Telugu Global
NEWS

ఎమ్మెస్ సుబ్బుల‌క్ష్మి విగ్ర‌హం తంబుర తీగ‌లు తెగిపోయాయి....

తిరుప‌తిలో పూర్ణ‌కుంభం స‌ర్కిల్‌లో ఉన్న… కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారత రత్నఎమ్మెస్ సుబ్బుల‌క్ష్మి విగ్ర‌హం నిర్వ‌హ‌ణ స‌రిగ్గా లేక‌పోవ‌టంపై ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పి బాల‌సుబ్ర‌మ‌ణ్య ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డంతో అధికారులు స్పందించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విగ్ర‌హ నిర్వ‌హ‌ణ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవలసిందిగా అధికారుల‌ను ఆదేశించింది. 2006లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ విగ్ర‌హాన్నిఆవిష్క‌రించారు. అయితే ఆ త‌రువాత కాలంలో ఈ విగ్ర‌హాన్ని అధికారులు ప‌ట్టించుకోవ‌టం మానేశారు. ఇటీవ‌ల‌ తిరుప‌తి వ‌చ్చిన‌పుడు విగ్ర‌హ స్థితిని చూసిన ఎస్‌పి […]

ఎమ్మెస్ సుబ్బుల‌క్ష్మి విగ్ర‌హం తంబుర తీగ‌లు తెగిపోయాయి....
X

తిరుప‌తిలో పూర్ణ‌కుంభం స‌ర్కిల్‌లో ఉన్న… కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారత రత్నఎమ్మెస్ సుబ్బుల‌క్ష్మి విగ్ర‌హం నిర్వ‌హ‌ణ స‌రిగ్గా లేక‌పోవ‌టంపై ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పి బాల‌సుబ్ర‌మ‌ణ్య ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డంతో అధికారులు స్పందించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విగ్ర‌హ నిర్వ‌హ‌ణ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవలసిందిగా అధికారుల‌ను ఆదేశించింది. 2006లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ విగ్ర‌హాన్నిఆవిష్క‌రించారు. అయితే ఆ త‌రువాత కాలంలో ఈ విగ్ర‌హాన్ని అధికారులు ప‌ట్టించుకోవ‌టం మానేశారు.

ఇటీవ‌ల‌ తిరుప‌తి వ‌చ్చిన‌పుడు విగ్ర‌హ స్థితిని చూసిన ఎస్‌పి బాల సుబ్ర‌మ‌ణ్యం త‌న ఆవేద‌న‌ని వ్య‌క్తం చేస్తూ ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టారు. సుబ్బుల‌క్ష్మి విగ్రహం చేతిలో ఉన్న తంబుర తీగ‌లు తెగిపోవ‌టం, విగ్ర‌హాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ షెల్ట‌ర్‌, ప‌బ్లిసిటీ హోర్డింగుకోసం నాటిన స్థంభం మూసివేయ‌టం త‌దిత‌ర విష‌యాలను గురించి ఆయ‌న అందులో రాశారు. తంబురాని కేబుల్‌వైర్ల‌కు ఆస‌రాగా వాడుతున్నా రంటూ బాధ‌ప‌డ్డారు.

సంబంధిత అధికారులు విగ్ర‌హ నిర్వ‌హ‌ణ, సంర‌క్ష‌ణ విష‌యంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలని ‌ ఆయ‌న కోరారు. విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టిస్తే చాల‌ద‌ని, సంబంధిత శాఖ అంకిత‌భావంతో దానిని కాపాడాల‌న్నారు. క‌నీసం వారానికి ఒక‌సారి శుభ్రం చేయ‌టం, పూల‌దండ‌తో అలంక‌రించ‌డం చేయాల‌న్నారు. జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆమె ప‌విత్ర ఆత్మ‌కు ఇస్తున్న నివాళి ఇదేనా …అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ విష‌యాన్ని బాలు టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి డి సాంబ‌శివ‌రావు దృష్టికి తీసుకువెళ్ల‌గా…త‌గిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని ఆయ‌న హామీ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. విగ్ర‌హం తిరుప‌తి ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంద‌ని టిటిడి అధికారులు తెలిపిన‌ట్టుగా సమాచారం.

ఎమ్మెస్ సుబ్బుల‌క్ష్మిని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం 1975లో శాశ్వ‌త ఆస్థాన విద్వాంసురాలి హోదాతో గౌర‌వించిన సంగ‌తి తెలిసిందే. నేటికీ ఎమ్మెస్ మృదుమ‌ధుర గాత్రం నుండి ధ్వ‌నించే సుప్ర‌భాతంతోనే తిరుమ‌ల‌లో తెల్ల‌వారుతుంది. ఇంకా ఎమ్మెస్ ఆల‌పించిన బాలాజీ పంచ‌ర‌త్న‌మాల‌, విష్ణుస‌హ‌స్ర‌నామం, భ‌జ‌గోవిందం త‌దిత‌ర భ‌క్తి సాహిత్యం తిరుమ‌ల‌లో ప్ర‌తిధ్వనిస్తుంటుంది.

First Published:  1 Sep 2016 2:00 AM GMT
Next Story