. భరత్ సింహారెడ్డి కారుని మళ్లించి ఆపిన చోట ఓ ఇంటి వాచ్మేన్ మూడున్నరకు కారుని చూసినట్టుగా చెబుతున్నాడు. 4.10 వరకు కారులోంచి రక్షించండి అనే కేకలు, ఆర్తనాదాలు వినిపించాయని అతడు పోలీసులకు తెలిపాడు. కారు ఆ తరువాత అక్కడి నుండి వెళ్లిపోగా, 4.36గం. లకు ప్రమాదం జరిగింది. అయితే ఈ ఇరవై నిముషాలు కారు ఎక్కడికి వెళ్లిందనేది కూడా సమాధానం లేని ప్రశ్న. దేవి కారులో ఏ సీటులో కూర్చుంది అనే విషయంమీద కూడా భరత్ సింహారెడ్డి పలురకాలుగా సమాధానాలు ఇవ్వటంతో పోలీసులు దీనిమీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇరవై నిముషాలు కారు ఏమైంది, దేవి ఎప్పుడు మృతి చెందింది…లాంటి విషయాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. భరత్ సింహారెడ్డితో పాటు ఉన్న మరొక యువకుడు కూడా ఓ పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడనే సందేహాలు ఉన్నాయి. ఆ పారిశ్రామికవేత్త, దేవి కేకలు విన్న వాచ్మెన్ ఇంటి యజమానికి ఫోన్ చేసి, తాను అమ్మాయి తరపు బంధువునని, వాచ్మెన్ని తమకు అప్పగించాలని బెదిరించాడని తెలుస్తోంది. టాస్క్ఫోర్స్ అధికారులు సైతం రంగంలోకి దిగి కేసుని మరింత వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు మాదాపూర్లోని పబ్, ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. దేవి, భరత్ల ఫోన్ల కాల్డాటాలను సేకరిస్తున్న పోలీసులు కారులో భరత్, దేవి కాకుండా మరెవరైనా ఉన్నా, ఆ విషయం కూడా సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా తెలిసిపోతుందన్నారు.