ఆ గిరిజనుడు భార్య శవాన్ని మోస్తూ...పది కిలోమీటర్లు నడిచాడు!
నల్లధనంగా పోగుపడిపోయి ఒకేచోట మూలుగుతున్న సంపద ఒకవైపు, కడు పేదరికంలో బతుకులు ఈడుస్తున్న జనం మరొకవైపు… మనదేశం ఈ రెండు పరిస్థితులకు నిలువుటద్దం. అందుకే ప్రపంచ సంపన్న దేశాల్లో మనదేశం ఏడవస్థానంలో ఉండగా…నాణేనికి మరోవైపు దానా మాఝీలాంటి నిరుపేదలున్నారు. రోజుకి 53,720 కొత్తవాహనాలు రోడ్డుమీదకు వస్తున్న ఈ దేశంలో…. ఒడిషాకు చెందిన మాఝీ అనే గిరిజనుడు …మరణించిన తన భార్యశవాన్ని బట్టలో మూటకట్టుకుని, భుజాన వేసుకుని పది కిలోమీటర్లు నడిచాడు. అతని పక్కన పన్నెండేళ్ల కుమార్తె. ఒడిషా, […]
నల్లధనంగా పోగుపడిపోయి ఒకేచోట మూలుగుతున్న సంపద ఒకవైపు, కడు పేదరికంలో బతుకులు ఈడుస్తున్న జనం మరొకవైపు… మనదేశం ఈ రెండు పరిస్థితులకు నిలువుటద్దం. అందుకే ప్రపంచ సంపన్న దేశాల్లో మనదేశం ఏడవస్థానంలో ఉండగా…నాణేనికి మరోవైపు దానా మాఝీలాంటి నిరుపేదలున్నారు. రోజుకి 53,720 కొత్తవాహనాలు రోడ్డుమీదకు వస్తున్న ఈ దేశంలో…. ఒడిషాకు చెందిన మాఝీ అనే గిరిజనుడు …మరణించిన తన భార్యశవాన్ని బట్టలో మూటకట్టుకుని, భుజాన వేసుకుని పది కిలోమీటర్లు నడిచాడు. అతని పక్కన పన్నెండేళ్ల కుమార్తె.
ఒడిషా, కలాహండి జిల్లా లోని భవానీ పాట్నా ఆసుపత్రిలో మాఝీ భార్య మంగళవారం రాత్రి క్షయవ్యాధితో మరణించింది. క్షయకు ఇప్పుడు మందులు ఉన్నా 42ఏళ్ల ఆ మహిళ మరణించడమే విషాదమైతే…ఆమె శవాన్ని ఇంటికి తీసుకువెళ్లటంలో భర్త మాఝీ అనుభవించిన వేదన మరింత విషాదం. బుధవారం మాఝీ… భార్య శవాన్ని…అక్కడి నుండి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామం మెల్ఘరాకి తీసుకువెళ్లేందుకు, వాహనం కోసం ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నాడు. అతను వాహనం అడగడానికి కారణం ఉంది.
నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మహాప్రయాణ పేరుతో ఆసుపత్రి నుండి శవాన్ని ఇంటికి చేర్చే ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే మాఝీ ఎన్నిసార్లు ఎంతగా బ్రతిమలాడినా ఆసుపత్రి అధికారులు కానీ, సిబ్బంది కానీ స్పందించలేదు. వాహనం లేదని చెప్పారు. దాంతో అతను చేసేది లేక భార్యశవాన్ని బట్టలో మూట కట్టుకుని నడవటం మొదలుపట్టాడు. పన్నెండేళ్ల కుమార్తె కూడా అతనితో పాటు నడుస్తోంది.
ఈ దృశ్యం కొంతమంది స్థానిక విలేకరుల కంటబడింది. వారు మాఝీని అడిగి వివరాలు తెలుసుకుని జిల్లా కలెక్టరుకి ఫోన్ చేశారు. దాంతో మాఝీకి అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. తాను పేదవాడినని వాహనం సమకూర్చుకోలేనని ఎంతగా వేడుకున్నా ఆసుపత్రి అధికారులు… తాము ఎలాంటి సహాయం చేయలేమని చెప్పారని… మాఝీ స్థానిక టెలివిజన్ ఛానల్కి చెప్పాడు.
ఈ సంఘటనపై కలహండి జిల్లా కలెక్టరు డి బృంద మాట్లాడుతూ…విషయం తెలియగానే జిల్లా ప్రధాన వైద్యాధికారి కార్యాలయానికి ఫోన్ చేసి అంబులెన్స్ని పంపామని..నిరుపేదలకు అంత్య క్రియలకు ఆర్థిక సహాయం అందించే హరిశ్చంద్ర యోజన పథకం కింద వారికి సహాయం చేయమని తహసిల్దార్ని ఆదేశించామని తెలిపారు. రెడ్ క్రాస్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి తగిన సహాయం అందేలా చూడమని బ్లాక్ డెవలప్మెంట్ అధికారిని ఆదేశించడం కూడా జరిగిందని కలెక్టర్ తెలిపారు. స్థానిక విలేకరులు సమయానికి స్పందించకపోతే…నిరుపేద మాఝీ భార్య మరణం కంటే…ఆమె అంత్యక్రియలు మరింత విషాదభరితంగా మారేవి అనటంలో ఎలాంటి సందేహం లేదు.