Telugu Global
National

గుజరాత్ ఉద్యమనేత జిగ్నేశ్ మేవానీతో ఇంటర్వ్యూ

భూమిలేని ప్రతి దళిత కుటుంబానికీ ఐదెకరాల భూమి ఇవ్వాలని మీ ఉద్యమం ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. ఇది ఏ మేరకు వాస్తవికమైందని మీరనుకుం టున్నారు? అంత భూమి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి జిల్లాలోనూ, తాలూకాలోనూ ప్రభుత్వానికి చెందిన బంజరు భూములు చాలా వున్నాయి. వాటిని పంచవచ్చు. గుజరాత్‌ భూమి సీలింగ్‌ చట్టాన్ని అమలు చేయడం ద్వారా వేలాది ఎకరాల భూములు లభ్యమవుతాయి. అట్లాగే ఎస్‌సీ/ఎస్‌టీ సబ్‌ప్లాన్‌లో ఒక నిబంధన ఉంది. భూమి లేనివారి కోసం ప్రభుత్వం […]

గుజరాత్ ఉద్యమనేత జిగ్నేశ్ మేవానీతో ఇంటర్వ్యూ
X

భూమిలేని ప్రతి దళిత కుటుంబానికీ ఐదెకరాల భూమి ఇవ్వాలని మీ ఉద్యమం ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. ఇది ఏ మేరకు వాస్తవికమైందని మీరనుకుం టున్నారు? అంత భూమి ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రతి జిల్లాలోనూ, తాలూకాలోనూ ప్రభుత్వానికి చెందిన బంజరు భూములు చాలా వున్నాయి. వాటిని పంచవచ్చు. గుజరాత్‌ భూమి సీలింగ్‌ చట్టాన్ని అమలు చేయడం ద్వారా వేలాది ఎకరాల భూములు లభ్యమవుతాయి. అట్లాగే ఎస్‌సీ/ఎస్‌టీ సబ్‌ప్లాన్‌లో ఒక నిబంధన ఉంది. భూమి లేనివారి కోసం ప్రభుత్వం భూముల్ని కొని ఇవ్వవచ్చు. టాటాలకు, అంబానీలకు, అదానీలకు, ఎస్‌ఈజెడ్‌లకు భూములు లభించినప్పుడు దళితులకు, ఆదివాసులకు, ఓబీసీలకు భూమెందుకు దొరకదు? రాజకీయ సంకల్పం ఉంటే ఇది కచ్చితంగా సాధ్యమే.

కార్పొరేట్‌ సంస్థలకు భూములివ్వడం వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అందరికీ లాభం కలుగుతుంది. దళితులకు ఐదెకరాల బంజరు భూమినివ్వడం వల్ల లాభమేంటి?
భూసంస్కరణలు ప్రథమ పంచవర్ష ప్రణాళికలో భాగం. దేశాన్ని మరింత సమసమాజంగా మార్చడం, పేదల, భూమిలేని నిరుపేదల బతుకుల్లో వెలుగురేఖలు ప్రసరింపజేయడం దాని లక్ష్యం. దేశ జనాభాలో అత్యధికులు నేటికీ బతుకుదెరువు కోసం వ్యవసాయంపైనే ఆధారపడి వున్నారు. భూసంస్కరణలపై ఆధారపడిన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కావాలని మేం కోరుతున్నాం. భూమిని దానిపై శ్రమించేవారికి, అంటే దున్నేవారికి భూమిని పునఃపంపిణీ చేయడం ద్వారా ఉత్పాదకతనూ, సంపద వృద్ధినీ సాధించవచ్చు.

