Telugu Global
Others

మరుగుదొడ్ల వల్లే స్వచ్ఛత అసాధ్యం

బహిరంగ స్థలాల్లో మల మూత్ర విసర్జనను మాన్పించడానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం మరుగు దొడ్ల నిర్మాణాన్ని స్వచ్ఛ భారత్ పథకం కింద ప్రోత్సహిస్తోంది. ఇంతకు ముందు మరుగు దొడ్లకు సెప్టిక్ ట్యాంకులు ఉపయోగించే వారు. ఇప్పుడు కొత్త పద్ధతిలో వీటిని నిర్మిస్తున్నారు. 2014 నుంచి 2017 మధ్య నాలుగేళ్ల కాలంలో మరుగు దొడ్ల సదుపాయం 42 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అయిదు లక్షల గ్రామాల్లో బహిరంగ స్థలాల్లో […]

మరుగుదొడ్ల వల్లే స్వచ్ఛత అసాధ్యం
X

బహిరంగ స్థలాల్లో మల మూత్ర విసర్జనను మాన్పించడానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం మరుగు దొడ్ల నిర్మాణాన్ని స్వచ్ఛ భారత్ పథకం కింద ప్రోత్సహిస్తోంది. ఇంతకు ముందు మరుగు దొడ్లకు సెప్టిక్ ట్యాంకులు ఉపయోగించే వారు. ఇప్పుడు కొత్త పద్ధతిలో వీటిని నిర్మిస్తున్నారు.

2014 నుంచి 2017 మధ్య నాలుగేళ్ల కాలంలో మరుగు దొడ్ల సదుపాయం 42 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అయిదు లక్షల గ్రామాల్లో బహిరంగ స్థలాల్లో మలవిసర్జన లేదని ప్రకటించారు. కానీ ఈ లెక్కల్లో అంతా సవ్యంగా లేదు. మరుగుదొడ్లు వినియోగించడానికి అవి అందుబాటులో ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. బహిరంగ స్థలాల్లో మల విసర్జన లేని ప్రాంతాలు అని ప్రకటించిన ప్రాంతాలు పూర్తిగా బహిరంగ స్థలాల్లో మలవిసర్జన లేనివిగా లేవు.

మరుగుదొడ్ల నిర్మాణం/బహిరంగ స్థలాల్లో మలవిసర్జన లేదు అని ప్రకటించి ప్రత్యర్థులను నమ్మించడానికి ఎంత ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ అందరికీ నీటి సదుపాయం లేదు. పారిశుద్ధ్య సదుపాయాలు అంతటా లేవు. రాజ్యాంగంలోని జీవించే హక్కుకు పూచీ పడే 21వ అధికరణం ప్రకారం ఇంకా ఈ సదుపాయం లేని వారు చాలా మందే ఉన్నారు.

నీరు, పారిశుద్ధ్య సదుపాయం కలిగి ఉండడం మానవ హక్కుల్లో భాగం అని చెప్పే అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై భారత్ సంతకం చేసింది. మానవ హక్కులు కల్పించడం రాజ్య వ్యవస్థ బాధ్యత. అయినా ఈ హక్కులను పరిరక్షించడానికి మన దేశంలో ఏ చట్టమూ లేదు. న్యాయస్థానాలు ఈ పని చేయాలని చెప్తూనే ఉన్నాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంలో తీసుకుంటున్నది “కనీస” చర్యలు మాత్రమే.

బహిరంగ స్థలాల్లో మల విసర్జన లేదు అని ప్రకటించడానికి రేషన్ కార్డులు రద్దు చేయడం, విద్యుత్ సరఫరా నిలిపి వేయడం, బహిరంగ స్థలాల్లో మలవిసర్జన చేయడం సిగ్గుమాలినతనంగా పరిగణించడం మాత్రమే జరుగుతోంది. ఈ పని చేసే వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. మరిన్ని మరుగుదొడ్లు నిర్మించడానికి విద్యా రంగానికి, కమ్యూనికేషన్ రంగానికి కేటాయించిన నిధులను మళ్లిస్తున్నారు.

మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పై నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నిర్మించాలని బలవంతపెడ్తున్నందువల్ల మానవ హక్కుల ఉల్లంఘన బాహాటంగా జరుగుతోంది. ఈ సేవలు అందించే వారికి జవాబు దారీ తనం లేదు. “సురక్షితమైన” సాంకేతికతను వినియోగిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అమలులోకి వచ్చేటప్పటికి వీటిని నిర్మించుకునే వారు ఏ రకమైన మరుగుదొడ్లు నిర్మాంచాలి, ఏ సాంకేతికతను అనుసరించాలనే విషయంలో స్వేచ్ఛ లేదు.

స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించిన మరుగుదొడ్లలో మలాన్ని చేత్తో ముట్టుకోవలసిన అవసరాన్ని నిషేధించేవి లేవు అని 2017లో నిర్వహించిన “వాటర్ ఏడ్” సర్వేలో తేలింది. ఈ మరుగుదొడ్లు మంచి నీటి సదుపాయాలకు ఉండవలసినంత దూరంలో లేవు. మానవహక్కుల దృష్టి నుంచి చూస్తే సదుపాయాలను వ్యక్తులు వినియోగించుకునే హక్కు ఉండడమే కాదు ఇతరుల హక్కుకు భంగం కలగని రీతిలో ఉండడం కూడా ప్రధానం.

