Telugu Global
Family

యయాతి

            ప్రాచీనకాలంలో జీవితం సరళంగా ఉండేది. మరోప్రపంచం కూడా మరీ అంతదూరంగా ఉండేది కాదు. యయాతి చక్రవర్తికి వందేళ్ళు వచ్చాయి. జీవితంలో అన్నీ అనుభవించాడు.  వందమంది కొడుకులు. అప్పుడు మృత్యువు అతని దగ్గరకు వచ్చింది. నువ్వు సంపూర్తిగా జీవించావు. ఇక చాలు నాతో బాటురా వెళదాం అంది. యయాతి “నేను కేవలం వంద సంవత్సరాలు మాత్రమే బతికాను అంతే. నువ్వేమో చెప్పా పెట్టకుండా వచ్చేశావు. కొంత సమయమివ్వాలి. నా కోరికలింకా తీరలేదు. నాకు సంపూర్తిగా తృప్తి కలగలేదు. […]

ప్రాచీనకాలంలో జీవితం సరళంగా ఉండేది. మరోప్రపంచం కూడా మరీ అంతదూరంగా ఉండేది కాదు. యయాతి చక్రవర్తికి వందేళ్ళు వచ్చాయి. జీవితంలో అన్నీ అనుభవించాడు. వందమంది కొడుకులు. అప్పుడు మృత్యువు అతని దగ్గరకు వచ్చింది. నువ్వు సంపూర్తిగా జీవించావు. ఇక చాలు నాతో బాటురా వెళదాం అంది. యయాతి “నేను కేవలం వంద సంవత్సరాలు మాత్రమే బతికాను అంతే. నువ్వేమో చెప్పా పెట్టకుండా వచ్చేశావు. కొంత సమయమివ్వాలి. నా కోరికలింకా తీరలేదు. నాకు సంపూర్తిగా తృప్తి కలగలేదు. జీవితం పట్ల మమకారం ఇంకా మిగిలేవుంది. నాలో వాంఛలు మిగిలే ఉన్నాయి. వాటిని రేపటికి రేపటికంటూ వాయిదా వేస్తూవస్తున్నాను. మరి నువ్వు నన్ను తీసుకుపోతే అవి అలాగే అసంపూర్తిగా మిగిలిపోతాయి” అన్నాడు.

మృత్యువు “నేను వచ్చాను, వట్టి చేతుల్తో తిరిగి వెళ్ళను. నీ బాధ చూస్తూవుంటే నాకు జాలి కలుగుతోంది. నువ్వు అంతగా అడుగుతున్నావు గనక నీకు ఇంకో వంద సంవత్సరాల వయసిస్తాను. కానీ ఎవరయినా తమయవ్వనాన్ని నీకు ఇచ్చి నీ వృద్ధాప్యాన్ని వాళ్ళు స్వీకరించడానికి సిద్ధపడితేనే అది వీలవుతుంది” అన్నది.

యయాతి అదెంతపని అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు వందమంది కొడుకులు. తండ్రి కొరకు ఆ మాత్రం త్యాగం చేయలేరా? అనుకున్నాడు. కొడుకులందర్నీ సమావేశపరిచాడు. మృత్యువు తనకోసం రావడం తన కోరికమన్నించి వందేళ్ళు ఇవ్వడం, తన వృద్ధాప్యాన్ని ఎవరయినా తీసుకుంటే వాళ్ళ యవ్వనం తనకు సంక్రమిస్తుందని అనడం వివరించాడు. కొడుకులందరూ ఒకరిమొఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ మనసుల్లో రకరకాల ఆలోచనలు కదిలాయి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిన తమ తండ్రికే జీవితం పట్ల అంతమమకారముంటే జీవితం ఇప్పుడిప్పుడే మొదలయిన తమ కెంత ఉండాలి? అని వాళ్ళు అనుకున్నారు. మౌనంగా వుండిపోయారు. ఎవరూ ముందుకురాలేదు.

అందరికన్నా చిన్నవాడయిన యయాతి కొడుకు ముందుకు వచ్చి తన యవ్వనాన్ని తండ్రికి యివ్వడానికి సిద్ధపడ్డాడు. కారణం అతను ఆలోచించాడు “మా నాన్న వంద ఏళ్ళు బతికినా బతుకుపట్ల మమకారంతో తపిస్తున్నాడు. అంటే జీవితంలో సంతృప్తి అన్నమాటకు అర్థం లేదు. జీవితం ఎండ మావి లాంటిది. జీవితం నిష్ఫలమైంది. అసలు సంతృప్తికి ఇది మార్గం కాదు. కాబట్టి నా యవ్వనాన్ని నా తండ్రికి ఇస్తాను” అని తీర్మానించుకుని తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చాడు. తండ్రి వృద్ధాప్యాన్ని తను తీసుకున్నాడు.

వందేళ్ళు గడిచాయి. అప్పుడు మళ్ళీ మృత్యువు ప్రత్యక్షమయింది. గతించిన వంద ఏళ్ళలో, తరువాత కొడుకు నించీ తీసుకున్న వంద ఏళ్ళ జీవితంలో ప్రతి కోరికా అలాగే మిగిలివుంది. ఏ కాంక్షా అదృశ్యం కాలేదు. ఒక కోరిక తీరిందనుకునేంతలో ఇంకో కోరిక మొదలవుతోంది. దీన్ని బట్టి కోరికలు అనంతమన్న సంగతి వాటికి మరణం లేదన్న సంగతి తెలుస్తోంది. అందుకే మరణం అన్న వరాన్ని భగవంతుడు మనిషికిచ్చాడన్న సంగతి యయాతి గుర్తించాడు.

ఇన్నేళ్ళు తన వృద్ధాప్యాన్ని మోసిన తన చిన్న కొడుకు చిన్నతనంలోనే జ్ఞానం గ్రహించాడని తెలుసుకుని తన వృద్ధాప్యాన్ని తను స్వీకరించి మృత్యువుతోబాటు యయాతి మృత్యులోకానికి వెళ్ళాడు.

– సౌభాగ్య

First Published:  14 Sep 2018 1:01 PM GMT
Next Story