అంపైర్ నో బాల్ చెప్పాడని.. అతని చెల్లిని చంపేశాడు!
అలీగఢ్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జరారా అనే చిన్న టౌన్లో క్రికెట్ పోటీలు పెట్టుకోవాలని గ్రామంలో కుర్రాళ్లు ఉత్సాహపడ్డారు. ఊళ్లో పెద్దలు, పంచాయితీ సభ్యులు… లాంటివారు సందేహించారు. గెలుపోటములను స్పోర్టివ్ గా తీసుకునేంత క్రీడాస్ఫూర్తి తమ ఊరికి లేదని, ఏ చిన్న గొడవ జరిగినా తీవ్రంగా కొట్టుకుంటారని వారు భయపడ్డారు. ఊరి ప్రెసిడెంటు హోదాలో ఉన్న వ్యక్తితో పాటు చాలామంది వద్దనే అన్నారు. కానీ కావాలి… అనే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో జరారా […]
అలీగఢ్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జరారా అనే చిన్న టౌన్లో క్రికెట్ పోటీలు పెట్టుకోవాలని గ్రామంలో కుర్రాళ్లు ఉత్సాహపడ్డారు. ఊళ్లో పెద్దలు, పంచాయితీ సభ్యులు… లాంటివారు సందేహించారు. గెలుపోటములను స్పోర్టివ్ గా తీసుకునేంత క్రీడాస్ఫూర్తి తమ ఊరికి లేదని, ఏ చిన్న గొడవ జరిగినా తీవ్రంగా కొట్టుకుంటారని వారు భయపడ్డారు. ఊరి ప్రెసిడెంటు హోదాలో ఉన్న వ్యక్తితో పాటు చాలామంది వద్దనే అన్నారు. కానీ కావాలి… అనే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో జరారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గెలిచిన టీముకి రూ.5,100 ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆటలో అభిప్రాయభేదాలున్నా వాటిని ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోకూడదని, ఒకరికొకరు హాని చేసుకోకూడదని కూడా ముందుగానే అనుకున్నారు. జెపిఎల్ పోటీలను ఈ నెల 14న మొదలు పెట్టి, 30న ముగించాలని నిర్ణయించుకున్నారు. అయితే పోటీలు ముగియకముందే… పెద్దలు ఊహించినట్టుగానే అనుకోని దుర్ఘటన జరిగింది.
ఈ నెల 28న జరారా, బారికి అనే రెండు టీముల మధ్య ఆట జరుగుతుండగా అంపైర్లలో ఒకరైన రాజ్కుమార్, ఆట కీలక దశలో ఉన్నపుడు ఒక బాల్ని నో బాల్గా ప్రకటించాడు. దాంతో సందీప్ పాల్ అనే ఆటగాడు అంపైర్ దగ్గరకు వచ్చి, అతని నిర్ణయంపై గొడవపడ్డాడు. తన తీర్పుని మార్చాలని దబాయించాడు. రాజ్కుమార్ అందుకు ఒప్పుకోలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన సందీప్, నువ్వు చేసిన పనికి బదులుగా నీ ఇంట్లో ఒకరి ప్రాణాలు పోగొట్టుకుంటావు అని బెదిరించాడు. కానీ రాజ్ కుమార్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆటల్లో ఇదంతా మామూలే… అనుకుని మర్చిపోయాడు. తెల్లారి 29వ తేదీన ఆట తిరిగి మొదలైనప్పుడు సందీప్, రాజకుమార్ ఇంటికి వళ్లాడు. ఆ సమయంలో రాజ్ కుమార్ చెల్లెలు పూజ (15), ఆమె స్నేహితురాళ్లు ముగ్గురు ఇంట్లో ఉన్నారు. సందీప్ కూల్ డ్రింకులు తెచ్చి వారందరికీ ఇచ్చాడు. సందీప్ వాటిలో విషం కలిపాడు. అతను తాను రోజూ చూసే మనిషే కావటంతో పూజ ఏ మాత్రం అనుమానం లేకుండా డ్రింక్ని తాగేసింది. ఆమెతో పాటు మిగిలిన ముగ్గురు అమ్మాయిలు కూడా తాగారు. డ్రింకులో ఉన్న విష ప్రభావం వలన పూజ అక్కడికక్కడే మరణించగా, మిగిలిన ముగ్గురూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని మెరుగైన చికిత్స కోసం అలీగఢ్ కి తరలించారు.
పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. తాము అనుకున్నదే నిజమైనందుకు ఊరి పెద్ద మనుషులు ఇప్పుడు మరింతగా బాధపడుతున్నారు. రాజ్కుమార్ ఇక తాను జన్మలో అంపైర్గా ఉండకూడదనే నిర్ణయానికి వచ్చాడు. ఆటలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోగల క్రీడా స్ఫూర్తి ఎంత ముఖ్యమో ఈ మొత్తం ఉదంతం రుజువు చేసింది.