దోపిడికి వచ్చి పట్టుబడిన...సీరియల్ కిల్లర్!
నెల్లూరులో పట్టపగలు దోపిడికి ప్రయత్నించి, ఓ మహిళను హత్యచేసిన దుండగుడు చివరికి పట్టుబడ్డాడు. పట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్కి సమీపంలో నివసిస్తున్న రావిప్రోలు నాగేశ్వరరావు, ప్రభావతి దంపతుల ఇంట్లోకి శనివారం దుండగుడు ప్రవేశించాడు. ఆ సమయంలో ప్రభావతి చెల్లెలు పిల్లలైన మాధురి, అనంత కృష్ణ కూడా ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఆ అగంతకుడు ప్రభావతి తలమీద కొట్టి, ఆమె మెడని కత్తితో కోసి తీవ్రంగా గాయపరచాడు. తరువాత ఆమె మెడలోని బంగారు గొలుసుని తీసుకుని […]
నెల్లూరులో పట్టపగలు దోపిడికి ప్రయత్నించి, ఓ మహిళను హత్యచేసిన దుండగుడు చివరికి పట్టుబడ్డాడు. పట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్కి సమీపంలో నివసిస్తున్న రావిప్రోలు నాగేశ్వరరావు, ప్రభావతి దంపతుల ఇంట్లోకి శనివారం దుండగుడు ప్రవేశించాడు. ఆ సమయంలో ప్రభావతి చెల్లెలు పిల్లలైన మాధురి, అనంత కృష్ణ కూడా ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఆ అగంతకుడు ప్రభావతి తలమీద కొట్టి, ఆమె మెడని కత్తితో కోసి తీవ్రంగా గాయపరచాడు. తరువాత ఆమె మెడలోని బంగారు గొలుసుని తీసుకుని జేబులో వేసుకున్నాడు.
ప్రభావతి కేకలకు పక్కగదిలో ఉన్న మాధురి, అనంత కృష్ణలు బయటకు రావటంతో వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు, ఇంట్లోంచి వస్తున్న అరుపులు విని దుండగుడిని పట్టుకోబోగా అతను దాడికి దిగాడు. అయితే చాకచక్యంగా తప్పించుకున్న నాగేశ్వరరావు అతడిని గట్టిగా పట్టుకుని కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు, రోడ్డుమీద వెళుతున్నవారు పరుగున అక్కడకు చేరుకున్నారు. అందరూ కలిసి ఆ వ్యక్తిని బంధించి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనలో ప్రభావతి(54) మృతి చెందగా, మాధురి (25), అనంతకృష్ణ (22) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. అతనిపేరు కుక్కాల వెంకటేశ్. అతనో సీరియల్ కిల్లర్. మార్చి నెలలో కావలిలో పట్టపగలు ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను చంపింది, ఏప్రిల్ నెలలో పెద్ద చెరుకూరు గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో పూజారి తల్లిదండ్రులైన వృద్ధ దంపతులను హతమార్చిందీ తానేనని అతను పోలీసుల విచారణలో అంగీకరించాడు.