ఓటేయమని టీవీలిచ్చారు...కరెంటే లేదని మరిచారు!
రాజకీయ పార్టీలకు అధికారాన్ని దక్కించుకోవటంలో ఉన్నంత శ్రద్ధ ప్రజా సంక్షేమం పట్ల ఉండదని ఎన్నో సందర్భాల్లో రుజువవుతూనే ఉంది. అలాంటిదే ఇది కూడా. తమిళనాడులోని కొయింబత్తూరు జిల్లాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో రెండు గిరిజన గ్రామాలున్నాయి. అవి 45 కుటుంబాలున్న సెంబుక్కరై, 110 కుటుంబాలున్న తూమనూరు. ఇవి రెండు కవుందంపాలయం నియోజకవర్గం కిందకు వస్తాయి. ప్రతిసారీ ఎన్నికలపుడు డిఎమ్కె, ఎఐఎడిఎమ్కె పార్టీలు వచ్చి ఈ గ్రామాల్లోని గిరిజనులకు ఓటు వేయమని కోరుతూ, టివిలు, మిక్సీలు, గ్రైండర్లు, […]
రాజకీయ పార్టీలకు అధికారాన్ని దక్కించుకోవటంలో ఉన్నంత శ్రద్ధ ప్రజా సంక్షేమం పట్ల ఉండదని ఎన్నో సందర్భాల్లో రుజువవుతూనే ఉంది. అలాంటిదే ఇది కూడా. తమిళనాడులోని కొయింబత్తూరు జిల్లాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో రెండు గిరిజన గ్రామాలున్నాయి. అవి 45 కుటుంబాలున్న సెంబుక్కరై, 110 కుటుంబాలున్న తూమనూరు. ఇవి రెండు కవుందంపాలయం నియోజకవర్గం కిందకు వస్తాయి. ప్రతిసారీ ఎన్నికలపుడు డిఎమ్కె, ఎఐఎడిఎమ్కె పార్టీలు వచ్చి ఈ గ్రామాల్లోని గిరిజనులకు ఓటు వేయమని కోరుతూ, టివిలు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు లాంటివన్నీ ఇచ్చివెళుతుంటారు. గత పదేళ్లుగా ఇదే జరుగుతోందని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
అయితే విషాదం ఏమిటంటే ఈ రెండు గ్రామాలకు కరెంటే లేదు. అందుకే పార్టీలు ఇచ్చిన ఆ వస్తువులను ఈ గ్రామీణులు అట్టపెట్టెల్లోంచి కూడా తీయకుండా భద్రంగా దాచుకున్నారు. తమకు కరెంటు కావాలని కోరుతూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపాలు చేసినా అవి బూడిద పాలే అవుతున్నాయని వీరు వాపోతున్నారు. కరెంటు లేకపోవటం వలన తమ పిల్లలు చీకటిపడితే చదువుకోలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. వీరి గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరం వరకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఈ కాస్త దూరం పోల్స్, లైన్లు వేయడానికి కుదరటం లేదని, ఇందుకు ఫారెస్టు డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వటం లేదని ఈ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న రిజర్వు ఫారెస్టునుండి కరెంటు లైన్లు వెళితే జంతువులకు హాని కలుగుతుందని అటవీశాఖ అధికారులు అడ్డు చెబుతున్నారు.
అయితే జంతువులకు హాని కలగకుండా ఇన్సులేటెడ్ కేబుల్స్ని వాడవచ్చుననే అవగాహన కూడా ఆ గ్రామాల వారికి ఉన్నట్టుగా లేదు. ప్రభుత్వం కరెంటు ఇస్తే తాము వ్యవసాయం చేస్తున్న 350 ఎకరాలకు నీటి వసతిని సైతం పెంచుకునే అవకాశం ఉంటుందని వీరు ఆశపడుతున్నారు.
చీకటి పడినాక ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోనే గ్రామస్తులు తిరుగుతున్నారు. కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ టెక్నాలజీ కాలేజి గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమం కింద వేసిన స్ట్రీట్ లైట్లు అక్కడక్కడా వెలుగుతుంటాయి. ప్రస్తుతం కవుందంపాలయం నియోజకవర్గానికి ఎఐఎడిఎమ్కె పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే విసి అరుకుట్టి ఈ గ్రామాలకు భూమి లోపల నుండి వైర్లను పంపించే విధానంతో కరెంటుని తెచ్చే ప్రయత్నం చేస్తానని అంటున్నారు.