భూమిపై హక్కు కోసం సరోడా గ్రామంలో జరిగిన పోరాటం, అది సాధించిన విజయం గురించి కాస్త చెప్పండి.
భూసంస్కరణలు కేవలం కాగితాల పైనే జరిగిన విచిత్రమైన నమూనా గుజరాత్‌ది. వారు మీకు భూమిపై వాస్తవమైన హక్కునివ్వరు. కానీ రైతులు కాగితాల మీదైతే దున్నుకోలేరు కదా! సరోడా గ్రామం ఉదాహరణే తీసుకుంటే 2006లో 115 కుటుంబాలకు 220 బిగహాల భూమిని కేటాయించారు. చట్టప్రకారం 90 రోజుల లోగా ఆ భూమిని భౌతికంగా వారికి అప్పగించాలి. ఇప్పుడు మనం 2016లో ఉన్నాం. తొమ్మిదేండ్లు దాటింది. ఈ కుటుంబాలు ఎన్నోసార్లు ధర్నాలు, ర్యాలీలు, మెమోరాండాలు ఇవ్వడం వంటివి చేసినా ఫలితం లేదు. ఆఖరుకు వారు మాకు భూములివ్వకపోతే ఈ దేశం నుంచి వెళ్లగొట్టండంటూ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అయినా ఏమీ జరగలేదు. దాంతో చివరకు మేం ఈ నెలలో చట్టాన్ని ధిక్కరిస్తూ అహ్మదాబాద్‌లో రాస్తా రోకో చేపట్టాం. ఈ సందర్భంగా చాలా ఘర్షణ జరిగింది. నిరసన తెలుపుతున్న కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు స్పృహ కోల్పోయారు. వారికోసం అంబులెన్స్‌ ఏర్పాటు చేయడానికి బదులు పోలీసులు వారినే కొట్టారు. ఎన్ని అడ్డంకులొచ్చినా మేమీ పోరాటాన్ని వదిలేలా లేమని చివరకు ప్రభుత్వం గ్రహించింది. భూముల్ని భౌతికంగా అప్పగించే ప్రక్రియను ప్రారంభించడానికి అంగీకరించింది. భూముల్ని కొలిచే పని మొదలైంది. ఇది మాకు చాలా పెద్ద విజయం.

సెప్టెంబర్‌ 16న మీరు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు తిరిగి రాగానే మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు?
నా అరెస్టు గుజరాత్‌ మోడల్‌కు, ఇక్కడ సాగే పాలనా తీరుకు మచ్చుతునక. దళితుల ఆందోళనతో గుజరాత్‌ ప్రభుత్వం ఎంతగా కలవరపడుతున్నదో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.

మీ అంచనా ప్రకారం దళిత రాజకీయాలు నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటి?
అది ‘మనువాద్‌ ముర్దాబాద్‌’ వంటి నినాదాల దగ్గరే ఎక్కడో తచ్చాడుతూ ఉండిపోయినట్టు నాకనిపిస్తుంది. దళిత రాజకీయాలు ఈ తరహా నినాదాల పరిధిని దాటి ముందుకు పోవాల్సింది. కానీ అవి అస్తిత్వవాద రాజకీ యాల్లోనే కూరుకుపోయాయి. అస్తిత్వవాద రాజకీయాల నూ, భౌతిక(మెటీరియల్‌) రాజకీయాలతో మిళితం చేయ డం-అంటే సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కోసం కూడా పోరాడడమనేది సవాలుగా ఉంది.

దళితుల ఐక్యత ఒక పెద్ద సమస్యగా ఉందని మీరు భావిస్తున్నారా? అలాగైతే దాన్ని ఎలా పరిష్కరించాలని మీరనుకుంటున్నారు?
అవును, కచ్చితంగా ఇదొక సమస్యగానే ఉంది. అందుకే మేం చేపడుతున్న కార్యక్రమాల్లో ‘ప్రపంచ దళితులారా ఏకంకండి’ అనే నినాదం కూడా ఇస్తున్నాం. ఇటీవల ఒక ఎన్‌జీవో నిర్వహించిన అధ్యయనంలో దళిత కులాల్లో కూడా ఇతర దళిత కులాల వారి పట్ల అస్పృశ్యతను పాటించే దురాచారం ఉందని వెల్లడైంది. కాబట్టి ఈ అంతర్గత కులతత్వం కచ్చితంగా ఒక ప్రమాదకరమైన అంశమే. దీన్ని దూరం చేయాల్సి ఉంది. దళితుల ఐక్యతకు ఇది అవసరమైంది కూడా. రాబోయే రోజుల్లో మేం కులాంతర వివాహాలు సహా వేర్వేరు కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. కులాంతర ప్రేమలనూ, పెళ్లిళ్లనూ ప్రోత్సహించడం కోసం వాలెంటైన్స్‌ డేను కూడా వేదికగా వాడుకోవాలనుకుంటున్నాం. ఇది కులనిర్మూలనా రాజకీయాలకు ఒక భౌతిక రూపాన్నివ్వడంతో తోడ్పడుతుంది.

సముదాయపు ప్రగతికన్నా వ్యక్తిగత పురోగతికే పెద్ద పీట వేస్తారనేది దళిత రాజకీయాలపై తరచూ వస్తున్న విమర్శ. దళితులెవరైనా అధికార పీఠానికి చేరుకుంటే చాలు దళితులు తమకు ప్రాతినిధ్యం లభించిందని సంతోషపడిపోతారు. కానీ జరుగుతున్నదేమిటంటే, వ్యక్తులుగా కొందరు దళితులకు లాభం జరిగినంత మాత్రాన మొత్తంగా దళిత సముదాయానికి భౌతిక ప్రయోజనమేదీ చేకూరడం లేదు.

నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పేదల, భూమిలేని నిరుపేదలకు సంబంధించిన రాజకీయాలెప్పుడూ విడివిడి వ్యక్తుల రాజకీయాలుగా ఉండలేవు. అవి ఎవరో ఒక నేత చుట్టూ తిరిగే రాజకీయాలుగా సాగలేవు. తప్పనిసరిగా అవి సమిష్టి రాజకీయాలే అయి ఉండాలి. దళిత కార్యకర్తలు లేదా దళిత రాజకీయ నేతలెవరైనా అధికార స్థానాలకు ఎన్నికయినట్టయితే, వారు తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడంపైనే ఎక్కువ ఆసక్తి చూపడం మనం చాలా ఏండ్లుగా చూస్తున్నదే. కానీ ఇప్పుడు దళితులు ప్రజా ఉద్యమాలు, సమష్టి కృషి ద్వారానే విజయం సాధించగలమనే విషయాన్ని అర్థం చేసుకునే క్రమం ఆరంభమైంది. తమ ప్రయోజనాలను తమ రాజకీయ ప్రతినిధులే ఆటోమెటిక్‌గా నెరవేరుస్తారని వారిప్పుడు ఆశించడం లేదు.

ఇది అస్తిత్వవాద రాజకీయాల పరిమితి కాదా?
తప్పనిసరిగా అలానే అనుకోలేం కానీ ఒక రకంగా ఔననే చెప్పాలి. అస్తిత్వవాద రాజకీయాల్లో పలు వైరుధ్యాలున్నాయి. వాటిలో సానుకూల, ప్రతికూల అంశాలున్నాయి. రాజకీయ విశ్లేషణ, సమీకరణల్లో ఈ వైరుధ్యాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వామపక్షాల (లెఫ్ట్‌) పట్ల అనుసరించాల్సిన వైఖరి విషయంలో దళిత రాజకీయ శక్తులలో భిన్నాభి ప్రాయాలు న్నట్టు కనిపిస్తున్నాయి. కుల సమీకరణను వామపక్షాలు ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేశాయని అంబేద్క రైట్లలో ఒక సెక్షన్‌ బలంగా అభిప్రాయపడుతోంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?

వామపక్షాలు కచ్చితంగా మిత్రపక్షాలేనని నా అభిప్రాయం. అసలిది వామపక్షాలు దళితులలో చేరడం లేదా దళితులు వామపక్షాల్లో చేరడానికి సంబంధించిన విషయం కాదు. ఇది దళితులు వామపక్షంగా మారడానికి సంబంధించిన అంశం. అంటే వర్గ పోరాటాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడమని నా అభిప్రాయం. మనం వర్గరహిత సమాజాన్ని నిర్మించలేకపోయినా, కనీసం ప్రస్తుతం సమాజం కన్నా అంతరాలు తక్కువగా ఉండే సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ‘ఆవు తోకను నువ్వే ఉంచుకో, మా భూమిని మాకిచ్చెరు’ అనే నినాదం ద్వారా మేం సంఫ్‌ు పరివారపు మతతత్వ, విచ్ఛిన్నకర అజెండాను తోసిపుచ్చుతున్నాం. దళిత ఉద్యcమంలో భాగంగానే భౌతిక అంశాలను లేవనెత్తుతున్నాం. కావాలనుకుంటే మీరు దీన్ని వామపక్ష దృక్పథంగా పిలవవచ్చు.

నిజమే, చారిత్రకంగా చూసినప్పుడు భారతదేశంలో వామపక్షాలు పెద్ద పొరపాట్లే చేశాయి. అంబేద్కరైట్‌ రాజకీయాలు కూడా పెద్ద పొరపాట్లు చేశాయి. మేం వామపక్షాల పొరపాట్లనూ, లోపాలనూ విమర్శిస్తాం. అయితే వారు మా ఉద్యమంలో భాగం కావడానికి ముందుకొస్తే వారిని వద్దని ఆపబోం. ఏ రాజకీయ ఉద్యమానికైనా కనీసం ఈ మాత్రం స్పష్టత తప్పక ఉండాలి. మాకది ఉంది. వామపక్షాలు ఎంత ఎక్కువ నిలకడగా, సీరియస్‌గా దళితుల సమస్యలను లేవనెత్తితే, దళితులు వామపక్షాలను అంత ఎక్కువగా విశ్వసిస్తారు. ఇదొక క్రమ పరిణామం. కాలక్రమంలో ఇది జరుగుతుంది.

వినడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ ఆచరణలో అనేక చిక్కులొస్తాయి. ముఖ్యంగా నాయకత్వం ఎవరు వహిస్తారనే విషయంలో. ఉద్యమాలు తమ పట్టులో లేనట్టయితే వామపక్షాలు జీర్ణించుకోలేవని చరిత్ర చెబుతోంది.

మా విషయంలోనైతే, ‘ఉనా దళిత్‌ అత్యాచార్‌ లడత్‌ కమిటీ’కి సంబంధించినంత వరకు మేం, దళితులమే ఈ ఉద్యమాన్ని నియంత్రిస్తున్నాం. మాకు మద్దతు ఇవ్వడానికి వామపక్షాలు మాతో జత కలిశాయి. మీరు ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం నిజాయితీతో పోరాడినట్టయితే ప్రజలు తప్పనిసరిగా మీతో భుజం కలిపి పోరాడడానికి సిద్ధపడతారు. అయితే, ఇది మీ అవగాహన, మీ రాజకీయాల వ్యక్తీకరణ, దళిత ఉద్యమాన్ని మీరెలా మల్చాలనుకుంటున్నారు అనే అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందనుకోండి.

మీరు చాలా సార్లు దళిత-ముస్లిం ఐక్యతకున్న ప్రాముఖ్య తను నొక్కి చెప్పారు. అదంత సులువైందేమీ కాదుగా.

ఔను. రాజకీయంగా ఇదొక క్లిష్టమైన పని అని నాకు తెలుసు. కానీ కనీసం దాన్నో ఆలోచనగానైనా సరే ముందుంచగలిగితే, తప్పనిసరిగా ఏదో మేరకు ఫలితం వస్తుంది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో దళితులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కానప్పటికీ వారు పాల్గొన్నారు. ఒక దళితుడిగా అందుకు నేను సిగ్గుతో తలవంచుకుంటున్నా. దళితుల కాషాయీకరణను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియను అడ్డుకోవాలన్నా దళిత-ముస్లిం ఐక్యత అనే రాజకీయ ప్రాజెక్టు అవసరమైందే. ఇది ముస్లింల, దళితుల ఇద్దరి ప్రయోజనాలకూ అవసరమైందే. నేనోసారి సభలో మాట్లాడుతూ, నాకు ఇద్దరు చెల్లెండ్లు ఉండి ఉంటే ఒకరిని వాల్మీకీ సముదాయంలోకి, మరొకరిని ముస్లింల ఇంటికి ఇచ్చికి పెళ్లి జరిపించాలని ఆశించేవాడినని చెప్పాను. దళితుల్లో కులాంతర, మతాంతర వివాహాలు సాధారణం కావాలి. ఇప్పుడు ఇదంతా ఊహాజనితంగా అనిపించవచ్చు కానీ ఏదో ఒక రోజున వాస్తవంగా మారుతుందని నా నమ్మకం.

దళితులు సంఫ్‌ు పరివార్‌లో చేరడాన్ని మీరెలా చూస్తారు?
క్షమించండి, ఆ తెలివిమాలిన పనుల గురించి నేను వివరించలేను.

మీ భవిష్యత్‌ పథకాలేమిటి?
మేం గుజరాత్‌లోనూ, గుజరాత్‌ బైటా కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేక రాజకీయాలను అభివృద్ధి చేయాలనుకుంటు న్నామనేది తేటతెల్లం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. సెప్టెంబర్‌ 27న మేం గుజరాత్‌లో ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించబోతున్నాం. సంఫ్‌ు పరివార్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఒక విశాల కూటమిని ఏర్పాటు చేసేందుకు ఓబీసీలు, ఆదివాసులు, ముస్లింలు, రైతులు, ట్రేడ్‌ యూనియనిస్టులు అందరూ ఒక వేదికపైకి రాబోతున్నారు. గుజరాత్‌ మోడల్‌ను బట్టబయలు చేసేందుకు మేం సాంస్కృతిక, భౌతిక అంశాలను లేవనెత్తుతాం. భూమిలేని దళితులకూ, ఆదివాసులం దరికీ 5 ఎకరాల భూమి ఇవ్వాలనే డిమాండ్‌తో నరేంద్రమోడీ నియోజకవర్గమైన అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో అక్టోబర్‌ 1న రైల్‌ రోకో నిర్వహించబోతున్నాం.

(“ద హిందూ, నవ తెలంగాణ సౌజన్యంతో)

– అనువాదం
జివికె ప్రసాద్‌

First Published:  24 Sep 2016 1:57 AM GMT
Next Story