బహిరంగ స్థలాల్లో మలవిసర్జన లేకుండా చేయడానికి, గ్రామీణ పట్టణ ప్రాంతాల పునరుజ్జీవనానికి, వ్యర్థ పదార్థాల బెడద తప్పించడానికి అటల్ మిషన్ ప్రారంభించినప్పటికీ సంపూర్ణ ఫలితం సాధించలేకపోతున్నారు. 2017-18నాటి జాతీయ వార్షిక గ్రామీణ పారిశుధ్య సర్వే ప్రకారం వ్యర్థ పదార్థాల నిర్మూలనకు 70 శాతం గ్రామాల్లో సదుపాయాలు ఉన్నట్టు చెప్పినా 2017నాటి “వాటర్ ఏడ్” సర్వే, ప్రపంచ ఆరోగ్య సంస్థ్ సర్వే, 2015 నాటి యూనిసెఫ్ సర్వే ప్రకారం ఈ సదుపాయాలు పట్టణ ప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 9శాతం మాత్రమే ఉన్నట్టు తేలింది.

లోపాలు ఎన్ని ఉన్నప్పటికీ బహిరంగ స్థలాల్లో మలవిసర్జన శాపాన్ని తొలగించడాన్ని విధాన నిర్ణయాల పరిధిలోకి తీసుకొచ్చినందుకు మోదీని అభినందించవలసిందే. అయితే మానవ విసర్జిత వ్యర్థ పథాలను తొలగించడం నిజానికి సాంకేతిక పరిజ్ఞానంతో జరగవలసిన ప్రక్రియ. కాని ఇది ఇంకా మనుషులే చేయవలసిన దుస్థితి ఉంది అన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిరాకరిస్తున్నందువల్ల అవకాశాలను జారవిడుచుకుంటున్నట్టు అవుతోంది. సాంకేతికతను వినియోగించి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఉండవలసినంత శ్రద్ధ ఉండడం లేదు.

ప్రత్యామ్నాయ సాంకేతికతను వినియోగించి మరుగుదొడ్లను నిర్మించడంలో కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు సమకూరవచ్చు. ప్రముఖులు వీటి గురించి ప్రకటనలు చేయవచ్చు. ఇది ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉపకరించవచ్చు. కానీ పారిశుద్ధ్య బాధ్యత అట్టడుగు కులాల వారిదే అన్న ఆలోచనా ధోరణి మాత్రం మారలేదు. “స్వచ్ఛతే సేవ” అన్న మోదీ నినాదం ఈ ప్రకంపనలకే పరిమితమా? వాల్మీకుల గురించి ఆయన రాతలు చూస్తే ఈ అనుమానం కలుగుతోంది. “ఏదో ఒక సమయంలో దేవతలు వారికి (వాల్మీకులకు) ఈ బాధ్యత అప్పగించారేమో” అనిపిస్తుంది అని మోదీ రాశారు.

అంటే పారిశుద్ధ్య పని అట్టడుగు కులాల వారిదేనని ఆయన అభిప్రాయపడుతున్నట్టే కదా! మరో వేపు మురుగును తొలగించే సరైన వ్యవస్థ లేకుండా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఈ అంశంపై నివేదిక ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితి నియమించిన ప్రత్యేక ప్రతినిధి లియో హెల్లర్ 2017నాటి నివేదికలో స్వచ్ఛ భారత్ మిషన్ ఇతరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, పారిశుద్ధ్య పనిలో నిమగ్నమైన కింది కులాలవారి హక్కులను ఉల్లంఘిస్తోందని చెప్పారు.

స్వచ్ఛ భారత్ మిషన్ అమలులో వివక్ష కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అందులో కుల వివక్ష మాత్రమే కాక స్త్రీ పురుషుల వివక్ష కూడా ఇమిడి ఉంది. ప్రస్తుతం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు దివ్యాంగులకు, అలింగులకు, మహిళలకు, ముఖ్యంగా రుతుస్రావ సమయంలో ఉన్న మహిళలకు అనుకూలంగా లేవని హెల్లర్ తన నివేదికలో పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లలో కేవలం 62 శాతం మాత్రమే బాలికలు వినియోగించుకోవడానికి అనువుగా ఉన్నాయని 2016నాటి విద్యా సంబంధ వార్షిక నివేదికలో తెలియజేశారు.

నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించిన మానవహక్కులను పరిరక్షించడానికి భారత్ అనేక అంతర్జాతీయ ఒడంబడికలపై సంతకాలు చేసింది. వీటి ప్రకారం ఏ రకంగానూ వివక్ష ఉండకూడదు. కానీ ఆ వివక్ష తప్పడం లేదు. ఈ ఒప్పందాలు కేవలం మోదీని “పరిశుభ్రత”కు ప్రతీకగా ప్రచారం చేయడానికి మాత్రమే ఉపయోగపడవచ్చు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  15 Oct 2018 9:21 AM GMT
Next Story