స్పందించని కాలేజి యాజమాన్యం...విద్యార్థిని ఆత్మహత్య!
మహిళలు భరిస్తున్న దాడులు, వేధింపులు, అవమానాలకు వాటిని చేస్తున్నవారు మొదటి కారణమైతే, వారి మొరని ఆలకించి అండగా నిలబడని సమాజం రెండవ కారణమవుతున్నది. మార్ఫింగ్ ఫొటోలను చూసి, తల్లిదండ్రులు అనుమానించారని ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇటీవలే చూశాం. నేరాలను ఆపలేం…బాధితులకు అండగా నిలవలేము…అన్నట్టుగా ఉంది సమాజం పరిస్థితి. తోటి విద్యార్థి తనని కొట్టాడని కాలేజి యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన విద్యార్థిని, తనకు న్యాయం జరగలేదనే ఆక్రోశంతో ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ జిల్లా అనకాపల్లిలోని హిమశేఖర్ […]
మహిళలు భరిస్తున్న దాడులు, వేధింపులు, అవమానాలకు వాటిని చేస్తున్నవారు మొదటి కారణమైతే, వారి మొరని ఆలకించి అండగా నిలబడని సమాజం రెండవ కారణమవుతున్నది. మార్ఫింగ్ ఫొటోలను చూసి, తల్లిదండ్రులు అనుమానించారని ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇటీవలే చూశాం. నేరాలను ఆపలేం…బాధితులకు అండగా నిలవలేము…అన్నట్టుగా ఉంది సమాజం పరిస్థితి.
తోటి విద్యార్థి తనని కొట్టాడని కాలేజి యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన విద్యార్థిని, తనకు న్యాయం జరగలేదనే ఆక్రోశంతో ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ జిల్లా అనకాపల్లిలోని హిమశేఖర్ కాలేజిలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ధరణి (17) ని ఆమెతో పాటు చదువుతున్న విద్యార్థి గణేష్ ఈ నెల 24న కొట్టాడు. ధరణి కాలేజి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే కళాశాల యాజమాన్యం ధరణిదే తప్పని చెబుతూ, ఆమెనే మందలించింది. దీంతో తీవ్ర వేదనకు గురైన ధరణి అప్పటి నుండి కాలేజికి వెళ్లటం లేదు.
జరిగిన అవమానం నుండి కోలుకోలేకపోయిన ఆమె మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం కూతురు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తన ఫిర్యాదుపై కాలేజి యాజమాన్యం స్పందించలేదని, ఆ బాధని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆమె సూసైడ్ లేఖలో పేర్కొంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, ధరణిని కొట్టిన గణేష్ని అరెస్టు చేశారు. నూరేళ్ల జీవితాన్నిఅర్ధంతరంగా ముగించిన ధరణి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
ఆడపిల్లల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులనే కాదు, వారిని కాపాడాల్సిన వ్యవస్థలను కూడా మార్చాల్సి ఉంది. ఆడపిల్లలకు ఇప్పుడు చదువు, ఉద్యోగాలు, ఆర్థిక సమానత్వాలు కాదు…గుప్పెడు నమ్మకం కావాలి. ఏదిఏమైనా, ఏం జరిగినా తమపట్ల అనుచితంగా ప్రవర్తించిన దుర్మార్గుడు తప్ప…. ప్రపంచం మొత్తం తన వెనుక ఉంటుందనే నమ్మకం, భరోసా ఇప్పుడు ఆమెకు కావాల్సింది. బాదితులనే బాధపెట్టే ఈ ధోరణిలో మార్పు రావాలి.