పంజాబ్లో డ్రగ్ మాఫియా ఉంటే ఓకే...... కానీ ఉన్నట్టు చూపిస్తే నాట్ ఓకే!
సినిమాకు సెన్సార్ బోర్డు అనేది ఒక నియంత్రణ. కానీ అది నియంతలా మారే సందర్భాలు సైతం చాలా ఉంటాయి. పంజాబ్లోని డ్రగ్ మాఫియా నేపథ్యంలో తీసిన ఉడ్తా పంజాబ్ సినిమాకి ఈ మధ్య కాలంలో సెన్సార్ బోర్డు తన కట్స్ ద్వారా విపరీతమైన ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ ఈ సినిమాకి ఏకంగా 89 కట్స్ చెప్పి సంచలనం సృష్టించారు. పైగా పేరులో ఉన్న పంజాబ్ అనే పదాన్ని సైతం తొలగించమని […]
సినిమాకు సెన్సార్ బోర్డు అనేది ఒక నియంత్రణ. కానీ అది నియంతలా మారే సందర్భాలు సైతం చాలా ఉంటాయి. పంజాబ్లోని డ్రగ్ మాఫియా నేపథ్యంలో తీసిన ఉడ్తా పంజాబ్ సినిమాకి ఈ మధ్య కాలంలో సెన్సార్ బోర్డు తన కట్స్ ద్వారా విపరీతమైన ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ ఈ సినిమాకి ఏకంగా 89 కట్స్ చెప్పి సంచలనం సృష్టించారు. పైగా పేరులో ఉన్న పంజాబ్ అనే పదాన్ని సైతం తొలగించమని సూచించారు. దీనిపై సినీ విశ్లేషకులు, బాలివుడ్ లోని వివిధ వర్గాల వారు విపరీతంగా మండిపడుతున్నారు. బిజెపి ప్రభుత్వం కళాకారుల స్వేచ్ఛమీద ఉక్కుపాదం మోపి, అణచివేస్తోందని ఆరోపిస్తున్నారు. అధికారం మీ చేతుల్లో ఉంది కదా…అని మాపై ఇలాంటి ఆంక్షలు విధిస్తే ఊరుకోబోమంటూ బాలివుడ్ అంతా ఉడ్తా పంజాబ్ చిత్ర బృందానికి అండగా నిలబడుతున్నారు.
డ్రగ్స్, రాజకీయాలు, ఎన్నికలు…వీటి గురించి ఉడ్తా పంజాబ్లో దర్శకుడు, రచయితలు తమదైన శైలిలో తమ భావాలను ప్రకటించారు. అదే తప్పయిపోయింది. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని తప్ప, తమ చుట్టూ ఉన్న సమాజంమీద ఎలాంటి అవగాహన ఇవ్వకూడదు…అనే నియమం ఉన్నట్టుగా… సెన్సార్ బోర్డు మొదటి విడతలో డ్రగ్స్ వినియోగం, సినిమాలో వాడిన భాషలపై 40 కట్స్ని చెప్పింది. కట్స్ తగ్గించి, ఎ సర్టిఫికెట్తో సరిపెడతారని నిర్మాతలు మరొకసారి సెన్సారు బోర్డుకి వెళ్లగా, ఈ సారి ఏకంగా 89 కట్స్ చెప్పారు. ఈ క్రమంలో సెన్సార్ బోర్డుకి, చిత్ర బృందానికి మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి చిత్రబృందం ముంబయి హైకోర్టుకి వెళ్లింది. సినిమాలో దేశ సార్వభౌమత్వానికి హాని చేసే అంశాలేమీ లేవని, ఇది కేవలం ప్రజలకు ఉపయోగపడే చిత్రమని దర్శకుడు అనురాగ్ కశ్యప్ తరపు న్యాయవాది వాదించారు. చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నది సెన్సార్ బోర్డు పూర్తిగా పెడచెవిన పెట్టగా… మరొక సారి చిత్ర బృందం చెబుతున్నదేమిటో సెన్సార్బోర్డు వినాలని కోర్టు ఆదేశించింది.
పంజాబ్లోని డ్రగ్ మాఫియా గురించి అందరికీ తెలుసు…ఆ సమస్యతో సినిమా తీస్తే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టా, సెన్సారుబోర్డు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులా పనిచేస్తోందంటూ పలువురు బాలివుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. నిహ్లానీ, సెన్సార్ బోర్డుకి వెళ్లకముందు ఒక నిర్మాతే, నిర్మాతల కష్టాలు ఆయనకు తెలియవా…అంటూ, ఉడ్తా పంజాబ్ సినిమాని నిర్మాతలు 60 కోట్లు ఖర్చుపెట్టి తీశారు, ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి…అని ముఖేష్ భట్ ప్రశ్నించారు. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి సృజనాత్మకత ఆత్మ అనీ, తమ ఆత్మని చంపవద్దంటూ అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్లో డ్రగ్ మాఫియా తీవ్రంగా ఉంది. దీని వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే తప్పేంటి…అని దర్శకుడు కబీర్ఖాన్ ప్రశ్నించారు. భజరంగీ భాయిజాన్ షూటింగ్ని పంజాబ్లో చేసినపుడు అక్కడి మాఫియా గురించి చాలామంది చెప్పారని, ఎంతోమంది కాలేజి విద్యార్థులు డ్రగ్స్కి బానిసలై పోతున్నారని, 89 కట్స్ తరువాత దర్శకుడు తాను చెప్పదలచుకున్నది ఎలా చెప్పగలడని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి ఈ మధ్యకాలంలో భావ ప్రకటన స్వేచ్ఛకోసం విద్యార్థులు, రచయితలు, ప్రగతివాదులు చేస్తున్న పోరాటాలను చూస్తున్నాం. ఆ బాటలో బాలివుడ్ కూడా చేరింది. ఈ పోరాట ఫలితం ఎలా ఉన్నా ఈ అంశాలు… ప్రజలకు తమను పాలిస్తున్న ప్రభుత్వం పట్ల ఒక అవగాహనని కలిగిస్తాయని స్వేచ్ఛావాదులు ఆశిస్తున్నారు.