Telugu Global
NEWS

నాకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదు, నా కొడుకు చేత రాజీనామా చేయించాడు " ఉమ్మారెడ్డి

చంద్రబాబు వాడకం ఎలా ఉంటుందో మాజీ కేంద్రమంత్రి, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. తన జీవితంతో చంద్రబాబు ఎలా ఆడుకున్నది వివరించారు. పార్టీ ఆవిర్భావం రోజు నుంచి ఉన్న తనను చివరకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వకుండా అవమానించి బయటకు పంపారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తొలుత జిల్లా అధ్యక్షుడు పుల్లారావుకు ఈ విషయాన్ని చెప్పానన్నారు. సభ్యత్వం పుస్తకం పంపుతానన్నా ఆయన తర్వాత పట్టించుకోలేదన్నారు. సభ్యత్వ కార్యక్రమ ఇన్‌చార్జ్‌గా ఉన్న కేఈ కృష్ణమూర్తిని అడిగితే ఆన్‌లైన్‌లో […]

నాకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదు, నా కొడుకు చేత రాజీనామా చేయించాడు  ఉమ్మారెడ్డి
X

చంద్రబాబు వాడకం ఎలా ఉంటుందో మాజీ కేంద్రమంత్రి, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. తన జీవితంతో చంద్రబాబు ఎలా ఆడుకున్నది వివరించారు. పార్టీ ఆవిర్భావం రోజు నుంచి ఉన్న తనను చివరకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వకుండా అవమానించి బయటకు పంపారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తొలుత జిల్లా అధ్యక్షుడు పుల్లారావుకు ఈ విషయాన్ని చెప్పానన్నారు. సభ్యత్వం పుస్తకం పంపుతానన్నా ఆయన తర్వాత పట్టించుకోలేదన్నారు. సభ్యత్వ కార్యక్రమ ఇన్‌చార్జ్‌గా ఉన్న కేఈ కృష్ణమూర్తిని అడిగితే ఆన్‌లైన్‌లో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా సూచించారన్నారు. ఆ రోజు చాలా బాధేసిందన్నారు. చివరకు నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి తనకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వడం లేదన్న విషయాన్ని చెప్పానన్నారు. ఆయన కూడా తల ఎత్తకుండా చూస్తాలే అని సరిపెట్టారన్నారు. కానీ సభ్యత్వం మాత్రం తనకు ఇవ్వలేదన్నారు.

20ఏళ్లు పార్టీలో ఉన్న తనకు చివరకు సభ్యత్వం కూడా ఇవ్వకుండా అవమానించారని ఆవేదన చెందారు. దాంతో ఏడాది పాటు ఇంటికే పరిమితమయ్యానన్నారు. ఆసమయంలోనే వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారని… జగన్‌ బలవంతపెట్టి మరీ ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపారని ఉమ్మారెడ్డి చెప్పారు. ఐటీసీ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న తన కుమారుడికి టికెట్ ఇస్తానంటూ 2004లో ఉద్యోగానికి రాజీనామా చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. కానీ చివరకు టికెట్ మాత్రం సత్యం రామలింగరాజు మాట విని ఆయన బంధువుకే ఇచ్చారని వెల్లడించారు. ఒక పద్దతి ప్రకారం తనను, తన రాజకీయ వారసత్వాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ పెద్దలు కుట్రపూరితంగా పనిచేశారని ఉమ్మారెడ్డి ఆవేదన చెందారు.

ఎన్టీఆర్‌ నాటి విలువలు టీడీపీలో ఏమాత్రం లేవన్నారు. 1999లో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎవరుండాలన్న దానిపై ఎంపీల నుంచి చంద్రబాబు అభిప్రాయాలు సేకరించారని అందరూ తన పేరు సూచించారని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన చంద్రబాబు చివరకు బీసీ అయితే బాగుంటుందంటూ ఎర్నన్నాయుడిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారని చెప్పారు. అప్పుడు తాను చాలా బాధపడ్డానన్నారు. ఒకవేళ నేరుగా బీసీ నేతకు అవకాశం ఇవ్వదలుచుకుంటే అభిప్రాయసేకరణ జరపడం దేనికని ప్రశ్నించానన్నారు. 2004లో టీడీపీపై ఉన్న వ్యతిరేకత వల్ల పార్టీతో పాటు తాను ఓడిపోయానన్నారు. ఆ సమయంలో రాజ్యసభ సీటు అడిగితే ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఇవ్వడం లేదని వచ్చేసారి అవకాశం ఇస్తానని చంద్రబాబు నమ్మించారని చెప్పారు. 2006లో మైసూరారెడ్డికి రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారన్నారు. 2008లో ట్రై చేస్తే ఈసారి హరికృష్ణ పేరును తెరపైకి తెచ్చి తప్పించుకున్నారని గుర్తు చేసుకున్నారు. 2010 నుంచి అందరినీ పక్కనపడేసి కార్పొరేట్ పెద్దలకు రాజ్యసభ సీట్లు ఇవ్వడం చంద్రబాబు మొదలుపెట్టారని ఉమ్మారెడ్డి విమర్శించారు. ఆ కోటాలోనే సుజనాచౌదరి, సీఎం రమేష్, దేవేందర్‌ గౌడ్‌ తదితరులు రాజ్యసభకు వెళ్లారన్నారు.

చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తనను పీఆర్పీలోకి ఆహ్వానించారని కానీ టీడీపీకి కట్టుబడి తాను పార్టీ మారలేదన్నారు. ఎన్టీఆర్‌ నాటి పరిస్థితులను ఊహించుకుని పార్టీ పెట్టవద్దని చిరంజీవికి తాను స్వయంగా ఒక సందర్భంలో సూచించానన్నారు. చిరు పార్టీ పెడితే కాపులు కష్టాలుపడి డబ్బులు కూడా పోగొట్టుకుంటారని తాను ముందుగానే హెచ్చరించానన్నారు. మొన్నటి ఎన్నికల్లో రైతు రుణమాఫీ ప్రకటించాలని చాలా మంది చెప్పినా జగన్‌ వినలేదన్నారు. రైతులను తాను తప్పుడు హామీలతో మోసం చేయలేనని జగన్‌ చెప్పినప్పుడు సంతోషంగా అనిపించిందన్నారు. దేనినైనా క్షుణ్ణంగా స్డటీ చేసే తత్వాన్ని జగన్‌లో తాను చూశానన్నారు. రాష్ట్రంలో ఏ నదిపై ఏఏ ప్రాజెక్టులు ఉన్నది, ఏ ప్రాజెక్టు నీటిసామర్ధ్యం ఎంత అన్నది ఇలాంటి డేటా కూడా జగన్‌ క్షణాల్లో చెప్పడం తాను చూశానన్నారు. బహుశా అలాంటి శక్తిసామర్ధ్యాలు ఉండబట్టే జగన్‌ ఆస్థాయికి వచ్చారనిస్తుందన్నారు ఉమ్మారెడ్డి. మొత్తం మీద చంద్రబాబు తన విషయంలో వ్యవహరించిన తీరును ఉమ్మారెడ్డి పూసగుచ్చినట్టు వివరించారు.

Click on Image to Read:

polavaram-chandrababu-naidu

chittoor-mayor-katari-anuradha

ap-special-status-survy

chandrababu-naidu-polavaram

First Published:  15 Sep 2016 10:26 PM GMT
Next Story