అతను పదవ తరగతి...ఆమె తొమ్మిదో తరగతి...ఆత్మహత్య చేసుకున్నారు!
ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదేమో అనిపించే దారుణాలు ఎప్పటికప్పుడు తాజాగా మన కళ్ల ముందుకు వస్తూనే ఉన్నాయి. తొమ్మిది, పది చదివే పిల్లలకు ప్రేమలు, పెళ్లిళ్లు…ఆత్మహత్యలు కూడా. ఉత్తర ప్రదేశ్, లఖింపూర్కి సమీపంలోని కొత్వాలి సదార్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఇద్దరు టీనేజి ప్రేమికులు తమకి తాము నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ప్రాంత పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం…ఇరువురు వేరు వేరు మతాలకు చెందినవారు కావటంతో పెద్దలు వారి ప్రేమని అంగీకరించలేదు. దాంతో మనస్తాపం […]
ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదేమో అనిపించే దారుణాలు ఎప్పటికప్పుడు తాజాగా మన కళ్ల ముందుకు వస్తూనే ఉన్నాయి. తొమ్మిది, పది చదివే పిల్లలకు ప్రేమలు, పెళ్లిళ్లు…ఆత్మహత్యలు కూడా. ఉత్తర ప్రదేశ్, లఖింపూర్కి సమీపంలోని కొత్వాలి సదార్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఇద్దరు టీనేజి ప్రేమికులు తమకి తాము నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ప్రాంత పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం…ఇరువురు వేరు వేరు మతాలకు చెందినవారు కావటంతో పెద్దలు వారి ప్రేమని అంగీకరించలేదు. దాంతో మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డారు.
సోనూ మహమ్మద్, షీలం కుమారి పది, తొమ్మిది చదువుతున్నారు. ఒకే స్కూల్లో చదువుతున్న వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరి కుటుంబాలు ఇందుకు అంగీకరించలేదు. ఈ నెల తొమ్మిదో తేదీన షీలంకి ఆగ్రాలోని కుబర్పూర్కి చెందిన ఒక యువకునితో బలవంతంగా పెళ్లి చేశారు. దీంతో తీవ్రంగా నిరాశా నిస్పృహలకు గురయిన టీనేజర్లు కలిసి చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. శనివారం తెల్లవారు జామున అంతపనీ చేశారు. అయితే శుక్రవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో అక్క ఆనందంగా కనిపించిందని ఆమె సోదరుడు సౌరభ్ తెలిపాడు. ఆ సాయంత్రం ఆమె అత్తగారి ఊరు కుబర్పూర్కి వెళ్లి వచ్చిందని అతను చెప్పాడు.
రాత్రి తమ ఇంట్లోనే ఉన్న షీలం, సోనూ మహమ్మద్ ఇంటికి ఎప్పుడు చేరిందో కానీ, తెల్లవారు జామున నాలుగుకి వారు ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఇరువురి కుటుంబాలవారు ఎలాంటి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదని, అయినా తాము బాడీలను పోస్ట్ మార్టమ్కి పంపామని పోలీసులు వెల్లడించారు. అభం శుభం తెలియని టీనేజి పిల్లలు అర్థంతరంగా జీవితాలను ముగించుకోవటంపై ఆ ప్రాంతవాసులు నిశ్చేష్టులయ్యారు. ఆ వయసుకే అంత పెద్దవాళ్లయి పోయారా…అనే విమర్శలు చేసేవాళ్లూ ఉన్నారు. కానీ పిల్లలు పెద్దవాళ్లయి పోవటం లేదు…వారి ప్రమేయం లేకుండానే వారి జీవితాల్లోకి పెద్ద విషయాలు, పనికిమాలిన విషయాలు వచ్చి చేరుతున్నాయి. అది అందరికీ అర్ధమవుతూనే ఉన్నా తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు లాంటివారంతా ఈ విషయంలో…పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్టే ఉంటున్నారు.